Suryapet Abortion Case: ఆడపిల్ల వద్దనుకొని అబార్షన్
ABN , Publish Date - May 22 , 2025 | 05:14 AM
సూర్యాపేటలో ఒక మహిళకు అనుమతుల్లేని ఆస్పత్రిలో అబార్షన్ చేయించడంతో తీవ్ర రక్తస్రావం సంభవించి ఆమె మృతి చెందింది. కుటుంబ సభ్యులు వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

వైద్యం వికటించి గర్భిణి మృతి
సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఘటన
సూర్యాపేట క్రైం, మే 21 (ఆంధ్రజ్యోతి): అప్పటికే ఆమెకు ఇద్దరు ఆడపిల్లలు ఉండటం, మూడో సంతానంగా ఆడబిడ్డే పుట్టనుందని తెలుసుకొని.. ఆబార్షన్కు ప్రయత్నించడం ఆమె ప్రాణాలను బలిగొంది. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఈ ఘటన వెలుగుచూసింది. మృతురాలి కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా మోతె మండలం రాఘవపురానికి చెందిన బయ్య నగేశ్-అనూష(25) దంపతులకు నాలుగు, రెండేళ్ల వయసున్న ఇద్దరు ఆడపిల్లలున్నారు. అనూష మరోసారి గర్భం దాల్చింది. పుట్టబోయేది ఆడబిడ్డా.. మగబిడ్డా అనేది తెలుసుకునేందుకు సూర్యాపేట మండలం టేకుమట్లకు చెందిన ఆర్ఎంపీని సంప్రదించారు. ఆ ఆర్ఎంపీ అనూషను నకిరేకల్లోని ఓ సెంటర్కు తీసుకువెళ్లి స్కానింగ్ తీయించగా, పుట్టబోయేది ఆడపిల్ల అని నిర్ధారణ అయింది. తీవ్ర నిరాశకు లోనైన అనూష కుటుంబసభ్యులు, పోషణ భారం అవుతుందని భావించి.. ఆమెకు అబార్షన్ చేయించాలని నిర్ణయించారు. రెండు రోజులకు మళ్లీ అదే ఆర్ఎంపీని సంప్రదించారు. అబార్షన్కు, మందులకు కలిపి రూ.35వేలు ఖర్చు అవుతుందని సదరు ఆర్ఎంపీ చెప్పగా, అందుకు అనూష భర్త నగేశ్ అంగీకరించాడు. తర్వాత అనూషను సూర్యాపేటలోని రామలింగేశ్వర థియేటర్ సమీపంలోని ఓజో ఆస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడ అనూషకు అబార్షన్ చేయడానికి వైద్యులు యత్నించగా, వైద్యం వికటించి తీవ్ర రక్తస్రావమైంది. అనూష పరిస్థితి విషమించడంతో ఆస్పత్రి యాజమాన్యం మెరుగైన చికిత్స కోసం అంబులెన్స్లో ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించింది. అక్కడ చికిత్స పొందుతూ అనూష ఈ నెల 18న మృతి చెందింది. అదేరోజు రాఘవాపురంలో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. స్థానికుల ద్వారా విషయం వెలుగుచూసింది. ఈ ఘటనతో అబార్షన్ చేయించిన ఓజో ఆస్పత్రి యాజమాన్యం ఆస్పత్రిని మూసివేసి పరారైనట్లు సమాచారం. కాగా తన భార్య మృతికి కారణమైన వారి పట్ల చర్యలు తీసుకోవాలని అనూష భర్త నగేశ్ డిమాండ్ చేశాడు.
అనుమతుల్లేని ఆస్పత్రిలో అబార్షన్ చేశారు
సూర్యాపేటలో ఓజో ఆస్పత్రికి అనుమతుల్లేవు. ఆ ఆస్పత్రిలోనే అనూషకు నిబంధనలకు విరుద్ధంగా అబార్షన్ చేశారు. గతంలో నిబంధనలు ఉల్లంఘించినందుకు ఇదే ఆస్పత్రి యాజమాన్యంపై కేసు నమోదుచేసి ఆస్పత్రిని సీజ్ చేశాం. అయితే ఆస్పత్రి పేరు మార్చి వైద్య సేవలందిస్తున్న విషయం మా దృష్టికి రాలేదు. అనూష మృతి విషయంలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.
- డాక్టర్ కోటా చలం, డీఎంహెచ్వో, సూర్యాపేట