మీదివేములలో భగ్గుమన్న ఫ్యాక్షన
ABN , Publish Date - Jun 06 , 2025 | 11:23 PM
మండలంలోని మీదివేముల గ్రామంలో మళ్లీ ప్యాక్షన భగ్గుమంది. గురువారం రాత్రి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ బోయ రమేష్ నాయుడు (45) దారుణ హత్యకు గురి కావడం తెలిసిందే.

మాజీ ఎంపీటీసీ హత్య నేపథ్యంలో గ్రామంలో పోలీసు బందోబస్తు
నిందితుల కోసం గాలింపు
ఓర్వకల్లు, కర్నూలు క్రై, జూన 6 (ఆంధ్రజ్యోతి): మండలంలోని మీదివేముల గ్రామంలో మళ్లీ ప్యాక్షన భగ్గుమంది. గురువారం రాత్రి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ బోయ రమేష్ నాయుడు (45) దారుణ హత్యకు గురి కావడం తెలిసిందే. నన్నూరు నుంచి ద్విచక్రవాహనంపై వస్తుండగా.. మీదివేముల సమీపంలో దిగువయ్య దర్గా మలుపు వద్ద కాపు కాచిన గుర్తు తెలియని దుండగులు బైక్ను ఆపి రమేష్ నాయుడుపై బీరు సీసాలతో దాడి చేసి పొలంలోకి తీసుకెళ్లి రమేష్నాయుడు తలపై బారీ బండరాయితో మోది విచక్షణారహితంగా దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. శుక్రవారం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి సాయంత్రం గ్రామానికి తీసుకొచ్చారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మీదివేములలో గట్టి పోలీసు బందోబస్తు చేశారు. అంత్యక్రియలు ప్రశాంతంగా జరిగాయి. ఆరుగురు టీడీపీ నాయకులు మేడం రామాంజనేయులు, మేడం తిరుపాలు, బోయ బుగ్గరాముడు, మేడం నాయుడు, మేడం రాజు, మేడం శ్రీనివాసులపై మృతుని భార్య లక్ష్మీదేవి ఫిర్యాదు మేరకు వీరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కర్నూలు రూరల్ సీఐ చంద్రబాబు నాయుడు, ఓర్వకల్లు ఎస్ఐ సునీల్ కుమార్ పర్యవేక్షణలో హత్య చేసిన నిందితుల కోసం గాలింపు చేపట్టారు. నన్నూరు, లొద్దిపల్లె, ఉయ్యాలవాడ వద్ద ఉన్న సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. హత్య చేసిన నిందితులను త్వరగా పట్టుకుని అరెస్టు చేస్తామని సీఐ చంద్రబాబు నాయుడు తెలిపారు. మీదివేముల గ్రామంలో 1987లో అంటే 38 ఏళ్ల తర్వాత ఫ్యాక్షన మొదలైంది. ఆ గ్రామానికి కరిమద్ది హత్య కేసులో 13 మంది నిందితులకు కారాగార శిక్ష విధించిన నేపథ్యంలో మళ్లీ గ్రామంలో ప్యాక్షన హత్య జరగడంతో గ్రామ ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. మాజీ ఎంపీటీసీ రమేష్ నాయుడు హత్యకు గురి కావడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అంత్యక్రియలకు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, కర్నూలు మార్కెట్ యార్డు మాజీ చైర్మన ప్రభాకర్ రెడ్డి హాజరై నివాళులర్పించారు. మండలంలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. మృతునికి భార్య కుమార్తె, కుమారుడు ఉన్నారు.
మృతుడి రాజకీయ నేపథ్యం: రమేష్ నాయుడు మొదటి నుంచి కర్నూలు మార్కెట్ యార్డు మాజీ చైర్మన ప్రభాకర్ రెడ్డికి సన్నిహితంగా ఉండేవాడు. 2014 స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ తరపున ఎంపీటీసీగా భారీ మెజారీటితో గెలుపొందారు.
ఫ నిందితులను కఠినంగా శిక్షించాలి - వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి
మీదివేముల గ్రామ వైసీపీ నాయకుడు, మాజీ ఎంపీటీసీ బోయ రమేష్ నాయుడు దారుణహత్యకు పాల్పడిన టీడీపీ నాయకులను చట్టపరంగా కఠినంగా శిక్షించాలి. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నందుకే టీడీపీ వర్గీయులు ఓర్వలేక ఆయనను హత్య చేశారు.
ఫ ఘటనా స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ
జిల్లా ఎస్పీ విక్రాంత పాటిల్ సంఘటనా స్థలాన్ని గురువారం రాత్రి పరిశీలించారు. గ్రామంలో పర్యటించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. మొదట ఇది రాజకీయ హత్యగా బావించిన పోలీసులు గ్రామంలో పెద్ద ఎత్తున పోలిస్ పికెట్ ఏర్పాటు చేశారు. ఎలాంటి గొడవలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.