Best Fruits for Diabetic Patients: ఈ పండ్లు తినవచ్చు
ABN , Publish Date - Nov 12 , 2025 | 05:58 AM
మధుమేహం ఉన్నవారు పండ్లు తినకూడదని చాలామంది చెబుతుంటారు. పండ్లలో సహజసిద్ధమైన చక్కెరలు ఉంటాయి కాబట్టి వాటిని తినడంవల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుందని భావిస్తుంటారు...
మధుమేహం ఉన్నవారు పండ్లు తినకూడదని చాలామంది చెబుతుంటారు. పండ్లలో సహజసిద్ధమైన చక్కెరలు ఉంటాయి కాబట్టి వాటిని తినడంవల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుందని భావిస్తుంటారు. చక్కెర వ్యాధి ఉన్నప్పటికీ గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే పండ్లు తినవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
నారింజ, బత్తాయి పండ్లను మధుమేహం ఉన్నవారు నిర్భయంగా తీసుకోవచ్చు. వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ 40 నుంచి 43 మధ్య మాత్రమే ఉంటుంది. వీటిలోని సి విటమిన్, ఫోలేట్, పొటాషియం, పీచు పదార్థాలు రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇవి నెమ్మదిగా జీర్ణమవుతాయి. రక్తంలో కలవడానికి అధిక సమయం తీసుకుంటాయి.
చక్కెర వ్యాధి ఉన్నవారికి చెర్రీ పండ్లు మంచి ఔషధమని చెప్పవచ్చు. వీటి గ్లైసెమిక్ ఇండెక్స్ 20 మాత్రమే. వీటిలో అధికంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం.. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచుతాయి. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
డయాబెటిక్ పేషెంట్లు.. స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ పండ్లను కూడా తినవచ్చు. వీటి గ్లైసెమిక్ ఇండెక్స్ 41. ఈ పండ్లలో అత్యధికంగా సి విటమిన్ ఉంటుంది. తరచూ బెర్రీలను తింటూ ఉంటే రక్తంలో చక్కెర చేరే ప్రక్రియ నెమ్మదిస్తుంది.
యాపిల్ పండులో ఉండే పీచుపదార్థాలు, పాలీ ఫినోల్స్.. కార్బోహైడ్రేట్ల శోషణను తగ్గిస్తాయి. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది. యాపిల్ పండులో చక్కెర ఫ్రక్టోస్ రూపంలో ఉంటుంది. ఇది అంత ప్రభావవంతమైంది కాదు. రోజూ యాపిల్ పండు తినడం వల్ల ఇన్సులిన్ నిరోధకత తగ్గుతుంది.
ఇవి కూడా చదవండి
ఢిల్లీ పేలుళ్లు.. నిధులు సమీకరణలో కీలకంగా మహిళా డాక్టర్
ఎన్డీయేదే విజయం.. 7 ఎగ్జిట్ సర్వేలు జోస్యం