Raja Raghuvanshi Case: నాకు డ్రగ్స్ ఇచ్చారు.. పోలీసుల విచారణలో సోనమ్..
ABN , Publish Date - Jun 10 , 2025 | 10:56 AM
Raja Raghuvanshi Case: ప్రియుడి కోసం సోనమ్ భర్తను హత్య చేయించిందని పోలీసులు అనుమానిస్తున్నారు. కానీ, ఆమె మాత్రం కొత్త కథ చెబుతోంది. తనను తాను బాధితురాలిగా చూపించుకునే ప్రయత్నం చేస్తోంది.

మధ్య ప్రదేశ్కు చెందిన రాజా రఘువంశీ మర్డర్ కేసులో అతడి భార్య సోనమ్ అరెస్ట్ అయింది. పోలీసులు ఆమెను విచారిస్తున్నారు. ప్రియుడి కోసం ఆమే భర్తను హత్య చేయించిందని పోలీసులు అనుమానిస్తున్నారు. కానీ, సోనమ్ మాత్రం కొత్త కథ చెబుతోంది. తనను తాను బాధితురాలిగా చూపించుకునే ప్రయత్నం చేస్తోంది. హత్యకు తనకు సంబంధం లేదని, తనకు డ్రగ్స్ ఇచ్చారని అంటోంది. డ్రగ్స్ మత్తులో ఉన్న తనను ఘాజీపూర్ తీసుకువచ్చారని చెబుతోంది. అయితే, పోలీసులు ఆమె మాటల్ని నమ్మటం లేదు.
సోనమ్ గురించి యూపీ అడిషినల్ డీజీ అమితాబ్ యశ్ మాట్లాడుతూ... ‘సోనమ్ తనను తాను బాధితురాలిగా చెప్పుకుంటోంది. ఆమెకు డ్రగ్స్ ఇచ్చి ఘాజీపూర్ తీసుకువచ్చారట. పోలీసులు పట్టుకుంటారని ఆమెకు తెలిసిపోయింది. ఆ భయంతో వెంటనే ఇంట్లో వాళ్లకు ఫోన్ చేసింది. ఎక్కడుందో చెప్పింది. సోమవారం తెల్లవారుజామున ఇంట్లో వాళ్లకు ఫోన్ చేసి ఘాజీపూర్ - వారణాసి రోడ్ దగ్గర ఉన్న డాబా దగ్గర ఉన్నానని చెప్పింది. ఆమె తల్లిదండ్రులు మధ్య ప్రదేశ్ పోలీసులకు ఫోన్ చేశారు.
మధ్య ప్రదేశ్ పోలీసులు ఇక్కడి పోలీసులకు ఫోన్ చేసి చెప్పారు. సోనమ్ అరెస్ట్ అయింది. సోనమ్ను మెడికల్ చెకప్ కోసం పంపాము. తర్వాత వన్ స్టాప్ సెంటర్కు తరలించాము. మేఘాలయ పోలీసులు ప్రస్తుతం ఆమెను విచారిస్తున్నారు. సోనమ్ సరిగా ప్లాన్ చేసుకోలేదు. పోలీసుల గురించి ఆమెకు సరిగా తెలీనట్లు ఉంది. తనను తాను బాధితురాలిగా చెప్పుకుంటే బయటపడొచ్చని అనుకుంది. కానీ, అలా జరగలేదు’ అని అన్నారు. ఇక, ఇదే కేసుకు సంబంధించి పోలీసులు నలుగురు యువకుల్ని అరెస్ట్ చేశారు. వారిలో సోనమ్ లవర్గా అనుమానిస్తున్న రాజ్ కుశ్వాహ కూడా ఉన్నాడు.
ఇవి కూడా చదవండి
ఇంత జరుగుతున్నా పాకిస్తాన్ బుద్ధి మారటం లేదు.
అమ్మాయని కూడా చూల్లేదు.. మరీ దారుణంగా..