వర్సిటీల ప్రక్షాళన ఇలా మొదలుకావాలి
ABN , Publish Date - Jun 13 , 2025 | 06:09 AM
కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో విశ్వవిద్యాలయాలను శుద్ధి చేయాలని ఆంధ్రజ్యోతిలో ఇటీవల ఒక రచయిత రాశారు. విశ్వవిద్యాలయాలకు రాజకీయ వాతావరణం కాకుండా విద్యా వాతావరణం అవసరమనేది నిజం. తదనుగుణంగా...

కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో విశ్వవిద్యాలయాలను శుద్ధి చేయాలని ఆంధ్రజ్యోతిలో ఇటీవల ఒక రచయిత రాశారు. విశ్వవిద్యాలయాలకు రాజకీయ వాతావరణం కాకుండా విద్యా వాతావరణం అవసరమనేది నిజం. తదనుగుణంగా, అతిథి అధ్యాపక వ్యవస్థ ప్రక్షాళనతోనే ఆ కార్యాచరణ మొదలుకావాలి. ఒక విశ్వవిద్యాలయంలో అతిథి అధ్యాపకుల సగటు వయస్సు 45 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉంటుంది. కొన్ని సందర్భాల్లో 55 సంవత్సరాల వరకూ ఉంటుంది. వారు దాదాపు 20 ఏళ్ల క్రితం తమ పీహెచ్డీలను పూర్తి చేసుకొని ఉంటారు. అయినా వారు దేశంలోని ప్రభుత్వ/ప్రైవేట్ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పదవిని పొందలేకపోయారంటే, సమర్థత కొరవడడం వల్ల, వారు రాష్ట్రం వెలుపల ఏ పదవికీ దరఖాస్తు చేసుకోలేదని భావించవచ్చు. ఇక, ఈ అతిథి అధ్యాపకులలో ఎంతమంది UGC–NET లేదా CSIR పరీక్షలో అర్హత సాధించారు? చాలా తక్కువ. అర్హత సాధించిన వారు కూడా అనేక ప్రయత్నాల తర్వాతే క్లియర్ చేశారు. ఉదాహరణకు–2018లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం కోసం స్క్రీనింగ్ పరీక్షను నిర్వహించినప్పుడు అతిథి అధ్యాపకులలో ఎక్కువమంది ఈ పరీక్షలో అర్హత సాధించనేలేదు. పైగా వీరిలో చాలామంది ఆంగ్లంలో ఉపన్యసించలేరు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 79 దేశాలకు చెందిన విదేశీ విద్యార్థులున్నారు. తరచుగా వారు ఈ అతిథి అధ్యాపకులు అర్థం కాని ప్రాంతీయ భాషలో తమకు బోధిస్తున్నారని వైస్–ఛాన్సలర్కు ఫిర్యాదులు చేశారు. అతిథి అధ్యాపకులు భారతీయ విద్యార్థులు కాపీ చేయడాన్ని ప్రోత్సహిస్తారని కూడా విదేశీ విద్యార్థుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. ఒక విద్యార్థి కాపీ చేయడానికి సహకరిస్తూ ఒక గెస్ట్ ఫ్యాకల్టీ సభ్యుడు పట్టుబడ్డాడు కూడా. ఈ అధ్యాపకుల్లో అత్యధికులు ఆంగ్లంలో వ్యాసం రాయలేరు, ఆంగ్లంలో పుస్తకం చదవలేరు. కొంతమంది గెస్ట్ ఫ్యాకల్టీ సభ్యులకు ఉన్నత విద్యలో మార్పు గురించి అవగాహన లేదు. వీరిలో చాలామంది దేశంలోని ఉన్నతవిద్యా సంస్థలను సందర్శించలేదు, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సెమినార్ పత్రాన్ని సమర్పించలేదు. విశ్వవిద్యాలయాలలోని అతిథి అధ్యాపకులలో ఎక్కువ మంది రాజకీయ లేదా కుల కారణాల ద్వారా ప్రవేశించారు. అతి తక్కువమంది మాత్రమే అర్హతల కారణంగా విశ్వవిద్యాలయాలలో చేరారు. ప్రతిభావంతులలో ఎక్కువమంది ఇతర విశ్వవిద్యాలయాలకు వెళ్ళిపోయారు. ఇరవై సంవత్సరాల క్రితం ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఇచ్చిన మొదటి NAAC నివేదికలోని సిఫార్సులలో ఒకటి విశ్వవిద్యాలయంలో ‘ఇన్–బ్రీడింగ్’ తగ్గించడం. అంటే ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు వంటి విశ్వవిద్యాలయ పోస్టులను రాష్ట్రం వెలుపలి వ్యక్తులతో భర్తీ చేయాలి.
ఆ సిఫార్సుకు వ్యతిరేకంగా, స్థానిక వ్యక్తులనే నియమిస్తున్నారు. వాస్తవానికి, అతిథి అధ్యాపకులలో ఎవరికీ సేజ్, రౌట్లెడ్జ్, స్ప్రింగర్ వంటి అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన జర్నల్స్లో ప్రచురణలు లేవు. అనర్హులైన అతిథి అధ్యాపకులను తొలగించడం ద్వారా విశ్వవిద్యాలయాల ప్రక్షాళన ప్రారంభించాలి. విదేశీ విద్యార్థులను ఆకర్షించడానికి కొత్త ప్రభుత్వం విశ్వవిద్యాలయ ఉపాధ్యాయుల సమగ్ర ఎంపిక ప్రక్రియ చేపట్టాలి. ఆంధ్రప్రదేశ్లోని విశ్వవిద్యాలయాలు గత వైభవాన్ని తిరిగి పొందాలి. ముఖ్యంగా, ఆంధ్ర విశ్వవిద్యాలయం దాని వందవ సంవత్సరంలో సంస్కరణలను చేపట్టాలి. భావితరాలకు రోల్ మోడల్గా మారే విద్యా పదవుల్లో ప్రతిభ ఉన్న వ్యక్తులను నియమించాలి.
డాక్టర్ సి.ఎం వినయకుమార్
అసోసియేట్ ప్రొఫెసర్, ఆంధ్ర విశ్వవిద్యాలయం
ఈ వార్తలు కూడా చదవండి..
కూలిన విమానంలో గుజరాత్ మాజీ సీఎం.. ఆయన చివరి ఫొటో ఇదే..
లోపం ఉందని ముందే చెప్పినా.. పట్టించుకోని ఎయిర్ ఇండియా
For National News And Telugu News