Share News

Nalimela Bhaskar: ఏ భాషనూ గుడ్డిగా వ్యతిరేకించవద్దు

ABN , Publish Date - May 26 , 2025 | 05:42 AM

నలిమెల భాస్కర్ పద్నాలుగు భారతీయ భాషలు నేర్చుకుని అనువాదాలు, రచనలు చేసి సాహిత్య, భాషా పరిరక్షణలో అగ్రనాయకుడిగా నిలిచారు. ఆయన తెలంగాణ భాషాభివృద్ధికి ముఖ్యమైన ‘తెలుగు క్రియా పదకోశం’ పనిని ప్రారంభించారు.

Nalimela Bhaskar: ఏ భాషనూ గుడ్డిగా వ్యతిరేకించవద్దు

నలిమెల భాస్కర్ తెలుగు నేల మీదనే కాదు దేశంలోనూ అరుదనిపించే విధంగా పద్నాలుగు భారతీయ భాషలు నేర్చారు. ఆయా భాషల్లో నుండి తెలుగు లోకి, తెలుగు నుండి కొన్ని భాషల్లోకి అనువాదాలు చేశారు. అనువాదంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకున్నారు. 1974 నుండి నేటి వరకు కవిత్వం, కథలు, నవలలు, అనువాదాలు, వ్యాస సంపుటాలు, భాషా గ్రంథాలు కలిపి నలభై పుస్తకాలు వెలువరించారు. వీటిలో భాషా నేపథ్యంగా ఉన్న పుస్తకాలు పది ఉన్నాయి. నలిమెల భాస్కర్ సప్తతి సందర్భంగా వారి భాషా కృషిని అభిప్రాయాలను తెలుసుకునే ఉద్దేశ్యంతో జరిపిన సంభాషణ ఇది.


మీరు పద్నాలుగు భాషలు నేర్చుకోవడం వెనుక ఉన్న కృషిని వివరిస్తారా?

మొదలు బాలాజీ పబ్లికేషన్స్ చెన్నై వారి 30 రోజుల్లో ఫలానా భాష నేర్చుకోండి పుస్తకాలతో ప్రారంభించాను. తర్వాత, ఆయా మాతృభాషీయులకు ఆంగ్లం నేర్పే పుస్తక మహల్ ఢిల్లీ వారి రెపిడెక్స్ పుస్తకాలని ఆశ్రయించాను. అయితే రెపిడెక్స్‌లోని ఆంగ్లంతో నేను ఆయా భారతీయ భాషలు అటు నుంచి ఇటు నేర్చుకున్నాను. ఆ తర్వాత డాల్టన్ పబ్లికేషన్స్ చెన్నై నుంచి వచ్చే అన్ని భాషల చందమామల్ని అందుకున్నాను. అలాగే చంపక్ బాలల పత్రిక ద్వారా భాషా పరిమళాలు ఆఘ్రాణించాను. ఇదంతా పఠనం. కానీ శ్రవణం కూడా కావాలి కదా! ఢిల్లీ ఆకాశవాణి కేంద్ర వార్తలు అన్ని భాషల్లో వినేవాడిని. దాదాపు దేశమంతా తిరిగాను అదో పెద్ద కథ.


తెలంగాణ పదకోశంతో పాటు తెలంగాణ భాష దేశ్య, సంస్కృత, తమిళ, క్రియా పదాలు పుస్తకాలు రాసిన మీరు తెలంగాణ తెలుగుదనం కాపాడుకోవడానికి ఏ సూచనలు చేస్తారు?

తెలంగాణ తెలుగైనా మరొకటైనా రక్షించుకోవాలంటే ముందుగా ఆ భాషా పదాలు, పదబంధాలు, జాతీయాలు, సామెతలు అన్నింటినీ నమోదు చేసుకోవాలి. భాషా చరిత్ర రాసుకోవాలి. వ్యాకరణం రచించాలి. రాష్ట్రం ఏర్పాటు ఐన తర్వాత కొంతవరకు సాహిత్య చరిత్ర నిర్మాణం జరిగింది. కొంత మేరకు పదకోశాలు వచ్చాయి. అయితే పూర్తిస్థాయి నిఘంటు నిర్మాణం గురించిన సోయి ఉండాలి. ఇక బోధనా భాషగా ఒకేసారి కాదుగాని, క్రమంగా ఒకటవ తరగతి నుండి ఓ ఐదారేళ్లలో ఆయా తరగతుల్లో ఇప్పుడున్న భాషకు బదులుగా తెలంగాణ భాషలోనే వాచక రచన జరగాలి. తెలంగాణ భాష అధికార భాషగా అన్ని రంగాల్లో అమలుకై ప్రయత్నించాలి.


అరవై ఏళ్లుగా ఎవరూ సాహసించని ‘తెలుగు క్రియా పదకోశం’ పనిని మీరు ఎలా ప్రారంభించారు? దాని అవసరం ఏమిటి?

1962 వశ్వనాథ సత్యనారయణ, మరుపూరు కోదండరామిరెడ్డి, యశోదా రెడ్డి మొదలైన వారు కలిసి, ‘ఆంధ్ర క్రియా స్వరూప మణి దీపిక’ పేరుతో ఓ క్రియా నిఘంటువు వేశారు. అది గొప్ప కృషి. అయితే, ఈ 60 ఏళ్ల కాలంలో ఆ నిఘంటువును పరివర్ధితం చేయాలన్న తలంపు ఎవరికీ రాకపోవడం శోచనీయం. ఆచార్య రవ్వా శ్రీహరి తరం దాదాపు పోయింది, పోతోంది. ఓ ఐదారేళ్ళుగా ఓ పెద్దమనిషి తన పేరు చెప్పుకోకుండా అదేపనిగా ఉత్తరాలు రాస్తూ నన్ను ఆ పని చేయవలసిందిగా పురికొలుపుతున్నాడు. ‘brood over’ అని ఉత్తరం చివర ప్రతిసారీ రాసి ముగిస్తాడు. నా ఒక్కడి వల్ల అది సాధ్యమయ్యే పని కాదు. అయినా ఎట్టకేలకు ఓ ఏడాది పాటు పనిచేద్దామని సాహసించాను. నా దగరున్న దాదాపు 30 నిఘంటువుల్లోని క్రియా పదాలన్నీ ‘ఐ’ వరకు తీసుకున్నాను. నాకు గుర్తుకొచ్చిన క్రియా పదాలు చేర్చాను. ఒక పదానికి పూర్వం చెప్పని అర్థఛాయలు సైతం నాకు తోచినవి చెప్పాను. ఆరోపాలు మాత్రం చేర్చలేదు. ‘అ’ నుండి ‘ఐ’ వరకు చేసేసరికి అనారోగ్యం పాలై అక్కడికి ఆపేశాను. బూర్ల వంటి తర్వాతి తరం అందుకుంటారన్న ఆశ ఉంది మరి! ఇక, దీని అవసరం ఏమిటంటే– ఈ అరవై ఏళ్ల వ్యవధిలో అనేక కొత్త వస్తువులు ఆవిష్కరించబడ్డాయి. చాలా సంఘటనలు చరిత్రలో నమోదయినాయి. వీటన్నింటిని అమ్మనుడి లోనికి తెచ్చుకోవాలి. లాగిన్ అవ్వడం, లాగ్ అవుట్ కావడం– ఇట్లా చాలా


రాయణ, మరుపూరు కోదండరామిరెడ్డి, యశోదా రెడ్డి మొదలైన వారు కలిసి, ‘ఆంధ్ర క్రియా స్వరూప మణి దీపిక’ పేరుతో ఓ క్రియా నిఘంటువు వేశారు. అది గొప్ప కృషి. అయితే, ఈ 60 ఏళ్ల కాలంలో ఆ నిఘంటువును పరివర్ధితం చేయాలన్న తలంపు ఎవరికీ రాకపోవడం శోచనీయం. ఆచార్య రవ్వా శ్రీహరి తరం దాదాపు పోయింది, పోతోంది. ఓ ఐదారేళ్ళుగా ఓ పెద్దమనిషి తన పేరు చెప్పుకోకుండా అదేపనిగా ఉత్తరాలు రాస్తూ నన్ను ఆ పని చేయవలసిందిగా పురికొలుపుతున్నాడు. ‘brood over’ అని ఉత్తరం చివర ప్రతిసారీ రాసి ముగిస్తాడు. నా ఒక్కడి వల్ల అది సాధ్యమయ్యే పని కాదు. అయినా ఎట్టకేలకు ఓ ఏడాది పాటు పనిచేద్దామని సాహసించాను. నా దగరున్న దాదాపు 30 నిఘంటువుల్లోని క్రియా పదాలన్నీ ‘ఐ’ వరకు తీసుకున్నాను. నాకు గుర్తుకొచ్చిన క్రియా పదాలు చేర్చాను. ఒక పదానికి పూర్వం చెప్పని అర్థఛాయలు సైతం నాకు తోచినవి చెప్పాను. ఆరోపాలు మాత్రం చేర్చలేదు. ‘అ’ నుండి ‘ఐ’ వరకు చేసేసరికి అనారోగ్యం పాలై అక్కడికి ఆపేశాను. బూర్ల వంటి తర్వాతి తరం అందుకుంటారన్న ఆశ ఉంది మరి! ఇక, దీని అవసరం ఏమిటంటే– ఈ అరవై ఏళ్ల వ్యవధిలో అనేక కొత్త వస్తువులు ఆవిష్కరించబడ్డాయి. చాలా సంఘటనలు చరిత్రలో నమోదయినాయి. వీటన్నింటిని అమ్మనుడి లోనికి తెచ్చుకోవాలి. లాగిన్ అవ్వడం, లాగ్ అవుట్ కావడం– ఇట్లా చాలా క్రియలను మాతృభాషలో చెప్పవచ్చా అన్నది ఆలోచించాలి. కాని పక్షంలో వాటినైనా నిఘంటువుల్లో చేర్చాలి కదా! గత ఆరు దశాబ్దుల్లో వేలకొద్దీ క్రియా పదాలు కొత్తవి వచ్చి ఉంటాయి. తెలుగు భాషలో ఉన్నన్ని మూల ధాతువులు ఏ ఇతర ద్రావిడ భాషల్లోనూ లేవని ఈ తరానికి ఎఱుక పరచడం కూడా ఈ కోశం ఉద్దేశం. అందుకే, వీలైనన్ని పర్యాయపదాలు ఇచ్చాను. క్రియలకు అర్థ వివరణ చేసేటప్పుడు మన భాషలోని దేశ్య క్రియల మీద దృష్టి పెడితే మనమందరం అబ్బుర పడిపోయే పద సంపద మన కళ్ళ ముందు కదలాడుతుంది.


భాష పేరుతో ఏర్పడ్డ తెలుగు రాష్ట్రాల్లో తెలుగు భాష అన్ని రంగాల్లో అమలు జరగాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి?

ఒక్కటే! అది... భాషా ఉద్యమం. ఏ ఉద్యమమైనా మొదట చిన్నగానే ఆరంభమవుతుంది. చాలామంది ఈ ఉద్యమంలో ఇప్పటికే పని చేస్తున్నారు. ఎందుకో పూర్తి మద్దతు భాషా ప్రియుల నుంచి, మాతృభాషాభిమానుల నుండి లభించడంలేదేమో! మనకు సీరియస్‌నెస్ తక్కువ. భాషోద్యమకారులు అందరూ భేషజాలు ఉంటే వదులుకొని కలవాలి. అధికార భాష అమలు మొదట సచివాలయంలో జరగాలి. మన దృష్టి అక్కడ కేంద్రీకరించి పాలనా భాషగా బోధనా భాషగా న్యాయస్థానాల్లోనూ అన్ని కార్యాలయాల్లోనూ అమలు గురించి గట్టిగా ప్రయత్నించాలి. దైనందిన వ్యవహారంలో అలవోకగా అనివార్యంగా దొర్లే ఆంగ్ల పదాలకు తెలుగులో సమానార్థకాలు చెల్లుబాటు కావాలి. నూతన పద కల్పన సృజనాత్మక, నిరంతర ప్రక్రియ. ఆ పదాలు హాయిగా అర్థవంతంగా ఉండాలి గానీ, నోరు తిరగని సంస్కృత పదాలు తెచ్చుకోకూడదు, అవసరమైతే తప్ప! ఇలాంటివన్నీ ఒక చక్కటి వాతావరణంలో చర్చించుకునేందుకు ప్రభుత్వాలు పూను కోవాలి. లేదంటే, అకాడమీలు విశ్వవిద్యాలయాలు ముందుకు రావాలి. భాషా సాంస్కృతిక శాఖ ఈ విషయంలో చొరవ తీసుకోవచ్చు. అసలు ఇంతవరకు తెలంగాణలో అధికార భాష సంఘాధ్యక్ష నియామకమే కాలేదు. అలాగే సాహిత్య అకాడమీ అధ్యక్ష పదవి నియామకమూ జరగలేదు.


ఇంగ్లీష్, హిందీ, సంస్కృతం తదితర భాషల ఒత్తిడిని తట్టుకొని నిలబడాలంటే తెలుగు భాషలో జరగాల్సిన కృషి ఏమిటి?

ఏ భాషనూ గుడ్డిగా వ్యతిరేకించవద్దు. ఒకటి, కనీసం ప్రాథమిక విద్యవరకైనా మాతృభాషలో బోధించాలి. ఇంగ్లీషు ప్రపంచం మీద రుద్దబడింది. అది, తెలుగు కావ్య భాష కన్నా మూడొందల ఏళ్ల అనంతర భాష. కానీ, ఆ భాషలో శాస్త్ర సాంకేతికాది పుస్తకాలన్నీ అనువదించబడి ఉన్నై. అలాగే, సంస్కృతంలోనూ అనేక శాస్త్రాలు రచించబడి ఉన్నాయి. హిందీని జాతీయ భాషగా చేసినందువల్ల అందులోనూ ఈ విజ్ఞానం ఉంది. మొదట చేయాల్సింది ఏమంటే– మనం తెలుగులోనికి శాస్త్ర సాంకేతికాది సర్వశాస్త్రాలని అనువ దించుకోవాలి. అట్లా అనువాదం చేసేటప్పుడు ప్రధానంగా పదాల విషయంలో తెలుగులో సమానార్థకాలైన మాటలు ఉన్నాయా అని ఆలోచించాలి. ప్రాచీన సాహిత్యంలోనూ ప్రజల వాడుకలోనూ చక్కని అర్థపుష్టి కలిగిన తెలుగు పదాలు వేలల్లో ఉన్నాయి. ఒకవేళ కొన్ని పలుకులు లేనప్పుడు కొత్త మాటల కూర్పు జరగాలి. అదీ సాధ్యం కానప్పుడు మూల భాష లోని నుడులను ఉన్నవి ఉన్నట్లుగా తెచ్చుకోవడం తప్పేమీ కాదు! ఇప్పటికే తెలుగులో వాగరి, సం.వెం. రమేష్, వాచస్పతి, పారుపల్లి మొదలైన వాళ్లు ఈ కొత్త మాటల కూర్పు విషయంలో పనిచేశారు, చేస్తున్నారు. అయితే మనది ఏకోన్ముఖంగా సాగుతున్న పని కాదు. ఒక ‘కన్నడ కావలి సంఘ’లాగానో, తంజావూర్ పండిత పరిషత్ వలెనో కొనసాగుతున్న పని కాదు. ప్రపంచంలోని విజ్ఞానాన్నంతా తెలుగులోనికి ఒంపుకున్నప్పుడు, నింపుకున్నప్పుడు మన కొరత తీరుతుంది. పూర్వం అరబ్బీ లోనికి ఉపనిషత్తుల దగ్గర నుంచి అన్నీ వెళ్లాయి. హిబ్రూ భాష ఇప్పటికీ ఓ గొప్ప ఉదాహరణగా నిలుస్తుంది. ముందు ప్రభుత్వాలకు ఆ స్పృహ ఉండాలి.

-ఇంటర్వ్యూ

బూర్ల వేంకటేశ్వర్లు

94915 98040

Updated Date - May 26 , 2025 | 05:46 AM