Konda Surekha: అన్ని గ్రామాల్లో హనుమాన్ ఆలయాల నిర్మాణం
ABN , Publish Date - Jul 15 , 2025 | 03:58 AM
కామన్ గుడ్ ఫండ్ (సీజీఎఫ్) పథకం నిధులతో రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో హనుమాన్ ఆలయాల నిర్మాణాన్ని చేపట్టామని, అలాగే కాలనీల్లో కుల దేవతల ఆలయాలను కూడా దశల వారీగా అభివృద్ధి చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు.

కాలనీల్లో కులదేవతల గుడులూ అభివృద్ధి: సురేఖ
పరిగి, జూలై 14 (ఆంధ్రజ్యోతి): కామన్ గుడ్ ఫండ్ (సీజీఎఫ్) పథకం నిధులతో రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో హనుమాన్ ఆలయాల నిర్మాణాన్ని చేపట్టామని, అలాగే కాలనీల్లో కుల దేవతల ఆలయాలను కూడా దశల వారీగా అభివృద్ధి చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. వికారాబాద్ జిల్లా పరిగి, కులకచర్లలో సోమవారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. వనమహోత్సవం కింద మొక్కలను నాటారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆలయాల అభివద్ధిని పూర్తిగా విస్మరించిందని, పదేళ్లలో ఒక్క యాదగిరిగుట్ట నిర్మాణం తప్ప రాష్ట్రంలో ఎక్కడా ఆలయాల గురించి పట్టించుకోలేదని విమర్శించారు. జీవోలు జారీ చేసి నిధులు కేటాయించలేదని అన్నారు. సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత యాదగిరిగుట్టతో పాటు రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది వనమహోత్సవంలో భాగంగా 18 కోట్ల మొక్కలు నాటాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లు తెలిపారు.