Trump Impact on India: తెంపరి ట్రంప్తో తిప్పలు
ABN , Publish Date - May 18 , 2025 | 01:00 AM
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గత కొన్ని కాలంలో భారత్కు వ్యతిరేకంగా చేసే ప్రకటనలు ప్రధానమంత్రి మోదీకి రాజకీయంగా ఇబ్బందులు సృష్టిస్తున్నాయి. ట్రంప్ చేయు ప్రకటనలు మన దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా మారిపోతున్నాయి.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశీ గడ్డపై నుంచి చేస్తున్న ప్రకటనలు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సొంత గడ్డపై ఆత్మరక్షణలో పడేస్తున్నాయి. ట్రంప్ ప్రకటనలతో అమెరికా మనకు మిత్ర దేశమా? శత్రు దేశమా? అని తేల్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. మొదటి పర్యాయం అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ మన దేశానికి మిత్రుడిగా వ్యవహరించగా, రెండో పర్యాయం మాత్రం అనుకూల శత్రువుగా మారిపోయారు. ఆయన ప్రకటనలు దేశ ప్రయోజనాలకే కాకుండా ప్రధాని మోదీ రాజకీయ ప్రయోజనాలకు కూడా ముప్పుగా పరిణమిస్తున్నాయి. పహల్గాం దారుణం తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్తో మోదీ ప్రతిష్ఠ ఇంటా బయటా పెరిగింది. ఈ నేపథ్యంలో ఆపరేషన్ సిందూర్ హఠాత్తుగా ఆగిపోవడం, ఇందుకు సంబంధించిన ప్రకటనను భారత్, పాకిస్థాన్లు అధికారికంగా చేయకముందే రెండు దేశాల మధ్య రాజీ కుదిరిందని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో దేశ ప్రజలు నివ్వెరపోయారు. రెండు దేశాల మధ్య అమెరికా దౌత్యపరంగా రాజీ కుదిర్చితే కుదర్చవచ్చునుగానీ, ఆ విషయాన్ని ఆయా దేశాలు ప్రకటించక ముందే ట్రంప్ తన ‘ట్రూత్’ ఖాతా ద్వారా ప్రకటించడంతో మన ప్రధాని మోదీ ప్రతిష్ఠకు మచ్చ ఏర్పడింది. అప్పటి నుంచి ట్రంప్ వరుసగా చేస్తున్న ప్రకటనలు మన దేశ ప్రయోజనాలకు ముప్పుగా పరిణమించాయి. భారత్తో పోల్చితే చైనా వైపే ట్రంప్ చూడటం దిగ్ర్భాంతి కలిగిస్తోంది. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మన ప్రధాని మోదీని తెలివైనవారు అని ప్రశంసించిన ట్రంప్ ఇప్పుడు చేస్తున్న ప్రకటనలతో మోదీని ఇబ్బందుల్లోకి నెడుతున్నారు.
సత్తా చాటిన ‘సిందూర్’.. అంతలోనే!
ఆపరేషన్ సిందూర్తో భారత్ తన సైనిక పాటవాన్ని ప్రపంచానికి తెలియజేసింది. అంతర్జాతీయ సరిహద్దులను అతిక్రమించకుండానే మన శత్రు దేశమైన పాకిస్థాన్లో ఉగ్రవాదులను మట్టుబెట్టడమే కాకుండా, ఆ దేశ వైమానిక స్థావరాలను కూడా ధ్వంసం చేయగలిగాం. అదే సమయంలో పాక్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లు మన దేశంలో నష్టం చేయకముందే వాటిని కూల్చివేశాం. దీంతో పాక్పై మనది పైచేయి అయింది. పహల్గాం తర్వాత పాక్పై పగ ప్రతీకారాలతో రగిలిపోయిన దేశ ప్రజలకు ఈ పరిణామం ఊరటనిచ్చింది. ఈ దశలో భారత్–పాక్ మధ్య యుద్ధం ముదురుతుందన్న భావన ఏర్పడింది. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హఠాత్తుగా చేసిన ప్రకటనతో మన దేశ ప్రజలు నిశ్చేష్టులయ్యారు. ఈ ఆధునిక యుగంలో యుద్ధాలు వాంఛనీయం కాదు. ఎంత జటిలమైన సమస్యనైనా చర్చలు, సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవచ్చు. అందునా, అణ్వాయుధాలు కలిగి ఉన్న రెండు దేశాల మధ్య పూర్తి స్థాయి యుద్ధం జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఇలాంటి సందర్భాలలో ఉభయులకూ కావల్సిన దేశాలు మధ్యవర్తిత్వం నెరపడం కొత్తకాదు. అయితే యుద్ధరంగంలో తలమునకలై ఉన్న దేశాలతో నిమిత్తం లేకుండా రాజీకి చొరవ తీసుకున్న దేశాధినేతే ప్రకటన చేయడం ఇబ్బందిగా మారింది. అగ్రరాజ్యం మోచేతి కింద నీళ్లు తాగుతూ బతికే దేశాల విషయంలో ఇలా జరిగితే జరగవచ్చుగానీ, ప్రపంచంలోనే తృతీయ ఆర్థిక శక్తిగా ఎదగడానికి పరుగులు తీస్తున్న భారత్వంటి దేశం విషయంలో మన ప్రమేయం లేకుండా ప్రకటన రావడం అవమానకరంగా దేశ పౌరులు భావిస్తున్నారు. యుద్ధానికి సంబంధించిన రాజీ ప్రకటనతో ఆగిపోకుండా ట్రంప్ తన వరుస ప్రకటనలతో మన నాయకత్వాన్ని మరింత ఇబ్బందికర స్థితిలోకి నెట్టారు. చైనాపై అడ్డగోలుగా వేసిన పన్నులను తిరిగి పూర్వ స్థితికి తీసుకువస్తున్నట్టు ప్రకటించిన ట్రంప్, భారత్ విషయంలో మాత్రం పన్నులు తగ్గించేది లేదని ప్రకటించారు. ఉభయ దేశాల మధ్య వాణిజ్య చర్చలు జరుగుతుండగానే అమెరికా నుంచి దిగుమతి చేసుకొనే వస్తువులపై జీరో టాక్స్ అమలుకు భారత్ అంగీకరించిందని ప్రకటించడం ద్వారా ట్రంప్ మరోసారి మన ప్రధాని మోదీని ఆత్మరక్షణలోకి నెట్టారు. అంతటితో ఆగకుండా ‘యాపిల్’ కంపెనీ తన ఐఫోన్ల ఉత్పత్తిని భారత్లో చేపట్టకూడదని తాను ఆ సంస్థను కోరానని మరో బాంబు పేల్చారు. ఈ ప్రకటనలన్నీ భారత్ ప్రయోజనాలకు విరుద్ధమైనవే.
ట్రంప్ తీరే వేరు...
మామూలుగా అయితే దేశాధినేతలు హుందాగా ప్రవర్తిస్తారు. ఇతర దేశాల ఆంతరంగిక వ్యవహారాలతో పాటు వాణిజ్యపరమైన అంశాలపై బహిరంగంగా ప్రకటనలు చేయరు. ఆయా దేశాలతో అవగాహన లేదా ఒప్పందాలు కుదిరినప్పుడు సంబంధిత శాఖల ద్వారా అధికారిక ప్రకటనలు చేయిస్తారు. అయితే, డొనాల్డ్ ట్రంప్ స్టయిలే వేరు. రెండవ పర్యాయం అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఆయన తానొక అగ్రరాజ్యాధి నేతలా కాకుండా సాదాసీదా నాయకుడిగా ఎడాపెడా ప్రకటనలు చేస్తూ నోటికి పని చెబుతున్నారు. వాణిజ్య పన్నులకు సంబంధించి ఆయన చేసిన ప్రకటనలతో ప్రపంచ దేశాలు దిగ్ర్భాంతికి గురయ్యాయి. స్వదేశంలో కూడా ట్రంప్పై వ్యతిరేకత పెరిగింది. భారత్–పాక్ ప్రధానమంత్రులు కలిసి కూర్చొని డిన్నర్ చేస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని ట్రంప్ తన వాచాలత్వం ప్రదర్శించారు. దాయాదుల మధ్య పోరు ఈనాటిది కాదు. ఇద్దరు ప్రధానులూ కూర్చొని భోజనం చేసినంత మాత్రాన పరిష్కారమయ్యే వైషమ్యాలా ఇవి? ప్రధానులు సరే అనుకున్నప్పటికీ 140 కోట్ల మంది భారతీయులు, 25 కోట్ల మంది పాకిస్థానీలను సంతృప్తిపరచడం సాధ్యమా? ఇలాంటి క్లిష్టమైన అంశాలను కూడా ట్రంప్ తేలికగా తీసుకోవడం ఆశ్చర్యంగా ఉంది. యావత్ ప్రపంచానికే తనను నాయకుడిగా ప్రకటించుకోవాలన్న దుగ్ధతోనే బహుశా ట్రంప్ ఇలా ప్రవర్తిస్తున్నారేమో తెలియదు. ఐదు దశాబ్దాల క్రితమే మన ప్రధాని ఇందిరాగాంధీ అమెరికా ఆధిపత్య ధోరణిని తిరస్కరించారు. అప్పటితో పోల్చితే భారత్ ఇప్పుడు ఆర్థికంగా, సైనిక పరంగా ఎన్నో రెట్లు బలపడింది. ఈ దశలో జనాభా పరంగా కూడా ద్వితీయ స్థానంలో ఉన్న భారత్ను సామంత రాజ్యంగా పరిగణించాలని అగ్రరాజ్యాధినేత భావించడాన్ని మన దేశ పౌరులు జీర్ణించుకోలేకపోతున్నారు. అమెరికాతో వాణిజ్య సంబంధం లేకపోతే ప్రపంచ దేశాలు మనుగడ సాగించలేవు అన్నట్టుగా ట్రంప్ తెంపరితనం ప్రదర్శిస్తున్నారు. ఇంతా చేస్తే అమెరికా జనాభా 35 కోట్లు మాత్రమే. 140 కోట్ల జనాభా ఉన్న దేశాన్ని 35 కోట్ల జనాభా ఉన్న అమెరికా వాణిజ్యపరంగా నియంత్రించాలని అనుకోవడం ఏమిటి? అని మన దేశ ప్రజలు సహజంగానే ప్రశ్నిస్తున్నారు. భారత్ విషయంలో ట్రంప్ వైఖరి మారడానికి కారణాలు తెలియాల్సి ఉంది. చైనాకు ఇస్తున్న ప్రాధాన్యత కూడా మనకు ఇవ్వకపోవడంపై భారతీయులు ఆగ్రహంగా ఉన్నారు. యుద్ధం ఆపేయకపోతే మీ రెండు దేశాలతో వాణిజ్య సంబంధాలను తెగదెంపులు చేసుకుంటానని బెదిరించడంతో... పాక్తో పాటు భారత్ కూడా దారికి వచ్చిందని ట్రంప్ చెప్పుకొంటున్నారు. ఈ ప్రకటనతో మన విదేశాంగ శాఖ విభేదించింది. నిజంగా కూడా అమెరికాతో వాణిజ్య సంబంధాలు లేకపోతే మన దేశం మనుగడ సాగించలేదా? ఈ విషయమై నిజానిజాలను ప్రజలకు తెలియజేయాల్సి ఉంది. అమెరికా అధ్యక్షుడిగా ఎవరున్నా తమ దేశ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తారు. అది సహజం కూడా. ఈ క్రమంలోనే మిత్ర దేశాలకు అవసరమైన ఆర్థిక, ఆయుధ సహకారాన్ని అమెరికా అందిస్తూ వస్తోంది. నిన్న మొన్నటి వరకు భారత్ను మిత్ర దేశంగా అమెరికా పరిగణించింది. అయితే, ఇప్పుడు పరిస్థితులు మారిపోతున్నాయి. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్కు అండగా నిలిచిన తుర్కియేకు క్షిపణులు సరఫరా చేయడానికి అమెరికా సిద్ధపడింది. ఇది దేనికి సంకేతం? మన విదేశాంగ విధానంలోనే లోపం ఉందా? లేక ప్రపంచ దేశాల వైఖరి మారుతోందా? ఏది ఏమైనా డొనాల్డ్ ట్రంప్ ప్రకటనలతో ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చింది అన్నట్టుగా పరిస్థితి తయారైంది. ట్రంప్ ప్రకటనలు భారత్ ప్రయోజనాలకు విరుద్థంగా ఉన్నప్పటికీ ప్రధానమంత్రి మోదీ నోరు విప్పకపోవడం ఏమిటి? ఆపరేషన్ సిందూర్ విషయంలో కూడా ముందుగా ట్రంప్ నుంచి ప్రకటన రావడం ఏమిటి? ఇటువంటి ప్రశ్నలను ప్రతిపక్షాలు సంధిస్తున్నాయి. అయితే ట్రంప్ తన నోటికి పని చెబుతున్నారని చెప్పి మన ప్రధాని కూడా ప్రతి దానికీ వివరణ ఇవ్వాలని ఆశించడం తగదు. దేశాధినేతలు చాలా హుందాగా, గుంభనంగా ఉండాలి. పరస్పరం గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి. ఇతర దేశాధినేతలు తనకు సబార్డినేట్స్ అన్నట్టుగా ట్రంప్ వ్యవహరిస్తున్నట్టు ఇతర దేశాధినేతలు కూడా వ్యవహరించాలని కోరుకోలేం. బహుశా ఈ కారణంగానే కాబోలు ప్రధాని మోదీ గుంభనంగా ఉంటున్నారు. అమెరికా నుంచి దిగుమతయ్యే వస్తువులపై జీరో టాక్స్కు మనం సిద్ధపడ్డామని ట్రంప్ ప్రకటించినా ప్రధాని మోదీ తాను స్పందించకుండా విదేశాంగ శాఖ మంత్రి ద్వారా ప్రకటన చేయించారు. వాణిజ్య పరమైన అంశాలపై చర్చలు కొనసాగుతున్నాయని, తుది నిర్ణయం ఏదీ తీసుకోలేదని విదేశాంగ శాఖ వివరణ ఇచ్చింది.
‘సుప్రీం’ అధికారాలు...
ఈ విషయం అలా ఉంచితే, రాష్ర్టాల చట్టసభలు ఆమోదించిన బిల్లులను నిర్దుష్ట కాల వ్యవధిలోపే గవర్నర్లుగానీ, రాష్ట్రపతిగానీ ఆమోదించడమా లేదా తిరస్కరించడమా? ఏదో ఒకటి చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆక్షేపణ తెలుపుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. రాష్ట్రపతికి గడువు విధించడమా? రాజ్యాంగంలోనే ఆ అధికారం లేనప్పుడు సుప్రీంకోర్టు అలాంటి తీర్పు ఎలా ఇస్తుంది? ఇచ్చినా ఎలా చెల్లుబాటు అవుతుంది? అని రాష్ట్రపతి సుప్రీంకోర్టును నేరుగా ప్రశ్నించారు. రాజ్యాంగంలో కాలపరిమితి లేనప్పుడు సుప్రీంకోర్టు ఎలా కాలపరిమితి విధిస్తుందని కూడా రాష్ట్రపతి ప్రశ్నించారు. ఇదొక అసాధారణ పరిణామం! రాజ్యాంగపరంగా ఉత్పన్నమైన అతి క్లిష్టమైన సమస్య ఇది. ప్రత్యేక పరిస్థితులలో తమకు అసాధారణ అధికారాలను రాజ్యాంగం కల్పించిందని, ఆ అధికారాలతోనే రాష్ట్రపతికి, గవర్నర్లకు గడువు విధిస్తున్నామని సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. దీంతో కొంత మంది న్యాయ నిపుణులు సుప్రీంకోర్టుకు మద్దతుగా, మరికొంత మంది రాష్ట్రపతికి మద్దతుగా తమ వాదనలు వినిపిస్తున్నారు. అయితే ఇలాంటి సంక్లిష్ట పరిస్థితి తలెత్తడానికి ఎవరు కారణమో ముందుగా తెలుసుకోవాలి. తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం ఆమోదించిన బిల్లులను ఆ రాష్ట్ర గవర్నర్ నెలల తరబడి పెండింగ్లో పెట్టారు. రాజ్యాంగం ప్రకారం న్యాయ వ్యవస్థ, చట్టసభలు, గవర్నర్లు, రాష్ట్రపతి ఎవరికి వారు తమ పరిధిలో స్వతంత్రంగా వ్యవహరించాలి. ఒకరి అధికార పరిధిలోకి మరొకరు చొరబడకూడదు. అయితే.. ఇటీవల దేశంలో, ముఖ్యంగా కొన్ని రాష్ర్టాల చట్టసభల్లో చోటుచేసుకుంటున్న పరిణామాల వల్ల సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవలసిన పరిస్థితి ఏర్పడుతోందని చెప్పవచ్చు. బిల్లుల విషయం అలా ఉంచితే చట్టసభల సభ్యులు తమ సభ్యత్వాలకు రాజీనామా చేసినప్పుడు స్పీకర్లు లేదా చైర్మన్లు వాటిని ఆమోదించకుండా ఏళ్ల తరబడి పెండింగ్లో పెడుతున్నారు. పార్టీ ఫిరాయించిన సభ్యుల విషయంలో కూడా ఇలాగే జరుగుతోంది. తెలుగు రాష్ర్టాల విషయానికి వస్తే, ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొంతమంది కాంగ్రెస్ శాసనసభ్యులు తమ సభ్యత్వానికి రాజీనామా చేసి జగన్మోహన్రెడ్డి ఏర్పాటు చేసిన వైసీపీలో చేరారు. వారి రాజీనామాలు ఆమోదిస్తే, ఉప ఎన్నికలు వస్తాయి. అదే జరిగితే అప్పటి పరిస్థితులలో వైసీపీ విజయం సాధించేది. ఈ కారణంగా సభ్యుల రాజీనామాలను అప్పటి స్పీకర్ నాదెండ్ల మనోహర్ పెండింగ్లో పెట్టారు. తర్వాత రాష్ట్రం విడిపోయింది. తెలంగాణలో తెలుగుదేశం తరపున ఎన్నికైన తలసాని శ్రీనివాసయాదవ్ను పార్టీలో చేర్చుకొని మంత్రివర్గంలో చోటు కల్పించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంకల్పించారు. అయితే, అప్పటి గవర్నర్ నరసింహన్ తెలుగుదేశం తరఫున ఎన్నికైన తలసాని శ్రీనివాస్ యాదవ్తో ప్రమాణ స్వీకారం చేయించడానికి నిరాకరించారు. దీంతో ఆయనతో ఉత్తుత్తి రాజీనామాను స్పీకర్కు అందజేయించారు. చట్టంలోని లోపాలను అలా వాడుకున్నారు. ఆ తర్వాత ఇదే ట్రిక్కును ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం కూడా వాడుకుంది. వైసీపీ తరఫున గెలిచిన భూమా అఖిల ప్రియతో ఉత్తుత్తి రాజీనామా చేయించి మంత్రివర్గంలోకి తీసుకున్నారు. రెండు రాష్ర్టాలలో సదరు రాజీనామాలు ఆమోదం పొందిందీ లేదు– ఉప ఎన్నికలు వచ్చిందీ లేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్లో మళ్లీ చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. జగన్రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు శాసనమండలికి ఎన్నికైన కొంత మంది సభ్యులు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించి శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే, శాసనమండలి చైర్మన్గా ఉన్న ఆయన వైసీపీకి చెందినవారు కావడంతో ఆయా సభ్యుల రాజీనామాలను ఆమోదించడంలేదు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం పోయి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. దీంతో భారత రాష్ట్ర సమితి తరఫున గెలిచిన కొంత మంది సభ్యులు కాంగ్రెస్లో చేరారు. ఇలా చేరిన వారిపై పార్టీ ఫిరాయింపుల చట్టం కింద చర్యలు తీసుకోవాలని శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్ను బీఆర్ఎస్ అర్థిస్తూ వచ్చింది. అయినా ఫలితం లేకపోవడంతో వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. ఇవన్నీ అవాంఛనీయ పరిణామాలే.
ఎవరి బాధ్యత ఎంత?
చట్టసభల స్పీకర్లు, చైర్మన్లు తమ బాధ్యతలను సక్రమంగా నెరవేర్చి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. తమ రాజీనామాలను ఎంతకూ ఆమోదించనప్పుడు సదరు సభ్యులకు ఉన్న ప్రత్యామ్నాయం ఏమిటి? న్యాయ వ్యవస్థనే కదా వారు ఆశ్రయించవలసింది? రాజీనామాల విషయంలోనైనా, ఫిరాయింపుల విషయంలోనైనా సకాలంలో నిర్ణయాలు తీసుకొని ఉంటే న్యాయస్థానాలు జోక్యం చేసుకొనే అవసరం ఏర్పడదు కదా? అలాగే చట్టసభలు ఆమోదించిన బిల్లులను పెండింగ్లో పెట్టుకోవడం కూడా సమర్థనీయం కాదు. అలాంటి బిల్లులు ఏవైనా రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంటే వాటిని తిప్పి పంపే అధికారం గవర్నర్లకు ఉంటుంది. గవర్నర్లు ఆ పని చేయకుండా నెలలు, ఏళ్ల తరబడి పెండింగ్లో పెడితే చట్టసభల స్వతంత్ర ప్రతిపత్తిని హరించడమే అవుతుంది కదా? ఈ కారణంగానే తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడం, నిర్దుష్టంగా మూడు నెలల గడువులోగా బిల్లులను ఆమోదించడమో లేదా తిరస్కరించడమో చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ తీర్పు రాజ్యాంగ విరుద్ధం అని అనుకుంటే తమిళనాడు చట్టసభల స్వతంత్ర ప్రతిపత్తి పరిస్థితి ఏమిటి? ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి లేని అధికారం గవర్నర్లకు ఉంటుందా? ఏ వ్యవస్థకైనా రాజ్యాంగమే గీటురాయి. రాజ్యాంగ నిర్మాతలు ఊహించని కొత్త సమస్యలు ఇప్పుడు వస్తున్నాయి. బిల్లులను ఇలా దీర్ఘకాలం ఎటూ తేల్చకుండా పెండింగ్లో పెడతారని రాజ్యాంగ నిర్మాతలు ఊహించి ఉండరు. అలాగే చట్టసభల స్పీకర్లు, చైర్మన్లు రాజీనామాలు, ఫిరాయింపుల విషయంలో నాన్చుతారని అసలే ఊహించి ఉండరు. ఇలాంటి సందర్భాలలో జోక్యం చేసుకొనే అధికారం సుప్రీంకోర్టుకు లేదనే అనుకుందాం. మరి వివాదాలు ఎలా పరిష్కారమవుతాయి? రాజీనామాలను కూడా ఆమోదించకపోతే సభ్యుల ప్రాథమిక హక్కులను హరించినట్టు కాదా? ఈ నేపథ్యంలో రాష్ట్రపతి సంధించిన లేఖ సంచలనమైంది. ఎవరికి వారు తమ వాదనకు కట్టుబడి ఉంటే సమస్య పరిష్కారం కాదు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు వివాదాలే ఏర్పడకుండా వ్యవహరిస్తే... ఈ పరిణామాలు తలెత్తవు కదా? రాష్ట్రపతి గానీ, గవర్నర్లు గానీ, చట్టసభల అధిపతులు గానీ ముందుగా ఈ సమస్యకు పరిష్కారం చూపాలి. చట్టాలను అపహాస్యం చేయకూడదు. సమస్యను పరిష్కరించవలసినవారే సమస్యకు కారకులైనప్పుడు సుప్రీంకోర్టు కూడా పట్టించుకోకపోతే ఎలా? రాష్ట్రపతి లేఖపై రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు కావచ్చుగానీ సమస్యలకు కారణమైనవారే పరిష్కారం చెబితే ఇలాంటి సున్నితమైన అంశాలపై వివాదం ఏర్పడదు!