DK Shivakumar: కమల్ హాసన్ వ్యాఖ్యలను రాజకీయం చేయొద్దు: డీకే శివకుమార్
ABN , Publish Date - Jun 02 , 2025 | 06:12 PM
ప్రముఖ నటుడు కమల్ హాసన్ వ్యాఖ్యలను రాజకీయం చేయొద్దని కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. ఈ అంశానికి సంబంధించిన చరిత్ర తనకు తెలియనందున ఈ విషయంలో కామెంట్ చేయదలుచుకోలేదని చెప్పారు.

ఇంటర్నెట్ డెస్క్: కన్నడ భాషపై ప్రముఖ నటుడు కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అయితే, ఈ విషయమై తాను మాట్లాడదలుచుకోలేదని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పష్టం చేశారు. ఈ అంశానికి సంబంధించిన చరిత్ర తనకు తెలియదని అన్నారు. కర్ణాటక, తమిళనాడు మధ్య స్నేహపూర్వక సంబంధాలు ఉండాలని, ఈ విషయాన్ని రాజకీయం చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
‘దీన్ని మనం రాజకీయ అంశంగా మార్చొద్దు. మనం ఇరుగుపొరుగు వారము. శత్రువులం కాదు. అందరం కలిసిమెలిసి జీవించాలి. కర్ణాటక నీళ్లు తమిళనాడుకు వెళతాయి. అక్కడి వారు ఇక్కడకు వస్తుంటారు. నాకు ఈ అంశానికి సంబంధించి చరిత్ర గురించి తెలియదు. అందుకే, దీనిపై మాట్లాడదలుచుకోలేదు’ అని డీకే శివకుమార్ స్పష్టం చేశారు.
అంతకు మునుపు సీఎం సిద్దరామయ్య కమల్ హాసన్ను విమర్శించారు. ‘కన్నడ భాషకు సుదీర్ఘ చరిత్ర ఉంది. పాపం కమల్ హాసన్కు ఈ విషయం తెలియదు’ అని ఇటీవల ఓ సమావేశంలో అన్నారు.
తన తాజా చిత్రం థగ్ లైఫ్ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా బెంగళూరులో కమల్ హాసన్ మాట్లాడుతూ తమిళ భాష నుంచి కన్నడ వచ్చిందని అన్నారు. దీంతో, ఒక్కసారిగా వివాదం చెలరేగింది. వివిధ కన్నడ సంఘాలు నిరసనలకు తెరతీశాయి. కమల్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాయి. కన్నడ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ భగ్గుమన్నాయి. క్షమాపణలు చెప్పకపోతే సినిమాను బ్యాన్ చేస్తామని హెచ్చరించాయి.
కమల్ హాసన్ మాత్రం తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. తన తప్పు ఉంటే క్షమాపణలు చెప్పి ఉండే వాడినని అన్నారు. సినిమాపై నిషేధం హెచ్చరికల గురించి కూడా స్పందించారు. తనకు న్యాయం, చట్టంపై నమ్మకం ఉందని చెప్పారు. భారత్ ప్రజాస్వామిక దేశమని అన్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం కన్నడ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్.. థగ్ లైఫ్ సినిమా రాష్ట్రంలో విడుదల కాకుండా బ్యాన్ చేసింది.
ఇవీ చదవండి:
కేంద్రం హెచ్చరిక.. వెనక్కు తగ్గిన రైడ్ హెయిలింగ్ యాప్స్
పాక్కు గూఢచర్యం.. భారత యుద్ధ నౌకల వివరాలను చేరవేసిన ఇంజినీర్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి