Share News

U S Senate Approves Biosecurity Ac: భారత ఫార్మా సీడీఎంఓ కంపెనీలకు ఊతం

ABN , Publish Date - Oct 14 , 2025 | 04:15 AM

అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ధం ముదురుతోంది. అమెరికా సెనెట్‌ తాజాగా యూఎస్‌ బయోసెక్యూర్‌ యాక్ట్‌తో కూడిన నేషనల్‌ డిఫెన్స్‌ ఆథరైజేషన్‌ యాక్ట్‌ (ఎన్‌డీఏఏ)కు ఆమోదం...

U S Senate Approves Biosecurity Ac: భారత ఫార్మా సీడీఎంఓ కంపెనీలకు ఊతం

బయోసెక్యూర్‌ చట్టానికి అమెరికా సెనెట్‌ ఆమోదం

వాషింగ్టన్‌: అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ధం ముదురుతోంది. అమెరికా సెనెట్‌ తాజాగా యూఎస్‌ బయోసెక్యూర్‌ యాక్ట్‌తో కూడిన నేషనల్‌ డిఫెన్స్‌ ఆథరైజేషన్‌ యాక్ట్‌ (ఎన్‌డీఏఏ)కు ఆమోదం తెలిపింది. ప్రతినిధుల సభ, అధ్యక్షుడు ట్రంప్‌ ఇంకా ఈ బిల్లుకు ఆమోదం తెలపాల్సి ఉంది. ఈ రెండు ప్రక్రియలు పూర్తయితే ఇది చట్టంగా మారి అమల్లోకి వస్తుంది. అమెరికా బయోటెక్‌, హెల్త్‌ డేటా కంపెనీల్లో చైనా బయోటెక్‌, ఫార్మా కంపెనీలు పెట్టే పెట్టుబడులకు ఈ చట్టంతో తెరపడుతుందని భావిస్తున్నారు. ఈ చట్టం కింద అమెరికా రక్షణ శాఖ (పెంటగాన్‌) ఏదైనా చైనా ఫార్మా కంపెనీ, చైనా సైన్యం కనుసన్నల్లో పని చేస్తోందని భావిస్తే ఆ కంపెనీ అమెరికా బయోటెక్‌, హెల్త్‌కేర్‌ డేటా కంపెనీల్లో పెట్టే పెట్టుబడులను దేశ భద్రత పేరుతో అమెరికా ప్రభుత్వం అడ్డుకోవచ్చు. ఇప్పటికే ఉప్పు-నిప్పుల్లా ఉన్న అమెరికా-చైనా వాణిజ్య సంబంధాలు ఈ చట్టంతో మరింత వేడెక్కే అవకాశం ఉందని భావిస్తున్నారు.

భారీ మార్కెట్‌: అమెరికా ఫార్మా కంపెనీలు ప్రస్తుతం ఏటా 4,100 కోట్ల డాలర్ల నుంచి 4,370 కోట్ల డాలర్ల విలువైన సీడీఎంఓ సేవలను ఔట్‌సోర్స్‌ చేసుకుంటున్నాయి. 2034 నాటికి ఇది 8,400 కోట్ల డాలర్లకు చేరుకుంటుందని అంచనా. ఎఫ్‌డీఏ ఆమోదిత ప్లాంట్లు అత్యధికంగా ఉన్న భారత్‌కు ఇది ఎంతో కలిసి వస్తుందని భావిస్తున్నారు.

మన కంపెనీలకు మేలే

ఈ చట్టం భారత ఫార్మా రంగానికి చెందిన కాంట్రాక్ట్‌ డెవల్‌పమెంట్‌, మాన్యుఫాక్చరింగ్‌ ఆర్గనైజేషన్స్‌ (సీడీఎంఓ)కు మేలు చేస్తుందని భావిస్తున్నారు. దీంతో అమెరికా బయోటెక్‌, ఫార్మా కంపెనీలు తమ కొత్త ఔషధాల అభివృద్ధి, తయారీ కార్యకలాపాలను భారత్‌లోని సీడీఎంఓ కంపెనీలకు తరలించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే అనేక అమెరికా కంపెనీలు.. భారత్‌కు చెందిన దివీస్‌ లేబొరేటరీస్‌, లారస్‌ ల్యాబ్స్‌, న్యూలాండ్‌ లేబొరేటరీస్‌, జుబిలెంట్‌ ఫార్మా, పిరామల్‌ ఫార్మా వంటి ఫార్మా కంపెనీల నుంచి ఈ సేవలు అందుకుంటున్నాయి. తాజా పరిణామాలతో ఇది మరింత పెరగనుంది.

ఈ వార్తలు కూడా చదవండి...

నాపై కుట్రలు చేశారు... వినుత కోట ఎమోషనల్

ఏపీ పర్యాటక రంగానికి జాతీయ గుర్తింపు దిశగా అడుగులు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 14 , 2025 | 04:15 AM