Share News

Crude Oil Price Hike: క్రూడ్‌ భగ్గు

ABN , Publish Date - Jun 14 , 2025 | 07:02 AM

అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్లో ముడిచమురు ధరలు ఒక్క రోజులో భారీగా పెరిగాయి. బ్రెంట్‌ క్రూడాయిల్‌ బ్యారెల్‌ ధర ఒక దశలో 78.50 డాలర్లకు ఎగబాకినప్పటికీ.. మళ్లీ కాస్త తగ్గి 74.80 డాలర్ల వద్ద స్థిరపడింది.

Crude Oil Price Hike: క్రూడ్‌ భగ్గు

  • ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య ఉద్రిక్తతలతో

  • భారీగా పెరిగిన ముడిచమురు ధర

  • ఒకదశలో 78.50 డాలర్లకు చేరిన రేటు

  • త్వరలో 80 డాలర్లు దాటే అవకాశం

అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్లో ముడిచమురు ధరలు ఒక్క రోజులో భారీగా పెరిగాయి. బ్రెంట్‌ క్రూడాయిల్‌ బ్యారెల్‌ ధర ఒక దశలో 78.50 డాలర్లకు ఎగబాకినప్పటికీ.. మళ్లీ కాస్త తగ్గి 74.80 డాలర్ల వద్ద స్థిరపడింది. ముడిచమురు ఎగుమతి దేశాల్లో ఒకటైన ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు జరపడం ఇందుకు ప్రధాన కారణం. అంతర్జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగా మన మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లోనూ జూన్‌ డెలివరీ క్రూడ్‌ కాంట్రాక్టు ధర ప్రారంభ ట్రేడింగ్‌లో ఏకంగా 10.08 శాతం (రూ.578) పెరిగి సరికొత్త గరిష్ఠ స్థాయి రూ.6,311కి ఎగబాకింది. ఆ తర్వాత కాస్త తగ్గి 7.38 శాతం పెరుగుదలతో రూ.6,156 స్థాయిలో ట్రేడైంది. ఇజ్రాయెల్‌ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్‌ ఇప్పటికే హెచ్చరించింది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగితే బ్రెంట్‌ క్రూడాయిల్‌ రేటు 80 డాలర్లు దాటేయవచ్చని కమోడిటీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్‌ అణు కేంద్రాలు, సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడి చేసిన ఇజ్రాయెల్‌.. ఆ దేశ చమురు కేంద్రాలను మాత్రం తాకలేదు. ప్రస్తుతం ఇరాన్‌ 21 లక్షల బ్యారెళ్ల ముడిచమురును ఎగుమతి చేస్తోంది. భవిష్యత్‌లో ఇజ్రాయెల్‌ ఇరాన్‌ చమురు సరఫరాకు భంగం కలిగించినా, ఇరాన్‌ స్ర్టెయిట్‌ ఆఫ్‌ హార్మజ్‌ నుంచి ఆయిల్‌ సరఫరాను అడ్డుకున్నా ధరలు మళ్లీ 100 డాలర్ల దిశగా దూసుకెళ్లవచ్చన్న ఆందోళనలూ వ్యక్తమవుతున్నాయి. ప్రపంచ క్రూడ్‌ సరఫరాలో 20 శాతం ఈ సముద్ర మార్గం ద్వారానే జరుగుతుండడమే ఇందుకు కారణం


ఇంధనం, ఎయిర్‌లైన్స్‌, పెయింట్స్‌ షేర్లు డౌన్‌

ముడిచమురు ధరల పెరుగుదలతో ఐఓసీ, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌ వంటి దేశీయ ఇంధన విక్రయ కంపెనీలపై తీవ్ర ప్రభావం పడనుంది. క్రూడ్‌ ధర ఒక డాలర్‌ పెరిగితే, మన ఇంధన కంపెనీల లాభానికి రూ.200-300 కోట్ల వర కు గండి పడుతుందని అంచనా. పెయింట్ల కంపెనీల తయారీ వ్యయాల్లో సగం వాటా ముడిచమురుదే. ఈ నేపథ్యంలో ఇంధన, ఎయిర్‌లైన్స్‌, పెయింట్స్‌, టైర్ల తయారీ సంస్థల షేర్లు గణనీయంగా నష్టపోయాయి. ప్రభుత్వ రంగ ఇంధన విక్రయ కంపెనీలైన ఐఓసీ షేరు బీఎ్‌సఈలో 1.78 శాతం క్షీణించగా.. బీపీసీఎల్‌ 1.90 శాతం, హెచ్‌పీసీఎల్‌ 1.41 శాతం తగ్గాయి. ఒకదశలోనైతే బీపీసీఎల్‌ 6.11 శాతం, హెచ్‌పీసీఎల్‌ 5.34 శాతం, ఐఓసీ 3.91 శాతం వరకు పతనమైనప్పటికీ మళ్లీ కాస్త కోలుకున్నాయి.

విమానయాన రంగంలో ఇండిగో స్టాక్‌ 3.71 శాతం, స్పైస్‌జెట్‌ 1.95 శాతం తగ్గాయి. పెయింట్ల తయారీదారుల్లో ఇండిగో పెయింట్స్‌ 2.63 శాతం, బెర్జర్‌ పెయింట్స్‌ 0.59 శాతం, ఏషియన్‌ పెయింట్స్‌ 0.14 శాతం నష్టపోయాయి. టైర్ల తయారీదారుల్లో సియట్‌, అపోలో టైర్స్‌ ఒక శాతానికి పైగా నష్టపోయాయి.

సామాన్యుడిపై ప్రభావమెంత..?

ముడిచమురు ధర 80 డాలర్లు దాటి మరింత ఎగబాకితే దేశీయంగా ఇంధన కంపెనీలు పెట్రోల్‌, డీజిల్‌ రేట్లను పెంచాల్సి రావచ్చు. దాంతో వాహనదారులపై భారం పెరగడంతో పాటు సరుకు రవాణా వ్యయం పెరుగుతుంది. ఫలితంగా మార్కెట్లో నిత్యావరసరాల ధరలు కూడా ఎగబాకే ప్రమాదం ఉంది. ద్రవ్యోల్బణం పెరిగితే ఆర్‌బీఐ వడ్డీరేట్ల తగ్గింపు ప్రక్రియకూ అడ్డుకట్ట పడుతుంది. అంతేకాదు, ప్రభుత్వానికీ ఇది భారమే. ఎందుకంటే, దేశీయ ఇంధన అవసరాల్లో 85 శాతం దిగుమతుల ద్వారానే సమకూరుతోంది. ముడిచమురు ధరల పెరగుదల కారణంగా దిగుమతుల వ్యయం పెరిగితే కరెంట్‌ ఖాతా లోటును నిర్దేశిత లక్ష్యం మేరకు కట్టడి చేయడం సాధ్యపడదు.

Updated Date - Jun 14 , 2025 | 07:06 AM