Share News

Stock Market: స్టాక్‌ మార్కెట్లో అణు కంపం

ABN , Publish Date - Jun 14 , 2025 | 06:58 AM

ఇరాన్‌ అణు కేంద్రాలు, సైనిక స్థావరాలపైౖ ఇజ్రాయెల్‌ దాడుల ప్రకంపనలు ప్రపంచ మార్కెట్లతోపాటు దలాల్‌స్ట్రీట్‌నూ తాకాయి. దాంతో ఈ వారాంతం ట్రేడింగ్‌ మన సూచీలకు బ్లాక్‌ ఫ్రైడేగా పరిణమించింది.

Stock Market: స్టాక్‌ మార్కెట్లో అణు కంపం

  • సెన్సెక్స్‌ 574 పాయింట్లు డౌన్‌

  • 24,750 దిగువ స్థాయికి జారిన నిఫ్టీ

  • 2 రోజుల్లో రూ.8.35 లక్షల కోట్లు ఫట్‌

ముంబై: ఇరాన్‌ అణు కేంద్రాలు, సైనిక స్థావరాలపైౖ ఇజ్రాయెల్‌ దాడుల ప్రకంపనలు ప్రపంచ మార్కెట్లతోపాటు దలాల్‌స్ట్రీట్‌నూ తాకాయి. దాంతో ఈ వారాంతం ట్రేడింగ్‌ మన సూచీలకు బ్లాక్‌ ఫ్రైడేగా పరిణమించింది. ఆరంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 1,337.39 పాయింట్లు పతనమై 80,354.59 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత క్రమంగా కోలుకున్న సూచీ చివరికి 573.38 పాయింట్ల నష్టంతో 81,118.60 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 169.60 పాయుంట్లు కోల్పోయి 24,718.60 వద్ద ముగిసింది. సూచీలు నష్టపోవడం వరుసగా ఇది రెండో రోజు. ఫలితంగా రెండు రోజుల్లో బీఎస్ఈ లిస్టెడ్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ రూ.8.35 లక్షల కోట్లకు పైగా తగ్గి రూ.447.21 లక్షల కోట్లకు (5.19 లక్షల కోట్ల డాలర్లు) పడిపోయింది. సెన్సెక్స్‌లోని 30 కంపెనీల్లో 26 నష్టపోయాయి. అదానీ పోర్ట్స్‌ షేరు 2.71 శాతం క్షీణించి సూచీ టాప్‌ లూజర్‌గా మిగిలింది. బీఎస్ఈ స్మాల్‌, మిడ్‌క్యాప్‌ సూచీలు 0.32 శాతం వరకు నష్టపోయాయి.

  • విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐ) మన మార్కెట్‌ నుంచి గురువారం నికరంగా రూ.3,831.42 కోట్ల పెట్టుబడులను ఉపసంహించుకున్నారు. వారాంతం ట్రేడింగ్‌లో మరో రూ.1,263.52 కోట్ల నికర విక్రయాలు జరిపారు.

రూపాయి.. 59 పైసలు నష్టం

ఫారెక్స్‌ ట్రేడింగ్‌లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 55 పైసలు నష్టపోయి రూ.86.11 వద్ద ముగిసింది. క్రూడాయిల్‌ రేట్లు భారీగా పెరగడంతోపాటు ఈక్విటీ మార్కెట్లో నష్టాలు, విదేశీ సంస్థాగత పెట్టుబడుల ఉపసంహరణ మన కరెన్సీపై ఒత్తిడి పెంచాయని ఫారెక్స్‌ వర్గాలు తెలిపాయి.


ఫారెక్స్‌ నిల్వల్లో భారీ వృద్ధి: ఈనెల 6తో ముగిసిన వారంలో విదేశీ మారక నిల్వలు 517 కోట్ల డాలర్ల వృద్ధితో మొత్తం 69,665 కోట్ల డాలర్లకు చేరాయని ఆర్‌బీఐ శుక్రవారం వెల్లడించింది.

సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ షేర్లకు ఎయిరిండియా సెగ : ఎయిరిండియాకు చెందిన బోయింగ్‌ 787 డ్రీమ్‌లైనర్‌ విమానం ప్రమాదం నేపథ్యంలో ఎయిరిండియాలో 25.1 శాతం వాటా కలిగిన సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ షేరు ఒక దశలో 2 శాతానికి పైగా క్షీణించినప్పటికీ, చివరికి 1.7 శాతం నష్టంతో ముగిసింది. కాగా, అమెరికా స్టాక్‌ మార్కె ట్లో బోయింగ్‌ కంపెనీ షేరు వరుసగా రెండో రోజూ నష్టాల్లో కొనసాగింది. శుక్రవారం ఒకదశలో 4 శాతం వరకు పతనమైంది. బోయింగ్‌ డ్రీమ్‌లైనర్‌ విమానాల ఇంజన్లను తయా రుచేసిన జీఈ ఏరోస్పేస్‌ షేరు సైతం ఒకదశలో 2.50 శాతం నష్టపోయింది.

ఆరిస్ఇన్‌ఫ్రా ఐపీఓ ధరల శ్రేణి రూ.210-222: ఆరి్‌సఇన్‌ఫ్రా సొల్యూషన్స్‌ లిమిటెడ్‌ రూ.500 కోట్ల ఐపీఓ ఈనెల 18న ప్రారంభం కానుంది. షేరు ధరల శ్రేణిని కంపెనీ రూ.210-222గా నిర్ణయించింది.

Updated Date - Jun 14 , 2025 | 07:00 AM