పంట వ్యర్థాలతో భూసారం
ABN , Publish Date - Jun 08 , 2025 | 12:11 AM
అసలే మన జిల్లాల్లోని నేలలో సేంద్రియ కర్బనశాతం తక్కువ. నేలలో సహజంగా కోట్ల సంఖ్యలో సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా, శిలీంద్రాలతో పాటు వేల సంఖ్యలో కీటకాలు, వానపాములు, నులిపురుగులు ఉంటాయి.

వరి కొయ్యలను కాల్చేస్తే నేలకు నష్టం
ప్రమాదకరస్థాయిలో పడిపోయిన సేంద్రియ కర్బనం
పొలాన్ని కలియదున్నితే పంటలకు మేలంటున్న శాస్త్రవేత్తలు
నంద్యాల ఎడ్యుకేషన్, జూన్ 7 (ఆంధ్రజ్యోతి): అసలే మన జిల్లాల్లోని నేలలో సేంద్రియ కర్బనశాతం తక్కువ. నేలలో సహజంగా కోట్ల సంఖ్యలో సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా, శిలీంద్రాలతో పాటు వేల సంఖ్యలో కీటకాలు, వానపాములు, నులిపురుగులు ఉంటాయి. ఇవన్నీ సేంద్రియ పదార్థాలు కుళ్లేలా చేసి మొక్కలకు పోషకాలను అందించి భూసారాన్ని కాపాడుతాయి. పంట వ్యర్థా లను రైతులు కాల్చివేస్తే నేలకు మేలు చేసే సూక్ష్మజీవులు, మిత్రపురుగులకు తీవ్ర నష్టం జరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పైగా పంట వ్యర్థ్ధాలను తగులబెట్టేటప్పుడు వెలువడే పొగ వల్ల తీవ్ర వాయు కాలుష్యం ఏర్పడుతుంది. ఈ కారణం వల్ల కూడా పంట వ్యర్థాలను విచక్షణా రహితంగా కాల్సివేయకూడదు.
సాగు విధానంలో మార్పులు శాస్త్రీయంగా ఉండాలి. గతంలో వరి పంటను కొడవళ్లలో మొదళ్ల దాకా కోసేవారు. అయితే ప్రస్తుతం మిషన్తో వరిపంటను అడుగు మేర కోయడం ద్వారా కొయ్యలు పెద్దగా మిగిలిపోతున్నాయి. దీంతో దున్నే సమయంలో రైతులు నాగళ్లకు అడ్డుగా వస్తున్నాయని వరికొయ్యలను తగులబెడుతున్నారు. దీ ని వల్ల భూసారానికి నష్టం జరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుంది
వరి కొయ్యలను కాల్చితే రైతులకు నష్టమే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు. విపరీతమైన వేడితో నత్రజని, ఫాస్పరస్ లాంటి పోషక పదార్ధాల శాతం తగ్గుతుంది. పంటలకు అవసరమైన ఖనిజ, లవణాలు దెబ్బతింటాయి. పొలాల్లో తిరిగే పాములు, ఉడుములు, తొండల్లాంటి అనేక రకాల జీవరాశులు చనిపోయే ప్రమాదం ఉంది. ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుంది.
పొలాన్ని కలియ దున్నితే కలిగే లాభాలు
వరి కొయ్యలను నేలలో కలియదున్నడం వల్ల సేంద్రియ కర్బనశాతం పెరిగి దిగుబడులు 5 నుంచి 10శాతం వరకు అధికంగా వచ్చే అవకాశముంది.
దుక్కి దున్నే సమయంలో సింగిల్ సూపర్ఫాస్పేట్ చల్లితే వరి కొయ్యల అవశేషాలు రెండు వారాల్లో మురిగి పోషకాలుగా అందుబాటులోకి వస్తాయి.
సూపర్ ఫాస్ఫేట్ చల్లితే భూమి చౌడుబారడం నుంచి తప్పించడమే కాకుండా భూమిలో సేంద్రియ పదార్థాల స్థాయిని పెంచుతుంది.
కలియ దున్నడం వల్ల ఎకరాకు టన్ను వరకు ఎరువు తయారవుతుంది.
మొక్కలకు రెండు శాతం నత్రజని(యూరియా), నాలుగు శాతం ఫాస్పరస్ అదనంగా అందిస్తుంది. నేలలో కరగని మూలకాలను పంటకు అనుకూలంగా మారుస్తుంది.
తగ్గిపోయిన సేంద్రియ కర్బనశాతం
ఉమ్మడి జిల్లాల్లో సేంద్రియ కర్బనశాతం చూస్తే దిగ్ర్భాంతికరంగా ఉంది. అధికంగా ఉష్ణోగ్రతలుండే మన భూముల్లో సేంద్రియ పదా ర్థం త్వరగా అంతరించిపోతుంది. సాధారణంగా 0.08శాతం నుంచి 0.75శాతం ఉండాల్సిన సేంద్రియ కర్బనశాతం మన నేలల్లో 70శాతం భూముల్లో 0.05శాతం కంటే తక్కువగా ఉన్నట్లు శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది. రసాయన ఎరువులను అధికంగా వాడడం, పొలాల్లో వ్యర్ధాలను కాల్చడం వంటి చర్యలతో మరింత కర్బనశాతం పడిపోయి పంట దిగుబడి తగ్గిపోతుంది. మట్టిలో పశువుల ఎరువు, పచ్చిరొట్టి ఎరువులు, పంట మిగులు వంటివి విరివిగా వాడడం వల్ల మట్టిలో సేంద్రియ కర్బనశాతం పెంచవచ్చు.
నేల భౌతిక లక్షణాలు దెబ్బతింటాయి
రైతులు అధికంగా రసాయనాలు వాడడం, పంట వ్యర్థాలను కాలిస్తే పంటలకు మేలు చేసే సూక్ష్మజీవులు నశించిపోవడం వల్ల నేల భౌతిక లక్షణాలు దెబ్బతింటాయి. కేంద్ర కర్బనశాతం ఆవిరైపోయి సూక్ష్మజీవులు నశించి దిగుబడులు కూడా తగ్గిపోతాయి. ఒక ఎకరా లో వరికొయ్యలను భూమిలో కలియదున్నడం వల్ల రెండు ట్రాక్టర్ల ఎరువు లభిస్తుంది. - కేవీ రమణయ్య, భూసార శాస్త్రవేత్త, కృషి విజ్ఞానకేంద్రం
దిగుబడి తగ్గిపోతుంది
వరి కొయ్యలను తగులబెట్టడం వల్ల గాలి, నేల కలుషితమవుతుంది. పంటలకు మేలుచేసే మిత్ర పురుగుల కోల్పోవడం వల్ల పంట దిగుబడి తగ్గిపోతుంది. వరి కొయ్యలు పొలంలో కలియదున్నాలని రైతులకు వ్యవసాయ సదస్సుల్లో అవగాహన కల్పిస్తున్నాం. -మురళీకృష్ణ, జిల్లా వ్యవసాయాధికారి, నంద్యాల