Samita Kaur: కాలుష్యంపై ఓ తల్లి పోరాటం
ABN , Publish Date - Jun 14 , 2025 | 06:17 AM
ఒకటి రెండూ కాదు... పాతికేళ్లు ఇల్లాలి పాత్ర పోషించాను. ఇందులో గొప్పదనమేమీ లేదు కానీ... అక్కడ నన్ను ఎవరూ ఒక మనిషిగా చూడలేదు. తెల్లారింది మొదలు... అర్ధరాత్రి వరకు గొడ్డు చాకిరీ. ఇంటి పనికి తోడు అనారోగ్యంతో మంచానపడ్డ అత్తమామలకు సేవలు.

ఒకప్పుడు గడప దాటి బయట కాలు పెట్టింది లేదు. ఇంటి పనులు... అత్తమామల సేవకు అంకితమైపోయింది ఆమె జీవితం. ఇవి చాలవన్నట్టు సూటిపోటి మాటలు... వేధింపులు. ఎన్నో ఏళ్లు తనలో తానే రోదించిన ఆమె... చివరకు భర్తను వదిలి నవ జీవన స్రవంతిలోకి అడుగు పెట్టారు. ఆ క్షణం నుంచీ తన జీవితాన్ని సామాజిక సేవకు అంకితం చేశారు. పంట చేతికి రాక అవస్థలు పడుతున్న రైతుకు అండగా... పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ఉద్యమిస్తున్న 51 ఏళ్ల సమితా కౌర్ కథ ఇది.
‘‘ఒకటి రెండూ కాదు... పాతికేళ్లు ఇల్లాలి పాత్ర పోషించాను. ఇందులో గొప్పదనమేమీ లేదు కానీ... అక్కడ నన్ను ఎవరూ ఒక మనిషిగా చూడలేదు. తెల్లారింది మొదలు... అర్ధరాత్రి వరకు గొడ్డు చాకిరీ. ఇంటి పనికి తోడు అనారోగ్యంతో మంచానపడ్డ అత్తమామలకు సేవలు. క్షణం తీరిక లేని జీవితం. చుట్టూ అందరూ ఉన్నా... నాకంటూ ఎవరూ లేని ఒంటరితనం. కనీసం తిన్నానా లేదా అని పట్టించుకొనేవారే కరువయ్యారు అక్కడ. భర్త ఉన్నా లేనట్టే. అందుకే ఒకరోజు కఠిన నిర్ణయం తీసుకున్నా. నా ఇద్దరు పిల్లలతో ఇంటిని, భర్తను వదిలి బయటకు వచ్చేశాను. కట్టుబాట్లు, సంప్రదాయాలు, పరువు, ప్రతిష్ఠలు... ఎవరేమన్నా పట్టించుకోలేదు. నా దృష్టిలో విడాకులను సంప్రదాయ విరుద్ధ ప్రక్రియగా చూడకూడదు. నాలాంటి వనితల కథలు వింటే అందులోనూ సానుకూల అంశాలు ఉన్నాయని అర్థమవుతుంది.
విడాకులు తీసుకున్నాకనే నా జీవితాన్ని నేను జీవించడానికి అవకాశం లభించింది. అంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకున్నావని నన్ను చాలామంది అడుగుతుంటారు. వారికి నేను చెప్పింది ఒక్కటే... ‘నా పిల్లలను నేను స్ఫూర్తి కావాలి. వాళ్లు విలువలకు కట్టుబడి ఉండాలి. కంటి ముందు జరిగే అఘాయిత్యాలు, అక్రమాలపై పోరాడాలి’ అని. అలానే వారిని పెంచాను. దురదృష్టం ఏంటంటే... తన పిల్లల భవిష్యత్తు కోసం వివాహ బంధాన్ని కొనసాగించాలని మహిళల మీద మాత్రమే ఈ సమాజం ఒత్తిడి తేవడం. ఆమె సమస్యలు, ఇబ్బందులు, వేధింపులు ఎవరికీ పట్టవు. అన్నిటినీ భరించాలి. కానీ మగవారి విషయంలో ఎవరూ ఎలాంటి సూచనలు, సలహాలు ఇవ్వరు. ఈ పరిస్థితి మారాలంటే మన పిల్లల్ని విలువలతో పెంచాలి. అదే నేను చేసింది. పంజాబ్ లుధియానా జిల్లా డోరహా పట్టణ ప్రాంతం మాది.
బయటకు వచ్చాక...
రెండున్న దశాబ్దాలు ఇంటికే పరిమితం అయిన నేను... కట్టు బట్టలతో బయటకు వచ్చాక సామాజిక అంశాలపై దృష్టి పెట్టాను. ప్రధానంగా కరోనా సమయంలో ఢిల్లీ శివార్లలో రైతుల నిరసన నన్ను ఆలోచింపజేసింది. దాంతో రైతు సమస్యలతో పాటు కోరలు చాచిన కాలుష్యంపై కూడా పోరాడాలని నిర్ణయించుకున్నాను. 2020లో ‘వియ్ సపోర్ట్ అవర్ ఫార్మర్స్’ ఫేస్బుక్ పేజీ నిర్వహిస్తున్న బృందాన్ని కలిశాను. చాలా విషయాలు తెలుసుకున్నాను. వ్యవసాయ సంక్షోభంపై పరిశోధించాను. నేను సేకరించిన అంశాలన్నీ ఒకచోట రాయడం రాసుకున్నాను. ఈ క్రమంలో నాకు అర్థమైంది ఏంటంటే... పర్యావరణ సమస్యలకు, వ్యవసాయానికి మధ్య సంబంధం ఉందని. మరి దానికి పరిష్కారం ఏంటి?
అడవులను రక్షించుకున్నాం...
నాలాగా ఆలోచించే ‘వారియర్ మామ్స్’ బృందాన్ని కలిశాను. వాయు కాలుష్యంపై వారు పోరాడుతున్నారు. ఆ బృందంలో నేనూ సభ్యురాలినయ్యాను. స్వచ్ఛందంగా కొన్ని కార్యక్రమాలు చేపట్టాను. ముఖ్యంగా ఫతేగఢ్ సాహిబ్ జిల్లాలోని దాడుమజ్రా గ్రామం వ్యర్థాలతో నిండిపోయింది. ఆ ప్రాంతానికి వెళ్లి స్థానికులకు అవగాహన కల్పించాను. అవి పేరుకుపోవడంవల్ల కలిగే ఆరోగ్య సమస్యలను వివరించాను. అలాగే టెక్స్టైల్ పార్కు ప్రాజెక్టు వల్ల విలువైన మత్తేవాడ అడవులు అంతరించిపోయే ప్రమాదం ఉందని గ్రహించి, పంజాబ్ అసెంబ్లీ స్పీకర్కు లేఖ రాశాను. ప్రతి ఎమ్మెల్యే దృష్టికీ సమస్య తీసుకువెళ్లాను. నా లేఖను స్పీకర్ విధాన సభలో చదివి వినిపించారు. అలా రాజకీయ నాయకులు, ప్రజలు, ప్రభుత్వ సహకారంతో అడవులను కాపాడుకోగలిగాం.
నీలి ఆకాశాన్ని చూడలేదు...
పంజాబ్ను పీడిస్తున్న అతిపెద్ద భూతం... వాయు కాలుష్యం. ఇక్కడ మేం నీలాకాశాన్ని చూడడం చాలా అరుదు. మా పైన ఎప్పుడూ పొగ కమ్మేసి ఉంటుంది. ఈ సమస్యతో పంజాబ్లోని ప్రతిఒక్కరూ బాధపడుతున్నారు. బాధాకరమైన విషయం ఏంటంటే... పర్యావరణ చట్టాలను ఉల్లంఘించి, దీనికి కారణమైన పరిశ్రమలపై సరైన చర్యలు తీసుకోకపోవడం. పైగా నెపాన్ని రైతుల మీదకు నెట్టడం. ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురుచూడకుండా... ఈ సమస్యలకు పరిష్కారం దిశగా అమృత్సర్లో తొలి అడుగు వేశాం. అక్కడే ఎందుకంటే... పంజాబ్లో అత్యంత కాలుష్య నగరం అది. వ్యర్థాల నిర్వహణను పటిష్టంగా అమలు చేయాలని నిర్ణయించాం. సంబంధిత అధికారులు, నాయకులను కలిసి పరిస్థితి తీవ్రతను వివరించాం. ప్లాస్టిక్ రహిత నగరంగా అమృత్సర్ను మార్చేందుకు కృషి చేస్తున్నాం. ప్రస్తుతం మా రాష్ట్రం పర్యావరణ పరంగా అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ఉంది. దీని నుంచి బయటపడేందుకు అన్ని శాఖలు, ప్రజలు, సంస్థలతో కలిసి పని చేస్తున్నాను. నా ఈ ప్రయాణంలో విజయం సాధిస్తానని నమ్ముతున్నాను.’’
భయపడితే సాధించలేం...
నా భర్త నుంచి విడిపోయాక నా ముందు ఎన్నో ప్రశ్నలు, సవాళ్లు. కానీ అన్నిటినీ నేను సానుకూల దృక్పథంతోనే తీసుకున్నాను. అదే నన్ను ఇక్కడివరకు నడిపించింది. జీవితంలో అత్యంత దుర్భర పరిస్థితులు చూసినవారు... దేనికీ భయపడరు. ఆందోళన చెందరు. రేపటిని తలుచుకొని భయపడితే ఏదీ సాధించలేం. ప్రతి మహిళా ఇది గ్రహించాలి. కుటుంబం ఆమెకు అండగా నిలవాలి. క్లిష్ట సమయంలో నా పిల్లలు, నా తల్లిదండ్రులు, స్నేహితులు అండగా నిలవడంవల్లే నేను ధైర్యంగా నిలబడగలిగాను.