Homemade Spicy Powders: వానొచ్చే వేళ కారంగా.. ఘాటుగా
ABN , Publish Date - Jun 07 , 2025 | 02:03 AM
వర్షాకాలం వచ్చేసింది. ఈ కాలంలో కారంగా, ఘాటుగా ఉండే పచ్చడి లేదంటే పొడిని వేడి వేడి అన్నంలో వేసుకుని నెయ్యి కలుపుకుని తింటే... ఆహా... ఆ రుచే వేరు. అలాంటి ఆరోగ్యకరమైన కమ్మని రుచులు మీ కోసం...

వర్షాకాలం వచ్చేసింది. ఈ కాలంలో కారంగా, ఘాటుగా ఉండే పచ్చడి లేదంటే పొడిని వేడి వేడి అన్నంలో వేసుకుని నెయ్యి కలుపుకుని తింటే... ఆహా... ఆ రుచే వేరు. అలాంటి ఆరోగ్యకరమైన కమ్మని రుచులు మీ కోసం...
శొంఠి పొడి
కావాల్సిన పదార్థాలు
నెయ్యి- ఒక చెంచా, శొంఠి- 50 గ్రాములు, జీలకర్ర- రెండు చెంచాలు, ఎండు మిర్చి- రెండు, ఉప్పు- తగినంత
తయారీ విధానం
స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టి నెయ్యి వేసి వేడిచేయాలి. ఇందులో శొంఠి ముక్కలు వేసి కలుపుతూ చిన్న మంట మీద దోరగా వేపాలి. అయిదు నిమిషాల తరవాత శొంఠి ముక్కలు లోపలిదాకా వేగి కొద్దిగా ఉబ్బుతాయి. మంచి వాసన కూడా వస్తుంది. ఇప్పుడు జీలకర్ర, ఎండుమిర్చి ముక్కలు కూడా వేసి మరో రెండు నిమిషాలు వేపాలి. తరవాత స్టవ్ మీద నుంచి దించి ఈ మిశ్రమాన్ని రోట్లో వేసి కచ్చాపచ్చాగా దంచాలి. తరవాత శొంఠి ముక్కలను చేత్తో మరింత చిన్న ముక్కలుగా తుంచి తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేయాలి. ఇలా తయారు చేసిన శొంఠి పొడి ఆరు నెలలు నిల్వ ఉంటుంది.
జాగ్రత్తలు
శొంఠిని పెద్ద మంట మీద వేపకూడదు. సన్నని సెగ మీద నిదానంగా వేయించాలి.
ఎండు మిర్చికి బదులు ముప్పావు చెంచా మిరియాల పొడి కలుపుకోవచ్చు.
ఈ పొడితో రోజుకు ఒక్క ముద్ద మాత్రమే తినాలి. ఎక్కువగా తింటే విరేచనాలు అవుతాయి.
ప్రయోజనాలు
ఈ శొంఠి పొడిని ఆర్నెల్ల పసి పిల్లల నుంచి అరవై ఏళ్లు పైబడిన పెద్దవారి వరకూ ఎవరైనా తినవచ్చు.
ఇది పొట్టను పూర్తిగా శుభ్రం చేస్తుంది. రోజూ ఈ పొడితో ఒక్క ముద్ద తింటే చాలు అజీర్తి తొలగి ఆకలి పెరుగుతుంది. వర్షాకాలంలో చలిగాలుల వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గకుండా స్థిరంగా ఉంటుంది. ఊబకాయం తగ్గుతుంది. తరచూ వాతంతో ఇబ్బంది పడే పిల్లలకు మంచి ఔషధంలా పనిచేస్తుంది. మజ్జిగ లేదా మజ్జిగ చారులో చిటికెడు శొంఠి పొడి కలుపుకుని తాగితే జీర్ణాశయ సమస్యలన్నీ మాయమవుతాయి.
వాము కారం
కావాల్సిన పదార్థాలు
వాము- పావు కప్పు, మినప గుండ్లు- రెండు చెంచాలు, ధనియాలు- రెండు చెంచాలు, జీలకర్ర- ఒక చెంచా, మిరియాలు- అర చెంచా, నూనె- ఒక చెంచా, ఎండు మిర్చి- అయిదు, కరివేపాకు- రెండు రెమ్మలు, చింతపండు- రెండు రెమ్మలు, వెల్లుల్లి- రెండు రెబ్బలు, ఉప్పు- అర చెంచా
తయారీ విధానం
స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టి వేడి చేయాలి. ఇందులో వాము, మినపగుండ్లు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు వేసి విడివిడిగా వేయించుకోవాలి. ఇవి దోరగా వేగిన తరవాత ఒక పళ్లెంలోకి తీసుకోవాలి. తరవాత గిన్నెలో నూనె వేసి వేడి చేయాలి. ఇందులో ఎండు మిర్చి, కరివేపాకు, వెల్లుల్లి వేసి తేమ పోయే వరకూ వేయించి పళ్లెంలోకి తీసి చల్లార్చాలి.
మిక్సీలో ముందుగా ఎండుమిర్చి, కరివేపాకు, చింతపండు, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. తరవాత ఇందులో వాము, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, మినపగుండ్ల మిశ్రమంతోపాటు ఉప్పు వేసి మరోసారి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇలా తయారుచేసిన వాము కారాన్ని బాగా కలిపి గాజు సీసాలో భద్రపరిస్తే నెల రోజులు నిల్వ ఉంటుంది.
జాగ్రత్తలు
ఒక్కోసారి వాములో ఇసుక రేణువులు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా శుభ్రం చేసుకోవాలి.
వాముని చిన్న సెగమీద దోరగా వేపాలి. ఇది నల్లగా మారితే వాముకారం చేదుగా ఉంటుంది.
వెల్లుల్లి తప్పనిసరి కాదు.
ప్రయోజనాలు
భోజనానికి ముందు ఈ వాము కారంతో రెండు ముద్దలు తింటే వర్షాకాలంలో వచ్చే ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. ముఖ్యంగా జలుబు, దగ్గు, ముక్కు దిబ్బడ, అజీర్తి, కడుపులో మంట, కడుపు ఉబ్బరం లాంటి సమస్యలు తగ్గిపోతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తలనొప్పితో బాధపడేవారికి, కడుపులో నులి పురుగులతో ఇబ్బంది పడే పిల్లలకు ఈ పొడి ఔషధంలా పనిచేస్తుంది.
వెల్లుల్లి పచ్చడి
కావాల్సిన పదార్థాలు
వెల్లుల్లి రెబ్బలు- 40, జీలకర్ర- రెండు చెంచాలు, ఉప్పు- ఒక చెంచా, కారం- నాలుగు చెంచాలు, నూనె- మూడు చెంచాలు, ఆవాలు- అర చెంచా, కరివేపాకు- రెండు రెమ్మలు, పసుపు- చిటికెడు, ఎండు మిర్చి- రెండు
తయారీ విధానం
వెల్లుల్లి రెబ్బలకు రెండు చుక్కల నూనె పట్టించి కొద్దిసేపు ఎండలో పెట్టాలి. తరవాత ఒక పలుచని వస్త్రంలో మూటకట్టి అరచేతులతో నలిపితే పొట్టంతా ఊడి వచ్చేస్తుంది. వీటిని వెడల్పాటి పళ్లెం లేదా చాటలో పోసి చెరిగితే పొట్టు ఎగిరిపోయి వెల్లుల్లి పాయలు మిగులుతాయి. వీటిని పళ్లెంలోకి తీసుకోవాలి. వెల్లుల్లిని కొద్దిగా నూనెలో వేయిస్తే పచ్చి వాసన పోతుంది.
మిక్సీలో వెల్లుల్లి రెబ్బలు, రెండు రెమ్మల చింతపండు, ఒక చెంచా జీలకర్ర, ఉప్పు, కారం వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని గిన్నెలోకి తీసుకోవాలి.
స్టవ్ మీద గిన్నె పెట్టి నూనె వేసి వేడిచేయాలి. ఇందులో ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి ముక్కలు, కరివేపాకు, పసుపు వేసి వేపాలి. ఈ తాలింపుని వెల్లుల్లి మిశ్రమంలో వేసి బాగా కలపాలి. ఈ వెల్లుల్లి పచ్చడి ఒక వారం పాటు నిల్వ ఉంటుంది.
ప్రయోజనాలు
ఈ వెల్లుల్లి పచ్చడి కలుపుకుని ఒక ముద్ద అన్నం తింటే శరీరంలో చేరిన కఫం బయటికి వెళ్లిపోతుంది. వాతం తగ్గుతుంది. వర్షాకాలంలో నీటి కాలుష్యం వల్ల టైఫాయిడ్ సోకే ప్రమాదం తగ్గుతుంది. వాతావరణం చల్లబడడం వల్ల వచ్చే కీళ్ల నొప్పులు, ఎముకల వాపు, ఆస్తమా, మలబద్దకం, కొలెస్ట్రాల్, నరాల సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.