వర్షాగమనం...!
ABN , Publish Date - May 27 , 2025 | 01:13 AM
నైరుతి రుతుపవనాలు ముందే వచ్చేశాయి. ఇంకాచెప్పాలంటే, వాతావరణశాఖ అంచనాలను కూడా త్రోసిరాజని జల్లులు కురుస్తున్నాయి. ఉగ్రవేసవి అధికారికంగా ముగియడానికి ఇంకా అనేకరోజులు ఉండగానే, ఏకంగా ఎనిమిది రోజుల ముందే రుతుపవనాలు కేరళను తాకాయి, తెలుగురాష్ట్రాలు కూడా...

నైరుతి రుతుపవనాలు ముందే వచ్చేశాయి. ఇంకాచెప్పాలంటే, వాతావరణశాఖ అంచనాలను కూడా త్రోసిరాజని జల్లులు కురుస్తున్నాయి. ఉగ్రవేసవి అధికారికంగా ముగియడానికి ఇంకా అనేకరోజులు ఉండగానే, ఏకంగా ఎనిమిది రోజుల ముందే రుతుపవనాలు కేరళను తాకాయి, తెలుగురాష్ట్రాలు కూడా వర్షాలకు తడిసి తరిస్తున్నాయి. రుతుపవనాలు ఇలా హడావుడిపడటం పాతికేళ్ళలో ఇది మూడోసారి, పదహారేళ్ళలో తొలిసారి. 2023లో వారంరోజులు ఆలస్యంగా కేరళను తాకి దేశాన్ని అల్లాడిపోయేట్టు చేసినందుకు కాబోలు, మరుసటి ఏడాది మే 30నే నైరుతి వచ్చి మనకు ఉపశమనాన్ని ఇచ్చింది. ఈ పలకరింపులో ఏ మాత్రం జాప్యం జరిగినా ఎంతటి క్షోభ కలుగుతుందో తెలుసు కనుకనే రైతే కాదు, సామాన్యుడు సైతం పవనాల రాకను స్వాగతిస్తున్నాడు, ముందేవచ్చినందుకు ముచ్చటపడుతున్నాడు. రానున్నరోజుల్లో వర్షాలు విస్తారంగా కురుస్తాయని వాతావరణశాఖ శుభవార్త వినిపించింది. వ్యవసాయాధారిత దేశం కనుక అది నిజం కావాలనీ, అన్నదాత ఆనందించాలనీ నాయకులంతా కోరుకుంటున్నారు. జపాన్ను దాటి ప్రపంచ నాలుగవ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా భారతదేశం ఆవిర్భవించిందని శనివారం నీతి అయోగ్ ప్రకటించింది. ఆర్థికవ్యవస్థ పురోగమనానికి రుతుపవనాలు ఊతాన్నిస్తాయి. ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షాలు పడతాయన్నది ఖరీఫ్ పొంగిపొర్లేందుకు అవశ్యకమైన శుభవార్త. 2027లో జర్మనీని సైతం అధిగమించి అతిపెద్ద మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్ ప్రభవిస్తుందన్న అంచనాలకు అనుగుణంగా, ఆ అద్భుత పురోగతి సుసాధ్యం కావడానికి రాబోయే సంవత్సరాల్లో సైతం వర్షాలు ఇదేరీతిలో ఉండాలని కోరుకోవాలి. ఆహారధాన్యాల నిల్వలకు లోటేమీలేదు కనుక, మూడునెలల రేషన్ ముందుగానే ప్రజలకు పంచేసి, ఇబ్బడిముబ్బడిగా రాబోతున్న ఉత్పత్తికి గిడ్డంగులను సిద్ధం చేయమంటూ రాష్ట్రాలను కేంద్రం ఇప్పటికే ఆదేశించింది.
గత ఏడాది దేశవ్యాప్తంగా మిగులు వర్షపాతం ఉన్నా పంజాబ్, బిహార్, ఉత్తర్ప్రదేశ్ ఇత్యాది రాష్ట్రాల్లో లోటు నమోదుకావడం, మరోపక్క రాజస్థాన్, గుజరాత్ వంటివి మునిగిపోవడం చూశాం. పంటదిగుబడి ఇంకా అధికంగా వర్షాలమీదే ఆధారపడుతున్న ఈ దేశంలో చినుకుపడితే ఆనందం, ఆగితే విషాదం పక్కపక్కనే ఉంటాయి. ఒకచోట కుంభవృష్టి, మరొకచోట అనావృష్టి సహజమైపోయాయి. వాతావరణ మార్పు కారణంగా వర్షపురోజుల సంఖ్య క్రమంగా తగ్గుతూ, కుంభవృష్టితో ప్రళయాలు వచ్చిపడే పాడుకాలం దాపురించింది. ఇరిగేషన్ సౌకర్యాల విస్తరణ జరగకుండా దేశంలో ఎక్కువమంది రైతన్నలు ఇంకా మేఘాలనే నమ్ముకొని వ్యవసాయం చేయడం వారిని ఆర్థిక కష్టాల్లోకి నెట్టేసి, ఆత్మహత్యల వరకూ తీసుకుపోతున్నది. నీటి సౌకర్యాలను మెరుగుపరచి, విత్తనాలనుంచి గిడ్డంగుల వరకూ అన్నింటా అండగా నిలిచి, ప్రకృతిప్రకోపాలకు ప్రత్యక్షంగా బలైపోయే పరిస్థితులనుంచి వారిని బయటకు తీసుకురావాలి. రుతుపవనాలు ముందుగా వచ్చిన ఉత్సాహాన్ని ఢిల్లీ, ముంబై, బెంగుళూరు వంటి మహానగరాలు మునిగిపోతున్న దృశ్యాలు నీరుగారుస్తున్నాయి. మూడోవంతుకంటే ఎక్కువ జనాభా నివసిస్తున్న నగరాలు నాలుగు చినుకులకే అల్లాడిపోతున్నాయి. కాస్తంత తక్కువ వర్షం పడితే, భూగర్భజలాలు అడుగంటిపోవడం, నీటికి అల్లాడిపోవడం, మరోపక్క మేఘాలు కాస్తంత దయతలిస్తే చిగురుటాకుల్లా వొణికిపోవడం సర్వసాధారణమైపోయింది. ఇక, ఈ రుతువులతో సంబంధం లేకుండా నగరాలను ముంచేస్తున్న కుంభవృష్టులకు మన వ్యవస్థలను సంసిద్ధం చేయాల్సిన బృహత్తర కర్తవ్యం మిగిలే ఉంది.
వాతావరణమార్పును నివారించడంతో పాటు, సాగు, తాగునీరు, మురుగునీటి వ్యవస్థలను మెరుగుపరుచుకోవాలి. రుతుపవనాల వల్ల వర్షాన్ని పొందుతున్న దేశాల్లో మనదే ప్రధానమైనది, పెద్దదీ అంటారు. దేశం అన్ని రంగాల్లో ఎంత ఎదుగుతున్నా డెబ్బయ్శాతం సాగు, తాగునీటిని అవసరాలను తీరుస్తూ, జనాభాలో తొలిస్థానంలో ఉన్న ఈ దేశానికి ప్రాణాన్నిస్తున్న రుతుపవనాల ప్రాధాన్యం లెక్కకు అందనిది. 2009లో పవనాలు ఇప్పటికంటే ముందే వచ్చినా, 23శాతం వర్షలోటుతో దేశాన్ని పొడిబార్చిన సంగతి తెలిసిందే. రాకపోకలే కాదు, విస్తరణలోనూ అనిశ్చితిని కనబరచే రుతుపవనాలకు ఈ ఏడాది ఏ అడ్డంకులు ఏర్పడకూడదని, గత పదిహేనేళ్ళకాలంలో వీటి మంచిచెడులను మరికాస్తంత కచ్చితత్వంతో చెప్పగలుగుతున్న వాతావరణశాఖ అంచనాలకు అనుగుణంగా వాటి పురోగతి, ప్రభావం ఉండాలని కోరుకుందాం.
ఇవి కూడా చూడండి
నక్సలైట్లపై సీజ్ ఫైర్ ప్రకటించాలి