American Made iPhone Price: ఐఫోన్లను అమెరికాలో తయారు చేస్తే ధర రూ.3 లక్షలకు చేరుకుంది.. ట్రంప్కు నిపుణుల వార్నింగ్
ABN , Publish Date - May 16 , 2025 | 05:31 PM
అమెరికాలో తయారయ్యే ఐఫోన్ల ధరలు ప్రస్తుతం కంటే మూడు రెట్లు అధికంగా ఉంటాయంటూ ఇండ్ట్రీకి చెందిన నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఐఫోన్ తయారీ కార్యకలాపాలను భారత్లో చేపట్టొద్దని యాపిల్ సంస్థ సీఈఓకు తాను చెప్పానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే, ఈ చర్య అమెరికన్లకే తీవ్ర నష్టం కలిగిస్తుందని ఇండస్ట్రీ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. అమెరికాలో తయారయ్యే ఐఫోన్ల ధర మూడు రెట్లు పెరిగి రూ.3 లక్షలకు చేరుకుంటుందని పేర్కొన్నాయి. ప్రస్తుతం ఐఫోన్ ధర వెయ్యి డాలర్లు కాగా అమెరికాలో తయారు చేసిన వాటి ధర 3 వేల డాలర్లకు చేరుకుంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
‘‘ఈ విషయంలో యాపిల్ సంస్థ, అమెరికా ప్రభుత్వం మరోసారి పునరాలోచిస్తుందనే అనుకుంటున్నా. అమెరికాలో ఐఫోన్ల తయారీ చేపట్టే ముందు కొన్ని విషయాలను గుర్తించాలి. చైనా, భారత్ లేదా వియత్నాంకు బదులు అమెరికాలో వీటిని తయారు చేయడం ప్రారంభిస్తే ధర వెయ్యి నుంచి మూడు వేల డాలర్లకు ఎగబాకుతుంది. ఈ ధరాభారానికి అమెరికన్లు సిద్ధమేనా?’’ అని మహరట్టా ఛాంబర్ ఆఫ్ కామర్స్ డైరెక్టర్ ప్రశాంత్ గిర్బేన్ వ్యాఖ్యానించారు.
‘‘భారత్లో ఐఫోన్ తయారీ చేపట్టింత మాత్రాన అమెరికాలోని జాబ్స్ ఇక్కడకు రావు. ఇందుకు బదులుగా చైనాలో అవకాశాలు తగ్గి భారత్లో పెరుగుతాయి. వాణిజ్యపరంగా అమెరికాతో అంత సఖ్యతగా ఉండని చైనా నుంచి అమెరికన్లకూ కొంత రక్షణ లభిస్తుంది’’ అని ఆయన చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం యాపిల్ సంస్థ తయారీ కార్యకలాపాల్లో 80 శాతం చైనాలో జరుగుతున్నాయని అన్నారు. తద్వారా అక్కడి ప్రజలకు 5 మిలియన్ ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు.
‘‘అమెరికా అధ్యక్షుడు ప్రకటనలపై స్పందించేముందు కొంత కాలం వేచి చూస్తే మంచిదని ఇటు భారత్కు, అటు ప్రపంచానికి ఈపాటికే అర్థమైపోయింది. ఇక యాపిల్ విషయానికొస్తే.. వాళ్లు ఇప్పటికే భారత్లో 22 బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్లు తయారు చేశారు. యాపిల్కు భారత్లో మూడు మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి. మరో రెండిటిని ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు కూడా రెడీగా ఉన్నాయి’’ అని టెలికాం ఎక్విప్మెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ చైర్మన్ ఎన్కే గోయల్ తెలిపారు. ట్రంప్ సుంకాల ప్రభావం యాపిల్పై పడకుండా ఉండేందుకు టిమ్ కుక్ ఐఫోన్ తయారీ కార్యకలాపాలను భారత్కు మళ్లించేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి
ఇండియా-అమెరికా ట్రేడ్ డీల్పై ట్రంప్ వ్యాఖ్యలు..జైశంకర్ కౌంటర్..
ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాని సమాధానం చెప్పాలి