Young Woman: మగాళ్లను టార్గెట్ చేసి.. తల్లీకూతుళ్ల మోసం..
ABN , Publish Date - Jun 23 , 2025 | 07:07 PM
Young Woman: విడాకులు తీసుకుని డిప్రెషన్లో ఉన్న పురుషులతో నీలిమ స్నేహం చేసేది. కొంతకాలం తర్వాత ఆ స్నేహాన్ని పెళ్లి వరకు తీసుకెళ్లేది. అయితే, పెళ్లి చేసుకునేది కాదు.

కోనసీమ జిల్లాలో ఓ నిత్య పెళ్లి కూతురి బాగోతం బయటపడింది. ఓ యువతి తన తల్లి సాయంతో ఏకంగా 12 మందిని పెళ్లి పేరుతో మోసం చేసింది. విడాకులు తీసుకున్న వారిని టార్గెట్ చేసుకుని, తల్లీకూతుర్లు మోసం చేశారు. ప్రశ్నించిన వారిపైనే కేసులు పెట్టి వేధించారు. లక్షల్లో డబ్బులు దోచేశారు. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. కోనసీమ జిల్లా రామచంద్రాపురం గ్రామానికి చెందిన నీలిమ అనే యువతి, ఆమె తల్లి వరలక్ష్మి మగాళ్లను మోసం చేయటం పనిగా పెట్టుకున్నారు.
ఆర్థిక స్థిరత్వం కలిగి విడాకులు తీసుకున్న పురుషులను టార్గెట్ చేశారు. విడాకులు తీసుకుని డిప్రెషన్లో ఉన్న పురుషులతో నీలిమ స్నేహం చేసేది. కొంతకాలం తర్వాత ఆ స్నేహాన్ని పెళ్లి వరకు తీసుకెళ్లేది. అయితే, పెళ్లి చేసుకునేది కాదు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, మాయ మాటలతో వారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకునేది. తర్వాత వారిని దూరం పెట్టేది. బాధితులకు విషయం అర్థమై తిరగబడితే.. తప్పుడు కేసుల్లో వారిని ఇరికించేది.
ఈ విధంగా రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన 12 మంది మగాళ్లను నీలిమ, వరలక్ష్మి మోసం చేశారు. వారినుంచి లక్షల రూపాయల డబ్బు కాజేశారు. నీలిమ చేతిలో మోసపోయిన వారంతా ఎస్సీకి ఫిర్యాదు చేశారు. ఆ ఇద్దరు కాజేసిన డబ్బులను తిరిగి తమకు ఇప్పించాలని కోరారు. ఈ నేపథ్యంలోనే నీలిమ, వరలక్ష్మిలపై పోలీస్ కేసు నమోదైంది. పోలీసులు పరారీలో ఉన్న ఆ ఇద్దరి కోసం గాలిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
బై ఎలక్షన్లో గెలుపు.. విజయోత్సాహంతో ప్రత్యర్థుల ఇళ్లపై బాంబుల దాడి
రైలులో ఎమ్మెల్యే దౌర్జన్యం.. సీటు మార్చుకోలేదని..