Share News

Tenali Police: రౌడీషీటర్లకు నడిరోడ్డుపై పోలీసు దండన

ABN , Publish Date - May 27 , 2025 | 05:32 AM

తెనాలిలో గంజాయి మత్తులో పోలీసు కానిస్టేబుల్‌పై దాడి చేసిన రౌడీషీటర్లలో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసి, వారిని రోడ్డుపై కూర్చోబెట్టి లాఠీలతో కొట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి వివాదాన్ని రేకెత్తించింది.

Tenali Police: రౌడీషీటర్లకు నడిరోడ్డుపై పోలీసు దండన

తెనాలి, మే 26(ఆంధ్రజ్యోతి): తెనాలిలో నెల రోజుల క్రితం గంజాయి మత్తులో నలుగురు యువకులు (వీరీలో ముగ్గురిపై రౌడీషీట్‌ ఉంది) పోలీస్‌ కానిస్టేబుల్‌పై దాడి చేశారు. వారిలో ముగ్గురిని పట్టుకొన్న పోలీసులు కేసు కట్టారు. ఆ క్రమంలో వారిని నడిరోడ్డుపై కూర్చోబెట్టి లాఠీలతో కొట్టారు. ఆ దృశ్యాలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. ‘తెనాలి ఐతానగర్‌ నివాసి చిరంజీవి త్రీ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. గంజాయి కేసులో తమను పట్టుకున్నారన్న కోపంతో ఉన్న నలుగురు కుర్రోళ్లు... ఏప్రిల్‌ 25న ఇంటికి వెళ్తున్న కానిస్టేబుల్‌ చిరంజీవిపై దాడి చేసి చంపడానికి ప్రయత్నించారు. దీనిపై అప్పట్లోనే టు టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో నిందితులైన చేబ్రోలు జాన్‌విక్టర్‌, షేక్‌ బాబులాల్‌, దోమా రాకేశ్‌, నవీన్‌లలో ముగ్గురిని అరెస్టు చేసి ఏప్రిల్‌ 26న కోర్టులో హాజరు పరిచారు. రిమాండ్‌ విధించడంతో ప్రస్తుతం జైలులోనే ఉన్నారు. నవీన్‌ మాత్రం అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. అయితే ఈ కేసులో పోలీసులు పట్టుకున్న ముగ్గురిని ఐతానగర్‌లో రోడ్డుపై కూర్చోబెట్టి కొడుతున్నట్లుగా ఉన్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఆ వీడియో కింద దానికి అనుకూలంగా, వ్యతిరేకంగానూ పలువురు పెట్టిన కామెంట్స్‌ కూడా వైరల్‌ అవుతున్నాయి. దీనిపై డీఎస్పీ జనార్దనరావు మాట్లాడుతూ... ‘ఆ ముగ్గురిపై రౌడీషీట్‌ ఉంది. గతంలో ఎన్నోసార్లు హెచ్చరించాం. అయినా వారిలో మార్పు రాలేదు’ అని చెప్పారు.

Updated Date - May 27 , 2025 | 05:34 AM