Indians Trust AI: భారతీయులకు ఏఐపై అపార విశ్వాసం.. తాజా సర్వేలో వెల్లడి
ABN , Publish Date - May 06 , 2025 | 04:36 PM
ఏఐని వాడుకోవడం సబబేనని 90 శాతం మంది భారతీయులు భావిస్తున్నట్టు తాజా సర్వేలో తేలింది. ఏఐ ఇచ్చే ఫలితాలను తాము విశ్వసిస్తు్న్నట్టు 76 శాతం మంది భారతీయులు తెలిపారు.

ఇంటర్నెట్ డెస్క్: భారతీయులకు ఏఐపై అపార నమ్మకమని తాజా సర్వేలో తేలింది. ఏఐ తప్పులు చేస్తుందని తెలిసినా అనేక మంది దీనిపై ఆధారపడుతున్నారట. కేజీఎమ్జీ కన్సల్టింగ్ సంస్థ మెల్బోర్న్ బిజినెస్ స్కూల్ సంయుక్తంగా ఈ సర్వే నిర్వహించాయి. మొత్తం 47 దేశాల్లోని 48 వేల మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. పెరుగుతున్న ఏఐ వినియోగం, విశ్వసనీయత, ఏఐతో సమస్యలు తదితరాలపై జనాల అభిప్రాయాలతో ఈ నివేదిక రూపొందించారు.
ఈ సర్వే ప్రకారం, ఏఐని వినియోగించడం సబబేనని 90 శాతం మంది భారతీయులు అభిప్రాయపడ్డారు. ఏఐని విశ్వసించే వారిలో భారతీయులు టాప్లో ఉన్నారు. ప్రపంచ సగటు 49 శాతం కాగా భారతీయుల్లో ఏకంగా 76 శాతం మంది తాము ఏఐని నమ్ముతున్నట్టు తెలిపారు. అంతేకాకుండా, ఏఐ లేకుండా తాము తమ పనిని పూర్తి చేయలేమని 67 శాతం మంది భారతీయులు చెప్పుకొచ్చారు.
ఇక ఆఫీసుల్లో 73 శాతం మంది భారతీయ ఉద్యోగులు ఏఐ కారణంగా తప్పులు చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. కంపెనీ నిబంధనలకు విరుద్ధంగా తాము ఏఐని వినియోగిస్తున్నట్టు 72 శాతం మంది ఉద్యోగులు అంగీకరించారు. అయితే, ఏఐ నియంత్రణపై కూడా భారతీయులకు స్పష్టమైన అభిప్రాయాలు ఉన్నట్టు ఈ సర్వేలో తేలింది. ఏఐ ద్వారా తప్పుడు సమాచారా వ్యాప్తి కట్టడి కోసం మరింత శక్తిమంతమైన చట్టాలు చేయాలని 87 శాతం మంది భారతీయులు అభిప్రాయపడ్డారు.
ఏఐతో అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయని 94 శాతం మంది భారతీయులు అభిప్రాయపడ్డారు. ఈ ప్రయోజనాలను ప్రత్యక్షంగా చూశామని మరో 86 శాతం మంది చెప్పుకొచ్చారు. తమ పనితీరు మెరుగుపడిందని, ఉత్పాదకత పెరిగిందని అంగీకరించారు. అయితే, ఏఐ ఇచ్చే ఫలితాలను మరోసారి చెక్ చేసుకోకుండా గుడ్డిగా అనుసరిస్తున్నామని 81 శాతం మంది ఉద్యోగులు చెప్పుకొచ్చారు. తాము ఏఐని వినియోగిస్తున్నామన్న విషయాన్ని గోప్యంగా ఉంచి, ఏఐ పనిని తమదిగా చెప్పుకుంటున్నామని 57 శాతం చెప్పుకొచ్చారు.
‘ఏఐ ఆధారిత భవిష్యత్తును అందుకునేందుకు భారత్ సిద్ధంగా ఉంది. ఏఐపై భారతీయుల ఆసక్తి ఈ విషయాన్ని ప్రతిఫలిస్తోంది. ఏఐతో ఉత్పాదకత, సృజనాత్మకత పెరగనుంది’’ అని కేపీఎమ్జీ ఉన్నతస్థాయి ఉద్యోగి ఒకరు వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
అయ్యో.. భారతీయ డిజిటల్ కంటెంట్ క్రియేటర్ల పరిస్థితి ఇదా.. తాజా నివేదికలో కీలక వివరాలు
పెరిగిన ఏటీఎమ్ విత్డ్రా చార్జీలు.. నేటి నుంచి కొత్త రూల్స్
ఇప్పటికీ జనాల వద్ద రూ.2 వేల నోట్లు.. ఆర్బీఐ తాజా అప్డేట్ ఏంటంటే..
వాణిజ్యాన్ని ఆయుధంగా వాడొద్దన్న వారెన్ బఫెట్
Read More Business News and Latest Telugu News