Rain Alert Andhra: నైరుతి కదలికలో స్వల్ప జాప్యం
ABN , Publish Date - Jun 14 , 2025 | 05:03 AM
నైరుతి రుతుపవనాల కదలికలో స్వల్ప జాప్యం నెలకొంది. రానున్న మూడు రోజుల్లో విదర్భ,ఛత్తీస్గఢ్, ఒడిశాలో పలు ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరిస్తాయని..

కోస్తా, సీమలకు వర్షసూచన
విశాఖపట్నం, అమరావతి, జూన్ 13(ఆంధ్రజ్యోతి): నైరుతి రుతుపవనాల కదలికలో స్వల్ప జాప్యం నెలకొంది. రానున్న మూడు రోజుల్లో విదర్భ,ఛత్తీస్గఢ్, ఒడిశాలో పలు ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరిస్తాయని శుక్రవారం బులెటిన్లో పేర్కొంది. ఆ తర్వాత మూడు రోజుల్లో గుజరాత్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బిహార్లో పలు ప్రాంతాలకు విస్తరించనున్నాయని పేర్కొంది. శుక్రవారం తెలంగాణ, రాయలసీమ, కర్ణాటక పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. కర్ణాటక నుంచి తెలంగాణ, ఛత్తీస్గఢ్ మీదుగా ఒడిశా వరకూ ఉపరితలద్రోణి విస్తరించింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. శని, ఆదివారాల్లో కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ, విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపాయి. తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లరాదని హెచ్చరించాయి.