Prakasam District: పొదిలి సీఐపై చెవిరెడ్డి దౌర్జన్యం
ABN , Publish Date - Jun 15 , 2025 | 05:01 AM
మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ప్రకాశం జిల్లా పొదిలి పోలీస్ స్టేషన్లో శనివారం వీరంగం సృష్టించారు...

దాడి కేసులో నిందితులను కలిసేందుకు స్టేషన్లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం
అడ్డుకున్న పోలీసులు.. సీఐతో వాగ్వాదం
ఎల్లకాలం మీ ఆటలు సాగవంటూ హెచ్చరిక
పొదిలి, జూన్ 14(ఆంధ్రజ్యోతి): మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ప్రకాశం జిల్లా పొదిలి పోలీస్ స్టేషన్లో శనివారం వీరంగం సృష్టించారు. ఈనెల 11న పొదిలిలో మహిళలు, పోలీసులపై దాడి చేసిన నిందితులను స్టేషన్లో కలిసేందుకు ఆయన తీవ్రంగా ప్రయత్నించారు. ఈ సందర్భంగా స్టేషన్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన చెవిరెడ్డిని సీఐ టి.వెంకటేశ్వర్లు అడ్డుకున్నారు. అసహనంతో ఊగిపోయిన చెవిరెడ్డి స్టేషన్ ముందు ధర్నా చేస్తామంటూ హెచ్చరించారు. ఈసందర్భంలో సీఐపై దౌర్జన్యానికి దిగి.. దురుసుగా మాట్లాడారు. వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని, ఎల్లకాలం మీ ఆటలు సాగవన్నారు. ఒక దశలో సీఐ, చెవిరెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అక్రమ కేసులు పెట్టే ఉద్దేశమే తమకు లేదని సీఐ స్పష్టం చేశారు. అనంతరం తొమ్మిది మంది నిందితులను పొదిలి జూనియర్ సివిల్ న్యాయాధికారి కోర్టులో హాజరుపరిచారు. కోర్టుకు చెవిరెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యేలు అన్నా రాంబాబు, ఉడుముల శ్రీనివాసరెడ్డి వచ్చారు. లోపలికి రాకూడని హెచ్చరించడంతో బయట వేచి ఉన్నారు.
రాళ్లదాడి కేసులో మరో 15 మంది అరెస్ట్
ఈనెల 11న పొదిలిలో మాజీ సీఎం జగన్ పర్యటన సందర్భంగా వైసీపీ అల్లరి మూకలు మహిళలు, పోలీసులపై దాడి చేసిన ఘటన కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. 12న తొమ్మిది మంది నిందితులను అరెస్ట్ చేయగా, శనివారం మరో 15 మందిని కూడా అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ వేమన తెలిపారు. ముందస్తు వ్యూహంలో భాగంగానే దాడులకు పాల్పడినట్లు గుర్తించామన్నారు. వాట్సాప్ చాటింగ్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఈ దాడులకు పాల్పడినట్లు వెల్లడించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలనే ఉద్దేశంతోనే ఇది జరిగినట్లు భావిస్తున్నామన్నారు. అన్ని ఫుటేజీలను పరిశీలిస్తున్నామని దాడికి పాల్పడిన వారిని అందరినీ గుర్తించి అరెస్టు చేస్తామన్నారు.