Operation Sindoor: సైరన్ మోగిందా.. వెంటనే ఇలా చేస్తే మీరు సేఫ్..
ABN , Publish Date - May 09 , 2025 | 02:00 PM
ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడి.. భారతదేశం - పాకిస్థాన్ మధ్య యుద్ధానికి దారి తీసింది. పహల్గాం దాడికి పాక్ కేంద్రంగా పని చేస్తున్న ఉగ్రవాదులే కారణమని గుర్తించిన భారత్.. పాక్లోని ఉగ్ర స్థావరాలపై క్షిపణులతో విరుచుకుపడింది.

న్యూఢిల్లీ, మే 09: ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడి.. భారతదేశం - పాకిస్థాన్ మధ్య యుద్ధానికి దారి తీసింది. పహల్గాం దాడికి పాక్ కేంద్రంగా పని చేస్తున్న ఉగ్రవాదులే కారణమని గుర్తించిన భారత్.. పాక్లోని ఉగ్ర స్థావరాలపై క్షిపణులను విరుచుకుపడింది. పాక్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్ర స్థావరాలపై దాడి చేసింది. ఈ ఘటనలో దాదాపు 100 మందికిపైగా ఉగ్రవాదులు హతమైనట్లు వార్తలు వచ్చాయి. అయితే, భారత్ దాడితో రెచ్చిపోయిన పాక్.. తిరిగి అటాక్ చేసింది. భారత్లోని 15 నగరాలు టార్గెట్గా క్షిపణులను ప్రయోగించింది. ఇండియన్ ఆర్మీ అప్రమత్తంగా ఉండి.. ఆ క్షిపణులన్నింటినీ గాల్లోనే పేల్చేసింది. మూడు ఫైటర్ జెట్లను కూడా కూల్చివేసింది. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. భారత్ కూడా ప్రతిదాడులకు పాల్పడింది. ఇలా ఇరు దేశాలు క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతున్నాయి.
ఇదిలాఉంటే.. శత్రు దేశం వైమానిక దాడులు జరిగితే ఎలా స్పందించాలి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై భారత ప్రభుత్వ ప్రజలకు అవగాహన కల్పించింది. అనేక రాష్ట్రాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించింది. వైమానిక దాడుల సమయంలో సురక్షితంగా ఉండటానికి ఏం చేయాలనే వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
క్షిపణి దాడి సమయంలో వైమానిక దళం ఏం చేస్తుంది..
ఏదైనా శత్రు దేశం రాకెట్, క్షిపణి, యుద్ధ విమానం భారత గగనతలంలోకి చొచ్చుకొస్తే.. భారత వైమానిక దళం రాడార్ వ్యవస్థలు వెంటనే గుర్తిస్తాయి. రియల్ టైమ్ సెక్యూరిటీ ప్రొటక్షన్ వింగ్స్ వెంటనే చర్యలు తీసుకుంటుంది. ముప్పును గుర్తించిన తరువాత క్షిపణి గమనం, వేగం విశ్లేషిస్తుంది. లక్ష్యాన్ని మ్యాప్ చేస్తుంది. శత్రువులు దాడి చేస్తారని గుర్తించిన కొంత సమయానికి ముందే పౌరులను అప్రమత్తం చేస్తూ సైరన్ మోగిస్తారు. అదే సమయంలో వైమానిక దళం ఉపరితలం నుంచి గగనతలానికి క్షిపణులు, ఇతర రక్షణ వ్యవస్థలను ఉపయోగించి వచ్చే ముప్పును అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుంది.
సైరన్ ఎందుకు మోగుతుంది.. ఎప్పుడు మోగుతుంది..
వైమానిక దాడి, క్షిపణి దాడి వంటి పెద్ద ముప్పు సంభవించబోతున్నప్పుడు భద్రతా దళాలు సైరన్ మోగిస్తారు. ఎయిర్ సైరన్ మోగిన వెంటనే రద్దీగా ఉండే ప్రదేశాల నుంచి సబ్వే, అండర్ పాస్లో గానీ ఆశ్రయం పొందాలి. పెద్ద నగరాల్లో నిర్మించిన అండర్పాస్లు వైమానిక దాడుల నుంచి రక్షించడంలో చాలా ప్రభావంతంగా ఉంటాయి. బస్సులు, ట్రక్కులు వంటి భారీ వాహనాలు సైతం వెళ్లేలా వీటిని నిర్మిస్తారు. ఈ కారణంగా రాకెట్లు, క్షిపణి దాడుల ప్రభావం తక్కువగా ఉంటుంది. వైమానిక దాడి జరిగినప్పుడు.. మీరు బహిరంగ ప్రదేశాల్లో ఉంటే ఏదైనా సబ్వే, అండర్ పాస్ కింద షెల్టర్ పొందాలి. మీరు ఇంట్లో ఉన్నట్లయితే.. సైరన్ మోగిన వెంటనే ప్రధాన ద్వారం నుంచి దూరంగా ఉండాలి. పలుచని గోడలు ఉన్న భవనంలో మీరు ఉన్నట్లయితే.. కిటికీలు ఉన్న చోట నిలబడటం ఉత్తమం. లేదంటే బలమైన గోడలతో నిర్మించిన ఇళ్లలో అయినా ఉండాలి. మెట్ల కింద ఉన్న ప్రాంతాలు సురక్షితమైనవి. వైమానిక దాడి సైరన్.. చాలా పెద్దగా వస్తుంది. ఈ సైరన్ 1 నుంచి 3 నిమిషాల పాటు హెచ్చుతగ్గులతో కూడిన శబ్ధం చేస్తుంది. ఈ సైరన్ వచ్చిన వెంటనే ప్రజలు సురక్షితమైన ప్రదేశానికి వెళ్లాలి. కంటిన్యూగా ఒకే విధమైన సైరన్ వచ్చినట్లయితే.. ప్రమాదం దాటిపోయిందని అర్థం. ఇప్పుడు ప్రజలు సురక్షితంగా బయటకు రావచ్చు.
వైమానిక దాడి సమయంలో ఎలా సురక్షితంగా ఉండాలి..
సైరన్ మోగిన వెంటనే సురక్షితమైన ప్రదేశానికి వెళ్లాలి.
ఇంట్లోని అన్ని ఎలక్ట్రానిక్, గ్యాస్ ఉపకరణాలను, విద్యుత్ సహా ఆపివేయాలి.
అన్ని కిటికీలు, తలుపులు మూసివేయాలి.
నేలపై పడుకుని మీ తలను చేతులతో కప్పేయాలి.
ఆహారం, నీరు, ప్రథమ చికిత్స సామాగ్రి సహా అత్యవసర కిట్ను సిద్ధంగా ఉంచుకోవాలి.
పుకార్లను పట్టించుకోకుండా ప్రభుత్వ మార్గదర్శకాలను మాత్రమే పాటించాలి.
Also Read:
ఈ కోతి పట్టుదల చూస్తే.. ఆశ్చర్యపోవాల్సిందే..
For More National News and Telugu News..