TATA Group: ఐఫోన్, మ్యాక్బుక్ రిపేర్ బాధ్యతలు నిర్వహించనున్న టాటా
ABN , Publish Date - Jun 05 , 2025 | 11:29 PM
ఇకపై భారత్లో ఐఫోన్, మ్యాక్బుక్ రిపేరింగ్ బాధ్యతలను టాటా గ్రూప్ నిర్వహించనున్నట్టు తెలుస్తోంది.

ఇంటర్నెట్ డెస్క్: యాపిల్ సంస్థ, టాటా గ్రూప్ల మధ్య భాగస్వామ్యం మరింత పటిష్ఠమైంది. ఇకపై భారత్లో ఐఫోన్, మ్యాక్బుక్ రిపేర్లు కూడా టాటా గ్రూప్ నిర్వహించనుంది. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఐఫోన్, మ్యాక్బుక్ తయారీ కార్యకలాపాలను యాపిల్ సంస్థ చైనా నుంచి భారత్కు మళ్లిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో యాపిల్ సంస్థకు టాటా గ్రూప్ కీలక వ్యాపార భాగస్వామిగా మారింది. ఇప్పటికే టాటా గ్రూప్కు దక్షిణాదిన ఉన్న మూడు ప్లాంట్లలో ఐఫోన్ అసెంబ్లీ కార్యకలాపాలు జరుగుతున్నాయి. మరో ప్లాంట్లో ఐఫోన్లకు సంబంధించి కొన్ని విడిభాగాల తయారీ కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకూ రిపేరింగ్ కార్యకలాపాలను విస్ట్రన్ సంస్థకు చెందిన స్థానిక యూనిట్ నిర్వహించేది. ఇకపై ఈ బాధ్యతలను కూడా టాటా గ్రూప్ నిర్వహించనుంది. టాటా గ్రూప్కు కర్ణాటకలో ఉన్న అసెంబ్లీ యూనిట్లో రిపేరింగ్ పనులు నిర్వహిస్తారు.
ప్రపంచంలో స్మార్ట్ఫోన్లకు భారత్ రెండో అతిపెద్ద మార్కెట్గా అవతరించింది. భారత్లో ఐఫోన్ల విక్రయాలు కూడా పెరుగుతున్నాయి. 2024లో ఐఫోన్ల మార్కెట్ వాటా 7 శాతంగా ఉంది. 2020లో ఇది కేవలం 1 శాతంగా మాత్రమే ఉండేది. ఈ మార్కెట్ ఐఫోన్ రిపేర్లకు కూడా డిమాండ్ పెంచుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ వార్తలపై యాపిల్, విస్ట్రన్ ఇంకా స్పందించాల్సి ఉంది. టాటా ప్రతినిధులు మాత్రం స్పందించేందుకు నిరాకరించినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఇక భారత్ నుంచి అమెరికాకు ఐఫోన్ ఎగుమతులను కూడా పెంచేందుకు యాపిల్ ప్రయత్నిస్తోంది. జూన్ త్రైమాసికం నుంచి అమెరికాలో విక్రయించే ఐఫోన్లలో అత్యధికం భారత్లో తయారవుతాయని యాపిల్ సీఈఓ టిమ్ కుక్ పేర్కన్న విషయం తెలిసిందే.
ఇవీ చదవండి:
సెకెండ్ హ్యాండ్ కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఇస్మార్ట్ ఆటో డ్రైవర్.. ఇతడు నెలకు రూ.8 లక్షలు ఎలా సంపాదిస్తున్నాడో తెలిస్తే..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి