Anil Ambani: అనిల్ అంబానీకి షాక్.. లుక్ అవుట్ నోటీస్ జారీ చేసిన ఈడీ
ABN , Publish Date - Aug 01 , 2025 | 08:08 PM
Anil Ambani: 2017 నుంచి 2019 మధ్య కాలంలో రిలయన్స్ కంపెనీ యస్ బ్యాంకు నుంచి 3 వేల కోట్ల రూపాయలు లోన్ గా తీసుకుంది. ఈ 3 వేల కోట్లను అనిల్ అంబానీ దారి మళ్లించారన్న ఆరోపణలు ఉన్నాయి.

బిజినెస్ డెస్క్: రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) షాక్ ఇచ్చింది. 3 వేల కోట్ల లోన్ మోసం కేసుకు సంబంధించి ఇవాళ(శుక్రవారం) లుక్ అవుట్ నోటీస్ జారీ చేసింది. గురువారం నాడు విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తూ ఈడీ సమన్లు జారీ చేసింది. అనంతరం మరుసటి రోజే లుక్ అవుట్ నోటీసులు ఇచ్చింది. సాధారణంగా ఈడీ కేసు ఎదుర్కొంటున్న వ్యక్తులు దేశం విడిచిపోకుండా లుక్ అవుట్ నోటీసులు జారీ చేస్తుంటారు. లుక్ అవుట్ నోటీసులు జారీ అయిన వ్యక్తులు దేశం విడిచిపోవటానికి అవకాశం ఉండదు.
ఒకవేళ వారు దేశం విడిచి పారిపోవడానికి ప్రయత్నిస్తే.. ఎయిర్ పోర్టులు, సీ పోర్టులు, ఇతర మార్గాల దగ్గర వారిని గుర్తించి అదుపులోకి తీసుకుంటారు. కేసు విచారణ ఎలాంటి అంతరాయం లేకుండా సాఫీగా సాగడానికి లుక్ అవుట్ నోటీసులు ఉపయోగపడతాయి. లుక్ అవుట్ నోటీసులు జారీ అయిన నేపథ్యంలో అనిల్ అంబానీ దేశం విడిచిపోవడానికి లేకుండా పోయింది. ఆఖరికి ఎంత అర్జెంట్ బిజినెస్ పని మీద అయినా సరే.. బయటి దేశం వెళ్లాలంటే ఈడీ పర్మీషన్ కావాల్సిందే.
కేసు వివరాలు
2017 నుంచి 2019 మధ్య కాలంలో రిలయన్స్ కంపెనీ యస్ బ్యాంకు నుంచి రూ.3వేల కోట్ల లోన్లు తీసుకుంది. ఈ రూ.3వేల కోట్లను అనిల్ అంబానీ దారి మళ్లించారన్న ఆరోపణలు ఉన్నాయి. లోన్ ఇవ్వడానికి ముందు బ్యాంకు ప్రమోటర్లకు పెద్ద మొత్తం నిధులు అందినట్లు ఈడీ కనుగొంది. రూ.3వేల కోట్ల లోన్ నిధుల మళ్లింపును క్విడ్ ప్రోకోగా తేల్చింది. జులై 24వ తేదీన ఈ కేసుతో సంబంధం ఉన్న 50 సంస్థలపైనా ఈడీ అధికారులు దాడులు చేశారు. దాదాపు మూడు రోజుల పాటు ఈ దాడులు కొనసాగాయి. కాగా, తాజాగా లుక్ అవుట్ నోటీస్ ఇవ్వడంతో అనిల్ అంబానీకి పెద్ద షాకే తగిలినట్లు బిజినెస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
ఇవి కూడా చదవండి
తప్పతాగి డ్యూటీకి.. అడ్డంగా జనానికి దొరికిపోయిన ఎస్ఐ
మాజీ క్లర్క్ అవినీతి దందా.. 15వేల జీతం.. 30 కోట్ల ఆస్తులు