Miss World 2025: అందంగా.. ఆటవిడుపు!
ABN , Publish Date - May 18 , 2025 | 04:23 AM
ప్రపంచ సుందరి పోటీల్లో భాగంగా శనివారం నిర్వహించిన స్పోర్ట్స్ డే కార్యక్రమంలో అందాల భామలు తమ క్రీడా నైపుణ్యాలతో అదరగొట్టారు. ర్యాంప్ వాక్పై మాత్రమే కాదు మైదానంలోనూ మెరిసిపోగలమని నిరూపించారు.

గచ్చిబౌలి స్టేడియంలో సందడిగా మిస్ వరల్డ్ స్పోర్ట్స్ డే
స్ప్రింట్ , షాట్పుట్, బ్యాడ్మింటన్, ఫిట్నెస్ రన్, చెస్ పోటీలు.. మిస్ ఎస్టోనియా ఎలిస్ రాండ్మాకు స్వర్ణం
రామోజీ ఫిలింసిటీ సందర్శన.. బాహుబలి కుర్చీలో సెల్ఫీలు.. నేడు సచివాలయానికి అందాల భామలు
హైదరాబాద్ క్రీడాప్రతినిధి/హైదరాబాద్, మే 17 (ఆంధ్రజ్యోతి): ప్రపంచ సుందరి పోటీల్లో భాగంగా శనివారం నిర్వహించిన స్పోర్ట్స్ డే కార్యక్రమంలో అందాల భామలు తమ క్రీడా నైపుణ్యాలతో అదరగొట్టారు. ర్యాంప్ వాక్పై మాత్రమే కాదు మైదానంలోనూ మెరిసిపోగలమని నిరూపించారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో మిస్ వరల్డ్ దివిటీ వెలిగించి పోటీలను ప్రారంభించారు. 25 మీటర్ల స్ర్పింట్, షాట్పుట్, బ్యాడ్మింటన్, ఫిట్నెస్ రన్, చెస్, జుంబా పోటీలతో కూడిన ఈ స్పోర్ట్స్ చాలెంజ్లో మిస్ ఎస్టోనియా ఎలిస్ రాండ్మా స్వర్ణ పతకం గెలిచి.. మిస్ వరల్డ్ స్పోర్ట్స్ ఉమన్ టైటిల్ దక్కించుకున్నారు. మిస్ మార్టినిక్ ఆరేలి జోచిమ్కు రజతం, మిస్ కెనడా ఎమ్మా మారిసన్కు కాంస్య పతకం లభించాయి. క్రీడా పోటీల ప్రారంభానికి ముందు మల్లఖంబ్ క్రీడాకారులు రిషభ్, సాన్వి అద్భుత విన్యాసాలు, జిమ్నాస్టులు నిషిక అగర్వాల్, సురభి ప్రసన్న ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్ ప్రదర్శన అలరించింది. అర్జున అవార్డు గ్రహీత అర్జున్ బృందం నిర్వహించిన స్కేటింగ్ ప్రదర్శన ఆకట్టుకుంది. గురు దత్తాత్రేయ బృందం నిర్వహించిన యోగాసనాలు, మణిపూరి మార్షల్ ఆర్ట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చెస్లో అండర్-8 వరల్డ్ చాంపియన్ ఎ.దివిత్రెడ్డి ఒకేసారి నలుగురు మిస్ వరల్డ్ పోటీదారులతో ఆడి ఓడించాడు. గాదె శరణ్య కళ్లకు గంతలు కట్టుకుని మిస్ కెనడాతో చెస్ ఆడి గెలవడం విశేషం. కాగా, మహిళలు క్రీడల్లోనూ పురుషులకు దీటుగా రాణిస్తున్నారని మంత్రి జూపల్లి పేర్కొన్నారు. తెలంగాణ బ్రాండ్ను ప్రపంచ స్థాయిలో ఇనుమడింప జేసేలా ప్రపంచ సుందరి పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మిస్ వరల్డ్ పోటీల్లో క్రీడలను భాగం చేయడం విభిన్నమైన ఆలోచన అని, ఈ కార్యక్రమంతో ప్రజల్లో ఫిట్నె్సపై అవగాహన పెరుగుతుందని బీసీసీఐ ఉపాధ్యక్షుడురాజీవ్శుక్లా అన్నారు.
బాహుబలి కుర్చీలో సుందరీమణులు
ప్రపంచ సుందరి పోటీదారులు శనివారం రామోజీ ఫిలింసిటీని సందర్శించారు. బాహుబలి సినిమా సెట్టింగ్, మూవీ మొఘల్ గార్డెన్లో కలియదిరిగారు. కొందరు అందాల భామలు బాహుబలి కుర్చీలో కూర్చొని, భల్లాలదేవ తల భాగం, బాణాల వాహనం సెట్ల వద్ద ఫొటోలు, సెల్ఫీలు తీసుకున్నారు. అయితే ఈ కార్యక్రమం వద్ద పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి, మీడియా ప్రతినిధులను అడ్డుకున్నారు. సమాచార శాఖ అధికారులు ఇచ్చిన పాసులు ఉన్నా, సమాచార శాఖ జాయింట్ డైరెక్టర్ చెప్పినా పట్టించుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
నేడు సచివాలయానికి
ప్రపంచ సుందరి పోటీలో ఉన్న అందాల భామలు.. ఆదివారం సాయంత్రం తెలంగాణ సచివాలయాన్ని సందర్శించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అధికారులు వారికి వివరించనున్నారు. సచివాలయం ప్రాంగణంలో ఫొటోలు దిగనున్నారు. ఈ నేపథ్యంలో సచివాలయం, పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేయనున్నట్టు ప్రకటించారు.
అందమే కాదు.. ఆదర్శం కూడా..
అందం అంటే శారీరకమే కాదు.. స్పందించే హృదయం, తోటివారికి సహాయపడాలనే మంచి మనసు కూడా. ప్రపంచ సుందరి పోటీల్లో ముఖ్యమైన అంశమూ ఇదే.. ‘బ్యూటీ విత్ ఏ పర్పస్’. ఈ పోటీల్లో పాల్గొంటున్న కొందరు సుందరీమణులు సమాజ అభ్యున్నతి కోసం చేస్తున్న కృషిని, తాము ఎంచుకున్న ప్రాజెక్టుల వెనుక ఉద్దేశం ఏమిటన్నది వివరించారు.
దివ్యాంగులను చూసే తీరులో మార్పు కోసం..
దేశంలో సుమారు మూడు కోట్ల మంది దివ్యాంగులు ఉన్నారని అంచనా. దివ్యాంగులను జాలిగా చూస్తారే తప్ప.. వారిని గౌరవించడమనేది మన సమాజంలో కాస్త తక్కువే. మా అంకుల్కు ఉన్న వైకల్యం, ఆయన ఇబ్బందులు చూస్తూ పెరిగా. వారికోసం ఏదైనా చేయాలన్న తపనతో ప్రాజెక్ట్ ఏక్తాను ప్రారంభించా. స్కూళ్లు, కాలేజీలు, వర్సిటీల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను.
- నందిని గుప్తా, విస్ వరల్డ్ ఇండియా
కిడ్నీ వ్యాధులపై అవగాహన కోసం..
బెలీజ్ దేశంలో కిడ్నీ వ్యాధుల సమస్య బాగా పెరిగిపోయింది. అక్కడివారిలో 13.7 శాతం మంది ఈ వ్యాధులతో బాధపడుతున్నారు. అందుకే కిడ్నీ వ్యాధులపై అవగాహన కల్పించి... ఆ సమస్య బారినపడకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. అందరూ కలిసికట్టుగా పనిచేస్తే ఈ సమస్యను రూపుమాపగలం.
- మిస్ వరల్డ్ బెలిజ్, షాయరీ మోరాతాయా
గృహ హింసకు వ్యతిరేకంగా పోరాటం..
ఆస్ట్రేలియా అవకాశాల గని. కానీ మహిళలపై వేధింపులు కూడా అంతే స్థాయిలో ఉన్నాయి. గత 14 నెలల్లో అక్కడ 120 మందికిపైగా మహిళలు, చిన్నారులు కుటుంబంలో గొడవలతో హత్యకు గురయ్యారు. గత సంవత్సరం మూడు లక్షలకుపైగా గృహహింస కేసులు నమోదయ్యాయి. దీనిపై పోరాటం చేపట్టా. తారా బ్రౌన్ ఫౌండేషన్ ప్రారంభించి.. గృహ హింసకు వ్యతిరేకంగా అవగాహన కల్పిస్తున్నాను. చిన్నారుల కోసం ఈ అంశంపై ఒక పుస్తకం కూడా రాశాను.
- మిస్ వరల్డ్ ఆస్ట్రేలియా, జాస్మిన్ స్ర్టింగర్
విద్యతో సాధికారిత సాధించేందుకు..
ఆధునిక ప్రపంచంలో అన్నీ ఉన్నా.. ఎంతోమంది ప్రాథమిక హక్కులకు కూడా దూరమైపోతున్నారు. విద్యతోనే ఈ సమాజాన్ని మార్చగలం. టీచింగ్ అంటే నాకు ఎంతో ఇష్టం. టీచర్గా సేవలు అందిస్తున్నాను. పెస్కార్ ప్రాజెక్ట్ ద్వారా నిరుపేదల అభ్యున్నతికి, ఉన్నత విద్య అందించేందుకు కృషి చేస్తున్నాను.
- మిస్ వరల్డ్ బ్రెజిల్, జెస్సికా పెడ్రోసో
మహిళా సాధికారిత కోసం..
మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్నాను. ప్రకటనల రంగంలో పనిచేస్తూ ఎందరో మహిళా ఔత్సాహిక వ్యాపార వేత్తలను కలుసుకున్నాను. వారికి డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మద్దతు అందించాలని నిర్ణయించుకుని.. ప్రాజెక్ట్ ఎల్లాస్ క్రెసిన్ ప్రారంభించాను. మా దేశంలో 60 శాతం చిన్న, సూక్ష్మ వ్యాపారాలను మహిళలే నిర్వహిస్తున్నారు. వారు అభివృద్ధి చెందడానికి తోడ్పడుతుండటం సంతోషంగా ఉంది.
- మిస్ వరల్డ్ ఎల్ సాల్వాడర్, సోఫియా ఎస్టెపినియన్
ఇవి కూడా చదవండి
Operation Sindoor: సోషల్ మీడియాలో పాక్ తప్పుడు ప్రచారం.. వాస్తవాలు బయటపెట్టిన PIB
PIB Fact Check: 3 రోజుల పాటు ATMలు బంద్.. వైరల్ పోస్టుపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్..
Read Latest Telangana News And Telugu News