Polavaram Project: పోలవరం పనులు ఎలా జరుగుతున్నాయ్
ABN , Publish Date - Jun 15 , 2025 | 06:33 AM
పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రంవాల్, బట్రస్ డ్యాంల నిర్మాణాలను కేంద్ర జల సంఘం బృందం శనివారం పరిశీలించింది. కేంద్ర జల సంఘం సభ్యుడు యోగేశ్ పైథాంకర్, చీఫ్ ఇంజనీర్ హెచ్.ఎస్.సెనెగర్, ప్రాజెక్టు అథారిటీ చీఫ్ ఇంజనీర్...

పోలవరాన్ని పరిశీలించిన కేంద్ర జల సంఘం
అమరావతి, పోలవరం, జూన్ 14(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రంవాల్, బట్రస్ డ్యాంల నిర్మాణాలను కేంద్ర జల సంఘం బృందం శనివారం పరిశీలించింది. కేంద్ర జల సంఘం సభ్యుడు యోగేశ్ పైథాంకర్, చీఫ్ ఇంజనీర్ హెచ్.ఎస్.సెనెగర్, ప్రాజెక్టు అథారిటీ చీఫ్ ఇంజనీర్ రమేశ్ కుమార్ల బృందం ఉదయం ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు కార్యాలయానికి చేరుకుంది. మోడల్ రూంలో ఉన్న ప్రాజెక్టు నమూనా పరిశీలించింది. అనంతరం ప్రాజెక్టు నిర్మాణంలో సీపేజీ నివారణ కోసం నిర్మిస్తున్న బట్రస్ డ్యాం, డయాఫ్రం వాల్, గ్యాప్ 1 నిర్మాణ పనులను, ఎగువ, దిగువ కాపర్ డ్యాంలు, స్పిల్ వే ప్రాంతాలను, కాంక్రీట్ మిక్సింగ్ ల్యాబ్లను పరిశీలించింది. కేంద్ర జల సంఘం బృందానికి సీఈ కె.నరసింహమూర్తి, ఎస్ఈ రామచంద్రారెడ్డి, ఈఈలు బాలకృష్ణ, శ్రీనివాస్ సంబంధిత వివరాలను తెలిపారు.
పనుల తీరుపై బృందం పరిశీలన
‘డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు ఎలా సాగుతున్నాయి? నాణ్యతా ప్రమాణాలను ఎంత వరకూ పాటిస్తున్నారు? అంతర్జాతీయ నిపుణుల ప్యానెల్ ఆమోదించిన డిజైన్లు, ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమం సరిగ్గా వాడుతున్నారా?’ అంటూ పలు విషయాలను సూక్ష స్థాయిలో బృందం పరిశీలన చేసింది. ఈ క్రమంలోనే ‘డిసెంబరులోగా డయాఫ్రమ్ వాల్ పూర్తి చేయగలరా?’ అంటూ ఇంజనీరింగ్ అధికారులను సీడబ్ల్యూసీ ప్రతినిధులు ప్రశ్నించారని తెలిసింది. ‘ఈ నెలలో పనులు వేగంగా జరుగుతున్నా యి. ఎలాంటి ప్రతిబందకాలూ ఎదురు కాలేదు. నెలాఖరుకు సాధించిన లక్ష్యాన్ని బట్టి పనులు పూర్తి చేయడంపై స్పష్టమైన అంచనా వస్తుంది’ అంటూ ఇంజనీర్లు బదులిచ్చారు. ‘ప్రస్తుతానికి నిర్మాణానికి ఆటంకం లేదు. కాని భవిష్యత్లో వరద వస్తే ఎలా?’ అంటూ సీడబ్ల్యుసీ బృందం సందేహాన్ని వ్య క్తం చేశారు. ‘వరద వచ్చినా డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులకు ఎలాంటి ప్రతిబందకమూ ఎదురుకాకుండా ఉండేలా, 19 మీటర్ల ఎత్తులో వరదను తట్టుకునేలా చర్యలు తీసుకున్నాం. ఇది 20 నుంచి 22 మీటర్లకు చేరుకున్నా పనులు సాఫీగా సాగేలా చర్యలు తీసుకున్నాం. మరికొద్ది రోజుల్లో కీలక ప్రాంతాల్లో డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు పూర్తయిపోతాయి. చివర్లలో కొద్దిపాటి పనులు మిగిలినా పెద్ద ఆటంకం కాబోదు. జూలై నుంచి గోదావరి వరద ప్రవాహం పెరిగినా అక్టోబరు చివరి నాటికి తగ్గిపోతుంది.’ అని ఇంజనీర్లువివరించారు.