Odisha: కిటికీ నుంచి కరెన్సీ వర్షం
ABN , Publish Date - May 31 , 2025 | 05:30 AM
ఒడిసా రాజధాని భువనేశ్వర్లోని ఓ అపార్ట్మెంట్ వద్ద శుక్రవారం కరెన్సీ వర్షం కురిసింది. ఒడిసా రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖలో చీఫ్ ఇంజనీర్గా పని చేస్తోన్న వైకుంఠనాథ్ సారంగి ఈ వర్షం కురిపించాడు.

విజిలెన్స్ దాడికి భయపడి
నోట్ల కట్టలు బయటకు విసిరేసిన ఒడిశా ఇంజనీర్
భువనేశ్వర్, మే 30 : ఒడిసా రాజధాని భువనేశ్వర్లోని ఓ అపార్ట్మెంట్ వద్ద శుక్రవారం కరెన్సీ వర్షం కురిసింది. ఒడిసా రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖలో చీఫ్ ఇంజనీర్గా పని చేస్తోన్న వైకుంఠనాథ్ సారంగి ఈ వర్షం కురిపించాడు. సోదాల నిమిత్తం తన ఇంటికి వచ్చిన విజిలెన్స్ అధికారులను చూసి కంగుతిన్న సారంగి.. తన దగ్గరున్న కొన్ని కరెన్సీ నోట్ల కట్టలను కిటికీలో నుంచి బయటికి విసిరేశాడు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై చీఫ్ ఇంజనీర్ వైకుంఠనాథ్ సారంగిపై విజిలెన్స్ అధికారులు శుక్రవారం దాడి చేశారు.
భువనేశ్వర్లో వైకుంఠనాథ్ నివాసముంటున్న ఫ్లాట్ సహా ఏడు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. తాను అక్రమంగా సంపాదించిన డబ్బు సంగతి బయటపడకూడదనే ఆలోచనతో సారంగి భువనేశ్వర్లోని తన ఇంటి కిటికీలో నుంచి కొన్ని రూ.500 నోట్ల కట్టలు బయటికి పారేశాడు. ఈ చర్యను గుర్తించిన అధికారులు ప్రత్యక్ష సాక్షుల సమక్షంలో ఆ నగదును స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా ఈ సోదాల్లో రూ.2.1 కోట్లు నగదును అధికారులు సీజ్ చేశారు. విజిలెన్స్ సిబ్బంది ఆ నగదును లెక్కిస్తున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి.