Sullurpeta: 18న నింగిలోకి నిఘా నేత్రం
ABN , Publish Date - May 16 , 2025 | 03:12 AM
భారత సరిహద్దులపై నిఘా కోసం ఇస్రో మే 18న ఈవోఎస్–09 ఉపగ్రహాన్ని పీఎస్ఎల్వీ–సీ61 ద్వారా ప్రయోగించనుంది. రాత్రింబవళ్లు, వర్షంలోనూ స్పష్టమైన చిత్రాలు తీయగల అధునాతన రాడార్ వ్యవస్థ దీనిలో ఉంది.

పీఎస్ ఎల్వీ-సీ61 రాకెట్ ద్వారా ఈవోఎస్-09 ప్రయోగం
సరిహద్దులు, తీరప్రాంతంపై రేయింబవళ్లు నిఘా
సూళ్లూరుపేట, మే 15 (ఆంధ్రజ్యోతి): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమైంది. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ఆదివారం ఉదయం 5:59 గంటలకు పీఎస్ఎల్వీ-సీ61 రాకెట్ ద్వారా అత్యాధునిక రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహం ఈవోఎస్-09 (రీశాట్-1బీ)ను ప్రయోగించనుంది. ఈ ఉపగ్రహం దేశ సరిహద్దుల్లో భద్రత, రక్షణ నిమిత్తం శత్రువుల కదలికలపై నిఘా పెట్టనుంది. ఈ ప్రయోగం కోసం ఇస్రో శాస్త్రవేత్తలు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే షార్లోని మొదటి ప్రయోగ వేదికపై రాకెట్ నాలుగు దశల అనుసంధాన పనులను పూర్తిచేసి శిఖర భాగాన ఉపగ్రహాన్ని అమర్చి ప్రయోగానికి సిద్ధం చేశారు. ప్రయోగానికి 22 గంటల ముందు కౌంట్డౌన్ మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దేశ సరిహద్దు భద్రత, రక్షణకు సంబంధించిన ప్రయోగం కావడంతో ఇస్రో ఆ వివరాలేవీ అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. 1,710 కిలోల బరువున్న ఈవోఎస్-09 ఉపగ్రహాన్ని భూమికి 529 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలో ప్రవేశ పెట్టనున్నారు. రీశాట్-1బీగా పిలిచే ఈవోఎస్-09 (ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్)లో అత్యాధునిక సీ-బ్యాండ్ సింథటిక్ అపెర్చర్ రాడార్ (ఎస్ఏఆర్)ను అమర్చారు. పగలు రాత్రి అన్న తేడా లేకుండా వర్షం పడుతున్నా, దట్టమైన పొగమంచు కమ్ముకున్నా, మేఘాలు అడ్డుగా ఉన్నా.. భూ ఉపరితలాన్ని హై-రిజ ల్యూషన్తో ఫొటోలు తీయగలగడం దీని ప్రత్యేకత. ఇది రక్షణ శాఖకు ఎంతో ఉపయోగపడుతుంది.
షార్కు చేరిన నిసార్ ఉపగ్రహం
ఇస్రో-నాసా సంయుక్తంగా వచ్చే నెలలో చేపట్టనున్న నిసార్ ఉపగ్రహ ప్రయోగానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ ఉపగ్రహం గురువారం బెంగళూరు నుంచి షార్ కేంద్రానికి చేరుకుంది. బెంగళూరులోని ఉపగ్రహ కేంద్రం నుంచి రోడ్డు మార్గాన భారీ భద్రత నడుమ ప్రత్యేక వాహనంలో దీన్ని తీసుకొచ్చారు. వచ్చే నెలలో ప్రయోగించే జీఎ్సఎల్వీ-ఎఫ్16 రాకెట్ ద్వారా నిసార్ను రోదసిలోకి పంపనున్నారు. షార్లోని రెండో ప్రయోగ వేదిక వద్దనున్న వెహికల్ అసెంబ్లీ బిల్డింగ్లో రాకెట్ అనుసంధాన పనులు జరుగుతున్నాయి. ఉపగ్రహాన్ని క్లీన్ రూంలో పెట్టి తుది పరీక్షలు నిర్వహించిన అనంతరం రాకెట్ శిఖర భాగాన అమర్చి ప్రయోగానికి సిద్ధం చేస్తారు.