Writer Prasadamurthy Journey: తొలి సమీక్షలోనే దాడి
ABN , Publish Date - May 26 , 2025 | 05:23 AM
పద్యం రాయడం ప్రారంభించి, 17 సంవత్సరాల తరువాత మొదటి కవితా సంకలనం ‘కలనేత’ ప్రచురించిన ప్రసాదమూర్తి, ఎన్నో సవాళ్లు, విమర్శల మధ్య నిలబడిపోయారు. ఆయన దళిత బహుజన భావజాలంతో రచన చేసి, సాహిత్యంలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

17 సంవత్సరాలకు తొలి పద్యం రాసిన నేను 39 సంవత్సరాలకు తొలి పుస్తకాన్ని ప్రచురించాను. మధ్యలో బతుకు వంతెన కింద చాలా నీరే ప్రవహించింది. అసలు ఆ తొలి పుస్తకం తోనే ప్రసాదమూర్తి అనే కవి చచ్చిపోయి ఉండాలి. ఏం జరిగిందో చెప్తాను. పద్యంలో పుట్టి వచనంలో తేలి, కమ్యూనిజం నుంచి అంబేద్కరిజం దాకా ఈతలు కొడుతున్న రోజులవి. 1990 నుంచి పదేళ్ళ పాటు ఉద్యోగ రీత్యా బిహార్లో ఉన్నాను. ‘తాతకో నూలు పోగు’ అనే నా కవిత ఆంధ్రజ్యోతిలో వచ్చిన తర్వాత భావజాలాలకు అతీతంగా సాహిత్య లోకం నన్ను గుండెలకు హత్తుకుంది. కోదాడలో జరిగిన దళిత సాహిత్య సదస్సు నా మీద బలమైన ముద్ర వేసింది. అప్పటిదాకా రాసిన ఇతరేతర పద్యాలను, కవితలను పక్కనపెట్టి, దళిత బహుజన వస్తు కేంద్రంగా నేను రాసిన కవితలన్నీ ఒకచోట ఏర్చి కూర్చి నా మొదటి సంకలనం తీసుకురావాలని సంకల్పించాను. దీనికి లక్ష్మీనరసయ్య గొప్ప ముందుమాట రాయడమే కాకుండా, కొన్ని జనరల్ పోయెమ్స్ని కూడా జతచేసి కవితల ఎంపికలో నిర్ణాయకమైన పాత్ర వహించాడు. అలా 1999 జూన్లో నా తొలి కవితా సంపుటి ‘కలనేత’ హైదరాబాద్ తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో అట్టహాసంగా ఆవిష్కృతమైంది. ఎందరో పెద్దలు, కవి మిత్రులు పాల్గొన్నారు. ఆత్మీయ మిత్రుడు శంకర్ పుస్తకాన్ని డిజైన్ చేస్తే, తమ్ముడు అక్బర్ అర్థవంతమైన ముఖచిత్రాన్ని అందించాడు. శిఖామణి, ఖాజా, కుమార్ లాంటి ప్రియ మిత్రుల ప్రోత్సాహం మరువలేనిది. ఈ పుస్తకం చుట్టూ ఉన్న ఎన్నో తీపి జ్ఞాపకాల మధ్య, నన్ను ఇప్పటికీ వెంటాడే ఒక చేదు అనుభవాన్ని మీకు చెప్పాలి.
నా తొలి పుస్తకం మీద వచ్చిన తొలి రివ్యూ– ఎవరో మారుపేరుతో నా మీద చేసిన తొలి దాడి. వస్తువు మీద అతనికి అసలు పేచీ. ఆ ముసుగు తీయకుండా నా కవిత్వం మీద కత్తి దూశాడు. ఇక కవిత్వం లేదు, కన్నీరే మిగిలింది. ఆ ముసుగు వీరుడి మీద నా ఆత్మీయ తమ్ముడు నగేష్ బాబు 40 పేజీల వ్యాసంతో యుద్ధానికి సిద్ధమయ్యాడు. శ్రీశ్రీ ‘భిక్షువర్షీయసి’కీ నా ‘తాతకో నూలు పోగు’ కవితకీ మధ్య పోటీ పెట్టాడు. ఆకాశమంత అతని ప్రేమను ప్రేమ గానే పక్కన పెట్టాను. దాన్ని అతని ప్రేమ కానుకగా నా దగ్గరే దాచుకున్నాను. ఎవరు ఎన్ని చెప్పినా ఇక కవిత్వం జోలికి పోకూడదనుకున్నాను. అలాగే జరిగితే ‘‘ప్రసాదమూర్తి వస్తుతః కవి. అతను రాసినా కవే, రాయకపోయినా కవే’’ అని శివారెడ్డి లాంటి పెద్దల నుంచి ప్రశంసలు ఎలా పొందేవాడిని? కాలం నా పక్షాన నిలబడింది. ఆంధ్రజ్యోతి సాహిత్య పేజీలో థింసా గారు నా ‘కలనేత’ మీద రాసిన అద్భుత సమీక్షా వ్యాసం మెయిన్ ఆర్టికల్గా వచ్చింది. కొన ఊపిరితో ఉన్న నాలో కవికి ఆ వ్యాసం తిరిగి ప్రాణం పోసింది. అలా బతికిపోయాను. ఆ వ్యాసం తర్వాత సినారె లాంటి ఎందరెందరో పెద్దల నుండి, కవి మిత్రుల నుండి ఉత్తరాల వాన కురిసింది. ‘‘ప్రసాదమూర్తి భావజాలం నచ్చిన వారు సరేసరి, నచ్చని వారు కూడా అతని కవిత్వాన్ని ఎంజాయ్ చేస్తారు’’ అని లక్ష్మీనరసయ్య ఇచ్చిన స్టేట్మెంట్ నిజమైంది. ‘కలనేత’లో కవితలు కొన్ని చాలా సంకలనాలలో చోటు సంపాదించుకున్నాయి. నా పేరు ముందు ‘కలనేత’ విశేషణంగా వెలిగింది.
84998 66699