Sundar Pichai: ఏఐతో జాబ్స్ పోతాయా .. గూగుల్ సీఈఓ ఏమన్నారంటే..
ABN , Publish Date - Jun 06 , 2025 | 04:03 PM
ఏఐతో ఉద్యోగుల ఉత్పాదకత మరింత పెరుగుతుందని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అన్నారు. సృజనాత్మకత అవసరమైన అంశాలపై దృష్టి పెట్టేందుకు వీలు చిక్కుతుందని తెలిపారు.

ఇంటర్నెట్ డెస్క్: ఏఐతో వైట్కాలర్ ఉద్యోగాలకు ముప్పు తప్పదన్న భయం ప్రపంచవ్యాప్తంగా నెలకొంది. ఈ అంశంపై గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తాజాగా స్పందించారు. ప్రస్తుతానికి ఏఐ వల్ల ఉద్యోగాలకు ఎలాంటి ముప్పు లేదని అన్నారు. ఓ పత్రికా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు.
ఏఐ వల్ల గూగుల్లోని 1.8 లక్షల ఉద్యోగుల్లో అధిక శాతం మంది అవసరం ఉండకపోవచ్చన్న టాక్పై సుందర్ పిచాయ్ స్పందించారు. వచ్చే ఏడాది కూడా ఇంజినీర్ల అవసరం తప్పకుండా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఏఐతో ఉద్యోగాలకు ముప్పు ఉండదని, పైపెచ్చు, వారి ఉత్పాదకత పెంచేందుకు ఏఐ ఉపయోగపడుతుందని అన్నారు. రిపిటీటివ్ టాస్క్ల భారం ఉద్యోగులకు తగ్గి సృజనాత్మకత అవసరమైన అంశాలపై దృష్టి పెట్టే అవకాశం ఉద్యోగులకు కలుగుతుందని అన్నారు. ఈ క్రమంలో కొత్త ప్రాడక్ట్ల అభివృద్ధి కోసం కొత్త వారిని నియమించుకోవాల్సిన అవసరం పెరుగుతుందని కూడా అన్నారు.
అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, 2023లో గూగుల్ సుమారు 12 వేల మంది ఉద్యోగులను సాగనంపింది. గతేడాది లేఆఫ్స్లో భాగంగా మరో 1000 మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఈ ఏడాది జాబ్స్ కోల్పోయిన వారి సంఖ్య 100 కంటే తక్కువే. క్లౌడ్ డిపార్ట్మెంట్తో పాటు డివైసెస్ యూనిట్లో గూగుల్ ఉద్యోగుల తొలగింపు చేపట్టింది.
వైమో సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు, క్వాంటమ్ కంప్యూటింగ్, యూట్యూబ్కు భారత్ వంటి మార్కెట్లలో పెరుగుతున్న ఆదరణ వంటివి సృజనాత్మకత వెల్లివిరుస్తోందనడానికి సంకేతాలని కూడా సుందర్ పిచాయ్ వ్యాఖ్యానించారు.
ఏఐ కారణంగా ఎంట్రీ లెవెల్ వైట్ కాలర్ ఉద్యోగాలకు ముప్పు గురించి కూడా ఆయన మాట్లాడారు. ఇలాంటి ఆందోళన గురించి మరింత విస్తృతమైన చర్చ జరగాల్సి ఉందని అన్నారు. ఇక మనుషులు అంతటి తెలివితేటలు గల యంత్రాల రూపకల్పన సాధ్యమేనా కాదా అన్నది ఇప్పుడే చెప్పలేమని గూగుల్ సీఈఓ అన్నారు. అయితే, ఈ దిశగా అభివృద్ధి మాత్రం జరుగుతోందని చెప్పారు.
ఇవీ చదవండి:
సెకెండ్ హ్యాండ్ కారు కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఐఫోన్, మ్యాక్బుక్ రిపేర్ బాధ్యతలు నిర్వహించనున్న టాటా
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి