Share News

విదేశాల్లో ఎఫ్‌డీ లపై నిషేధం

ABN , Publish Date - Jun 13 , 2025 | 05:26 AM

భారతీయులు విదేశాలకు పంపే సొమ్ము (ఓవర్సీస్‌ రెమిటెన్స్‌)కు సంబంధించిన నిబంధనలను భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) కఠినతరం చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దేశం బయటికి పంపిన సొమ్ముతో...

విదేశాల్లో ఎఫ్‌డీ లపై నిషేధం

విదేశాలకు సొమ్ము బదిలీ నిబంధనలు కఠినతరం చేసే యోచనలో ఆర్‌బీఐ

న్యూఢిల్లీ: భారతీయులు విదేశాలకు పంపే సొమ్ము (ఓవర్సీస్‌ రెమిటెన్స్‌)కు సంబంధించిన నిబంధనలను భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) కఠినతరం చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దేశం బయటికి పంపిన సొమ్ముతో విదేశీ కరెన్సీల్లో లాకిన్‌ పీరియడ్‌తో కూడిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు (ఎఫ్‌డీ) చేయడం లేదా వడ్డీ ఆర్జిత అకౌంట్లో జమ చేయడాన్ని నిషేధించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో ఆర్‌బీఐ చర్చలు కొనసాగిస్తోందని అధికారిక వర్గా లు వెల్లడించాయి. ఇది దేశ సంపదను విదేశాలకు బదిలీ చేయడం లాంటిదేనని ఆ వర్గాలు పేర్కొన్నాయి. మన దేశవాసులు విదేశాల్లో తమ పేరు మీదే కాదు, ఇతరుల పేరున కూడా సొమ్ము డిపాజిట్‌ చేయకుండా ఆర్‌బీఐ నిబంధనలను కట్టుదిట్టం చేయాలని భావిస్తోందని వారు తెలిపారు. కాగా ఈ తరహా సొమ్ము బదిలీలకు అడ్డుకట్ట వేసేందుకు ఆర్‌బీఐ లిబరలైజ్డ్‌ రెమిటెన్స్‌ స్కీమ్‌ (ఎల్‌ఆర్‌ఎస్‌)ను సవరించనున్నట్లు తెలిసింది.


ఏడాదిలో రూ.2.14 కోట్లు పంపొచ్చు..

ఇటీవలి కాలంలో విదేశాలకు సొమ్ము బదిలీలు భారీగా పెరిగాయి. కొందరు ఎల్‌ఆర్‌ఎస్‌ మార్గంలో తమ సంపదను క్రమంగా విదేశాలకు తరలిస్తున్నారని ఆర్‌బీఐ అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే, ఇది మన విదేశీ మారక (ఫారెక్స్‌) నిల్వలకు గండికొట్టడమే కాకుండా రూపాయి మారకం విలువలో ఒడుదుడుకులకూ కారణమవుతోంది. ప్రస్తుతం ఎల్‌ఆర్‌ఎస్‌ ద్వారా భారతీయులు ఉన్నత విద్య, ప్రయాణం, విదేశీ స్టాక్‌ మార్కెట్‌ లేదా బాండ్లలో పెట్టుబడులు లేదా వైద్య అవసరాల కోసం ఏదైనా ఆర్థిక సంవత్సరంలో 2.5 లక్షల డాలర్ల (దాదాపు రూ.2.14 కోట్లు) వరకు సొమ్మును బయటికి దేశానికి బదిలీ చేయవచ్చు.


మార్చిలో 17.32 కోట్ల డాలర్ల విదేశీ కరెన్సీ డిపాజిట్లు

ఆర్‌బీఐ డేటా ప్రకారం.. ఈ ఫిబ్రవరిలో భారతీయుల ఫారిన్‌ కరెన్సీ డిపాజిట్లు 5.162 కోట్ల డాలర్లుగా నమోదు కాగా.. మార్చిలో 17.32 కోట్ల డాలర్లకు పెరిగాయి. ఆర్థిక సంవత్సరం చివరి నెల కావడంతో సాధారణంగానే మార్చిలో భారతీయుల విదేశీ రెమిటెన్స్‌లు భారీగా పెరుగుతాయని ఆర్థిక నిపుణులు పేర్కొన్నారు. కాగా, గత ఆర్థిక సంవత్సరం (2024-25)లో భారతీయులు దాదాపు 3,000 కోట్ల డాలర్లు విదేశాలకు పంపించారు. అంతక్రితం ఆర్థిక సంవత్సరం (2023-24)లో పంపిన 3,100 కోట్ల డాలర్లతో పోలిస్తే మాత్రం గతసారివిదేశీ రెమిటెన్స్‌లు స్వల్పంగా తగ్గాయి.

ఈ వార్తలు కూడా చదవండి..

వణికించిన టాప్ 10 విమాన ప్రమాదాలు..

ఎయిర్ ఇండియా ప్రమాదం ఫస్ట్ వీడియో

For National News And Telugu News

Updated Date - Jun 13 , 2025 | 05:26 AM