ఈ విస్తరణలోనూ ముస్లింలకు నిరాశే
ABN , Publish Date - Jun 13 , 2025 | 06:05 AM
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరిగింది, ముగ్గురు కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. ఈ రెండవ విడత విస్తరణలో కూడా ముస్లింలకు పూర్తి నిరాశే మిగిలింది. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత...

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరిగింది, ముగ్గురు కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. ఈ రెండవ విడత విస్తరణలో కూడా ముస్లింలకు పూర్తి నిరాశే మిగిలింది. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారి, దాదాపు ఇరవై నెలల పాటు, ముస్లింలకు మంత్రివర్గంలో ఒక్క స్థానమూ ఇవ్వకుండా ప్రభుత్వం కొనసాగుతోంది. ఇప్పటికి మొత్తం పదిహేనుమంది మంత్రులు నియమితులయ్యారు. ముస్లిం సామాజిక వర్గం నుండి ఒక్కరికీ అవకాశం కల్పించకపోవడం శోచనీయం. ముస్లిం ఎమ్మెల్యేలు ఎవరూ గెలవలేదు కనుక మంత్రి పదవులు ఎలా ఇవ్వాలి? అనే వాదన ముందుకు తెస్తున్నవారు ఒక్కసారి గతాన్ని గుర్తెరగాలి. 2014లో ప్రత్యేక తెలంగాణ మొదటి క్యాబినెట్ ఏర్పాటైన వేళ కేసీఆర్కూ ఇదే సమస్య ఎదురైంది. ముహమ్మద్ మహమూద్ అలీ అప్పుడు ఎమ్మెల్యే కానప్పటికీ ఆయనకు ఉప ముఖ్యమంత్రి హోదాతో పాటు హోంమంత్రిత్వ శాఖను కూడా ఇచ్చారు. ఈ వెసులుబాటు ఉన్నప్పుడు ‘ఎవరూ లేరు’ అన్న కారణం సహేతుకం కాదు. రాష్ట్రంలో ముస్లింల జనాభా దాదాపు 14శాతం. గణనీయమైన ఓట్ల శాతం కలిగిన ముస్లిం సామాజిక వర్గం గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కీలకమైన మద్దతును అందించింది. కేసీఆర్ ఒంటెద్దు పోకడలకు వ్యతిరేకంగా, బీజేపీతో లోపాయికారీ ఒప్పందం ఫలితంగా ముస్లిం, ముస్లిమేతర మేధావివర్గం, ధార్మిక సంస్థలు, మహిళలు, యువత అందరూ కాంగ్రెస్ అభ్యర్థులకు తిరుగులేని మద్దతు ప్రకటించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై నెలకొన్న అసంతృప్తిని కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మలచడంలో ముస్లింల పాత్ర గణనీయమైనది. కానీ ‘ఓడ దాటిందాక ఓడమల్లయ్య...’ అన్నట్లు గెలిచిన వెంటనే కాంగ్రెస్ పార్టీ ముస్లిం వర్గాన్ని విస్మరించింది.
లంబాడా సామాజిక వర్గానికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చి కొంత ఉపశమనం కలిగించినా, ముస్లింలకు అలాంటి కనీస గౌరవం కూడా లభించలేదు. ‘ముస్లింలకు ఓటు హక్కు ఉంది కానీ పాలనా హక్కు లేదా?’ అని యువతరం నిలదీస్తోంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ సహా అనేక పార్టీలు ముస్లింల ప్రాతినిధ్యాన్ని గణనీయంగా తగ్గిస్తున్నాయి. ముస్లిం సమాజం ప్రతిసారీ తన బాధ్యతను గుర్తెరిగి ఓటు హక్కును వినియోగిస్తోంది. కానీ పాలనా బాధ్యతల్లో పాలుపంచుకోలేని నిస్సహాయతకు గురవుతోంది. ఈ పరిస్థితి మైనారిటీల పట్ల అన్యాయం మాత్రమే కాదు; సమానత, న్యాయం అనే రాజ్యాంగ విలువలనే ప్రశ్నార్థకం చేసే ధోరణి. ఇప్పటికైనా తెలంగాణ కాంగ్రెస్ స్పందించాలి. తదనంతర మంత్రివర్గ విస్తరణలో ముస్లింలకు పదవులు ఇవ్వాలి.
యండి. ఉస్మాన్ఖాన్
ఈ వార్తలు కూడా చదవండి..
కూలిన విమానంలో గుజరాత్ మాజీ సీఎం.. ఆయన చివరి ఫొటో ఇదే..
లోపం ఉందని ముందే చెప్పినా.. పట్టించుకోని ఎయిర్ ఇండియా
For National News And Telugu News