Koluau Parthasarthy: ప్రతి కుటుంబానికీ 1.04 లక్షలు లబ్ధి
ABN , Publish Date - Jun 15 , 2025 | 06:22 AM
రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి సగటున రూ.1.04 లక్షల లబ్ధి చేకూరుస్తున్నామని మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. విజయవాడ బందరు రోడ్డులోని...

వైసీపీ హయాంలో 30 వేలు మాత్రమే: మంత్రి కొలుసు
విజయవాడ (వన్టౌన్), జూన్ 14(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి సగటున రూ.1.04 లక్షల లబ్ధి చేకూరుస్తున్నామని మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. విజయవాడ బందరు రోడ్డులోని ఆయన తన క్యాంప్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఏడాది కాలంలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలు, తల్లికి వందనం కార్యక్రమ విశేషాలను వెల్లడించారు. ‘గత ప్రభుత్వం సగటున ప్రతి కుటుంబానికి కేవలం రూ.30 వేలు మాత్రమే లబ్ధి చేకూర్చగా, సూపర్ సిక్స్ ద్వారా కూటమి ప్రభుత్వం రూ.1.04 లక్షలు అందిస్తోంది. తల్లికి వందనం కార్యక్రమంలో ఇంటిలో ఎంత మంది చదువుకుంటే అంతమందికి డబ్బులు జమ చేస్తున్నాం. గత ప్రభుత్వం కేవలం ఒకరికి మాత్రమే లబ్ధి చేకూర్చింది. గత ప్రభుత్వంలో పిల్లల భవిష్యత్తు గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి రాష్ట్రంలో పెట్టుబడులు తేవటానికి ఎంతో కృషి చేస్తోంది.’ అని మంత్రి పార్థసారథి అన్నారు.