రాజ్యాంగం కంటే వెనకబడినవారు ఏం విప్లవకారులు
ABN , Publish Date - Jun 13 , 2025 | 06:16 AM
మావోయిస్టుల శాంతి చర్చల ప్రకటనలో రెండుసార్లు రాజ్యాంగ విలువల ప్రస్తావన రావటాన్ని ఒక విశేషంగా గుర్తిస్తూ, డానీ రాసిన, పాలకులు–మావోయిస్టులు, మధ్య రాజ్యాంగం! అనే వ్యాసానికి (ఆంధ్రజ్యోతి–ఏప్రిల్ 15) కొనసాగింపుగా ‘రాజ్యాంగంపై...

మావోయిస్టుల శాంతి చర్చల ప్రకటనలో రెండుసార్లు రాజ్యాంగ విలువల ప్రస్తావన రావటాన్ని ఒక విశేషంగా గుర్తిస్తూ, డానీ రాసిన, పాలకులు–మావోయిస్టులు, మధ్య రాజ్యాంగం! అనే వ్యాసానికి (ఆంధ్రజ్యోతి–ఏప్రిల్ 15) కొనసాగింపుగా ‘రాజ్యాంగంపై మావోయిస్ట్ అవగాహన స్పష్టమే’ అంటూ మే 8న పాణి ఒక వ్యాసం రాశారు. పాణి తన వ్యాసంలో, ‘‘పౌర హక్కులు, చట్టబద్ధ పాలన, ఆదేశిక సూత్రాలు అనేవి రాజ్యాంగంలో భాగం కావటం చారిత్రకంగా ప్రగతిశీలమైన విషయం. ...పీడిత సమూహాల రక్షణలో ఎంతో కొంత సానుకూల పాత్ర పోషిస్తుంది. ...అయినప్పటికీ సానుకూల అంశాలు వాటంతటవి అమలు కావటం లేదు. ఈ సానుకూల అంశాలను ప్రభుత్వాలు బాహటంగా ఉల్లంఘిస్తున్నాయి. దీనికి తోడు సామాజిక వివక్షల వల్ల కూడా రాజ్యాంగం అమలులోకి రావడం లేదు,’’ అంటున్నారు. నిజమే. మొదటి రెండు పారిశ్రామిక తీర్మాన విధానాలు తప్ప ఆ తరువాత వచ్చినవన్నీ రాజ్యాంగ లక్ష్యాలకు భిన్నమైనవే. అలాగే పాణి అన్నట్లు అనేక సానుకూల అంశాలు అమల్లోకి రావడం లేదనేదీ వాస్తవమే. అప్పుడు ఏం చేయాలి? సానుకూల అంశాలు అమల్లోకి రావడానికి పోరాటాలు చేయాలి. ఇక్కడ సమస్య పోరాటాల గురించి కాదు, ఆ పోరాటాల కోసం మావోయిస్టులు ఎంచుకున్న సాయుధ పంథా గురించి. దీన్ని ఆయన గుర్తించడం లేదు. అలాగే విప్లవం రాజ్యాంగ పరిధిలో లేని విషయం అంటూనే రాజ్యాంగ పరిధిలో శాంతి చర్చలు జరగాలంటున్నారు. మరి విప్లవం అనేది ఒక్క మావోయిస్టు పార్టీకి మాత్రమే లక్ష్యంగా ఉందా? ఇతర ఎమ్ఎల్ పార్టీలకు గాని కమ్యూనిస్టు పార్టీలకు గాని లక్ష్యంగా లేదా? అంటే ఉంది. అటువంటప్పుడు వారికి లేని రాజ్యాంగపరమైన సమస్య కేవలం మావోయిస్టు పార్టీ వారికి ఎందుకు కలుగుతుంది? ఇది కదా మౌలిక ప్రశ్న. రాజ్యాంగంలో సానుకూల అంశాలు ఉన్నాయనే అవగాహన మావోయిస్ట్ ఉద్యమానికి మొదటి నుండి ఉన్నట్లు, అందుకోసం పోరాటం చేస్తున్నట్లు పాణి చెప్పుకొస్తున్నారు. మరి అలాంటి వైఖరి ఉన్నవాళ్లు ఈ రాజ్యాంగాన్ని కూల్చేస్తామని ఎందుకంటారు? మరొక దగ్గర రాజ్యాంగంలోని సమానత్వ భావనకు వ్యతిరేకంగా ప్రభుత్వాలు అనుసరిస్తున్న అభివృద్ధి విధానాల వల్ల దోపిడీ, పీడనలు పెరుగుతున్నాయని పాణి అంటారు. అటువంటప్పుడు రాజ్యాంగం విప్లవకరమైనదని చెబుతున్నట్లే కదా! కానీ మావోయిస్టుల సమర్థన కోసం మరలా ఇలా దోపిడీ, పీడనలు పెరగటానికి రాజ్యాంగంలోనే అవకాశాలు ఉన్నాయని, అలాంటి సమస్యల వల్లనే విప్లవోద్యమం పుట్టుకొచ్చిందని చెప్పటం ఎలా సరైనది అవుతుంది? నిజంగా నక్సల్బరీ ఉద్యమం భూ సమస్య కేంద్రంగా మొదలైందన్నది అందరికీ తెలిసిందే. భూ సమస్య అనేది పెట్టుబడిదారీ పూర్వ వ్యవస్థ తాలూకు అవశేషం. నిజంగా పెట్టుబడిదారీ పూర్వ వ్యవస్థ అయిన భూస్వామ్యం రద్దు లక్ష్యంగా వ్యవసాయక విప్లవం ఇరుసుగా భావించే వారికి ఈ బూర్జువా రాజ్యాంగం అడ్డు కాదు. మావోయిస్టు పార్టీయే కాదు అన్ని కమ్యూనిస్టు పార్టీలు రాజ్యాంగాన్ని బూర్జువా రాజ్యాంగంగానే గుర్తిస్తున్నాయి. బూర్జువా రాజ్యాంగం పెట్టుబడిదారుల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తుంది అనే దానిలో ఎవరికీ సందేహం లేదు.
అందుకనే కమ్యూనిస్టులు మొదట్లో ఈ రాజ్యాంగాన్ని కూల్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. రాజ్యాంగం పట్ల మొదటినుంచీ కమ్యూనిస్టులకు వ్యతిరేకత ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయినప్పటికీ కమ్యూనిస్టు పార్టీల వైఖరిలో ప్రస్తుత కాలంలో మార్పులు చూస్తున్నాం. అందువల్లనే వారు రాజ్యాంగ పరిరక్షణ అనే పిలుపులను ఇస్తున్నారు. కానీ మావోయిస్టులు ఇలాంటి పిలుపును ఇచ్చిన సందర్భం కానీ, దానికోసం వారి కార్యచరణను కానీ మనం చూడం. కానీ ఇలాంటి వైఖరి వారు కలిగి ఉన్నట్లు, పోరాటం చేస్తున్నట్లు పాణి చెప్పుకొస్తున్నారు. మావోయిస్ట్లు తాము ఎంచుకున్న సాయుధ పోరాటాన్ని మైదాన ప్రాంతాలలో ఉండి చేసే వీలులేని కారణంగానే గిరిజన ప్రాంతాలను ఆశ్రయించాల్సిన పరిస్థితికి నెట్టబడ్డారు. పాణి దీనికి సమర్థనగా ‘నూతన ప్రజాస్వామిక విప్లవమంటే భూములు పంచడమే కాదు. అర్ధ భూస్వామ్యానికి, కార్పొరేట్ పెట్టుబడిదారీ విధానానికి, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా సాగే విస్తృత పోరాటం’ అనే వ్యాఖ్యానాన్ని జోడిస్తున్నాడు. మరి అన్ని ఎమ్ఎల్ పార్టీలూ ఇదే లక్ష్యాన్ని కలిగి ఉన్నాయి కదా. మరి మావోయిస్టులకు ఎదురైన సమస్యలు వారికి ఎందుకు కలగటం లేదు. అంటే వారు ఏమీ పోరాటాలు చేయటం లేదనా? కేవలం మావోయిస్టులే చేస్తున్నారనా? నిజంగా కార్పొరేట్ హిందుత్వ ఫాసిజంకు వ్యతిరేకంగా మావోయిస్టులు పోరాటం చేస్తున్నట్టయితే వారు బలంగా ఉన్న ప్రాంతాల్లో బీజేపీ ఓడిపోవాలి కదా? అలా ఎందుకు జరగటం లేదు? వెనుకబాటు, ఆటవిక జీవనం కలిగిన గిరిజనులు చేస్తున్న పోరాటాన్ని వర్గ పోరాటంగా మార్క్స్ అసలు ఎక్కడైనా చెప్పాడా? అంటే గిరిజనులు ఎల్లాకాలం ఆటవిక జీవనంలోనే ఉండిపోవటాన్ని విప్లవంగా చెప్పాడా? అలా ఉండిపోవటమే సోషలిస్టు విప్లవ లక్షణం అవుతుందా? అలాగే అడవుల పరిరక్షణ, అక్కడున్న వనరుల సంరక్షణ కేవలం అమాయక గిరిజనుల బాధ్యత అవుతుందా? ఇందుకోసం సాయుధపంథా ఎంచుకోవటం సరైనదేనా? వాస్తవానికి 1850లోనే ఇంటర్నేషనల్ కమ్యూనిస్టు లీగ్ 21 సంవత్సరాలు నిండిన యువతీ యువకులకు ఓటు హక్కు ఉండాలని, మంచి అభ్యర్థులను ఎన్నికల్లో నిలపాలని డిమాండ్ చేసింది. ఏ మాత్రం గెలవని చోట కూడా కమ్యూనిస్టు లీగ్ తన అభ్యర్థులు నిలపాలని మార్క్స్ చెప్పాడు. కమ్యూనిస్టు ఉద్యమ మూలకర్తలు ఇలా చెబుతున్నప్పటికీ దానికి భిన్నంగా సాయుధ పంథా ఆధారంగా ముందుకు సాగిపోవాలని పాణి సూచిస్తున్నారు. రాచరిక కాలం నాటి సాయుధ పోరాటపంథా పోయి ఎన్నికల్లో పాల్గొనే విధానం అమల్లోకి వచ్చి 175 సంవత్సరాలు దాటినప్పటికీ ఇంకా అదే పాత పంథా కొనసాగాలని పిలుపు ఇవ్వడంలో విప్లవ లక్షణం ఉన్నదా? పాణి తన వ్యాసంలో అనేక చోట్ల విప్లవం, విప్లవోద్యమం అనే పదాలు వాడారు.
నిజంగా మావోయిస్టులు ఏ రకంగా విప్లవకారులో, వారి కార్యక్రమంలోనూ కార్యాచరణలోనూ ఉన్న విప్లవ లక్ష్యాలు ఏమిటో వివరించగలరా? భూములు పంచటం అనే ఒక మాట తప్పించి మిగతా ఏ విషయాలలో వారు విప్లవకారులు? నిజానికి అన్ని కమ్యూనిస్టు పార్టీలలో వారి కార్యక్రమాన్ని చూసినా, వారి కార్యాచరణ చూసినా విప్లవ లక్షణాలు ఏమీ కానరావు. వారి కంటే కూడా ఈ బూర్జువా రాజ్యాంగమే విప్లవకరంగా ఉంది. అందుకనేగా మార్క్సిస్ట్ మేధావి ప్రభాత్ పట్నాయక్ 1950 రాజ్యాంగం అమలుతో భారతదేశంలో దీర్ఘకాలిక విప్లవం ప్రారంభమైందని అంటున్నాడు. దీన్ని గుర్తించడంలో మొదటి నుంచీ కమ్యూనిస్టులు విఫలమే! అందువల్లనే ఈ రాజ్యాంగం కంటే కూడా 75 ఏళ్లు వెనుకబడిపోయారు. ఇలాంటి వాళ్లు విప్లవకారులు ఎలా అవుతారో మరి.
ప్రొఫెసర్ పట్టా వెంకటేశ్వర్లు
ఈ వార్తలు కూడా చదవండి..
కూలిన విమానంలో గుజరాత్ మాజీ సీఎం.. ఆయన చివరి ఫొటో ఇదే..
లోపం ఉందని ముందే చెప్పినా.. పట్టించుకోని ఎయిర్ ఇండియా
For National News And Telugu News