Share News

Visakhapatnam: అంతర్రాష్ట్ర గజదొంగ సలీమ్‌ ఖురేషి అరెస్టు

ABN , Publish Date - Jun 13 , 2025 | 04:52 AM

ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో 200కుపైగా దొంగతనాలకు పాల్పడిన హైదరాబాద్‌ వాసి మహ్మద్‌ సలీమ్‌ ఖురేషి(51)ని విశాఖపట్నం పోలీసులు అరెస్టు చేశారు.

Visakhapatnam: అంతర్రాష్ట్ర గజదొంగ సలీమ్‌ ఖురేషి అరెస్టు

విశాఖపట్నం, జూన్‌ 12(ఆంధ్రజ్యోతి): ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో 200కుపైగా దొంగతనాలకు పాల్పడిన హైదరాబాద్‌ వాసి మహ్మద్‌ సలీమ్‌ ఖురేషి(51)ని విశాఖపట్నం పోలీసులు అరెస్టు చేశారు. ఆ వివరాలను విశాఖ నగర పోలీసు కమిషనర్‌ శంఖబ్రత బాగ్చీ గురువారం విలేకరులకు తెలిపారు. సలీమ్‌ ఖురేషి తన గ్యాంగ్‌తో కలసి ఏపీలో 5(విశాఖలో 3, గుంటూరులో 2), తెలంగాణాలో 65, మహారాష్ట్రలో 35, రాజస్థాన్‌, గుజరాత్‌లలో ఒక్కొక్కటి, కర్ణాటకలో ఆరు సహా 200కుపైగా దొంగతనాలకు పాల్పడినట్టు సీపీ తెలిపారు. 2001లో ముంబైలో గ్యాంగ్‌స్టర్‌ చోటారాజన్‌ ఇంట్లో పది కోట్ల విలువైన బంగారు వస్తువులు, వజ్రాలను దొంగిలించాడన్నారు. మహారాష్ట్రకు చెందిన మయూర్‌ జాదవ్‌ అలియాస్‌ వసీం అబ్దుల్‌ షేక్‌, పఠాన్‌ అనే మరో ఇద్దరితో కలిసి విశాఖలో మూడిళ్లలో దొంగతనానికి పాల్పడ్డాడన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితుడిని మహారాష్ట్రలో అరెస్టు చేసినట్టు తెలిపారు. అతడి నుంచి రూ.25 లక్షల విలువైన ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామన్నారు.

Updated Date - Jun 13 , 2025 | 04:55 AM