Atchannaidu: దుర్మార్గుడి దండయాత్రను అడ్డుకోండి
ABN , Publish Date - Jul 08 , 2025 | 03:46 AM
రైతుయాత్ర పేరుతో జగన్ అనే దుర్మార్గుడు చేసే దండయాత్రను రైతులు అడ్డుకోవాలని వ్యవసాయ మంత్రి కె.అచ్చెన్నాయుడు పిలుపిచ్చారు. ఐదేళ్ల పాలనలో ఆయన రైతుల కోసం ఏం చేశాడో నిలదీయాలన్నారు.

రైతులకు ఏంచేశాడో నిలదీయండి
ఆయన కాలు పెడితే విధ్వంసమే
యాత్రల పేరిట శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే ఊరుకోం: అచ్చెన్న
న్యూఢిల్లీ, జూలై 7(ఆంధ్రజ్యోతి): రైతుయాత్ర పేరుతో జగన్ అనే దుర్మార్గుడు చేసే దండయాత్రను రైతులు అడ్డుకోవాలని వ్యవసాయ మంత్రి కె.అచ్చెన్నాయుడు పిలుపిచ్చారు. ఐదేళ్ల పాలనలో ఆయన రైతుల కోసం ఏం చేశాడో నిలదీయాలన్నారు. ఐదేళ్ల పాలనలో విధ్వంసానికి గురైన వ్యవసాయ రంగాన్ని గాడిలో పెట్టేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని, ఇప్పుడిప్పుడే రైతులు సంతోషంగా ఉంటున్నారని, వాళ్లను మళ్లీ అగాధంలోకి నెట్టాలని జగన్ చూస్తున్నారని మండిపడ్డారు. ఆయన ఎక్కడ కాలు పెట్టినా అక్కడంతా సర్వనాశనమేనని చెప్పారు. సోమవారం ఢిల్లీలోని ఏపీ భవన్ లో శ్రీకాకుళం ఎమ్మెల్యే జి.శంకర్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారన్నారు. యాత్రల పేరుతో కారు టైర్ల కింద హత్యలు జరుగుతుంటే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. వ్యక్తి చనిపోయిన ఏడాది తర్వాత పరామర్శలు, 80 శాతం పంటలు కొనేసిన తర్వాత రైతు యాత్రలు చేయడం జగన్కు మాత్రమే చెల్లుతుందని ఎద్దేవా చేశారు. తోతాపురి మామిడి ధరపై జగన్ నీచ రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆయన పాలనలో ఆ మామిడి ధర కిలో రూ.6 నుంచి రూ. 4కు పడిపోయిందని, ఒక్క రూపాయి కూడా సబ్సిడీ ఇవ్వలేదన్నారు. కానీ కూటమి ప్రభుత్వం కిలోకు రూ.12 ధరను నిర్ణయించిందని, అందులో రూ.8 ప్రాసెసర్లు/వ్యాపారులు భరించాలని, అదనపు మద్దతు ధరగా ప్రభుత్వం రూ.4 చెల్లిస్తోందని తెలిపారు. దీనికి సంబంధించి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్(ఎమ్ఐఎస్) కింద రూ.130 కోట్ల కేంద్ర వాటాను విడుదల చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. మామిడి రైతుల దగ్గర 3.5 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించామన్నారు.