Democracy Analysis: మోదీ పాలనపై సామాన్యుడి సణుగుడు
ABN , Publish Date - Jun 14 , 2025 | 03:16 AM
ఏ విషయం పైన అయినా ఒకే ఒక్క సరైన దృక్పథమనేది ఉండదు. ఐన్స్టీన్ అమోఘ సృష్టి సాధారణ సాపేక్ష సిద్ధాంతాన్ని జయంత్ నార్లికర్ సహా పలువురు శాస్త్రవేత్తలు ప్రశ్నించారు. దురుద్దేశమనేది లేనంతవరకు ఏ దృష్టి కోణంలోనైనా...

ఏ విషయం పైన అయినా ఒకే ఒక్క సరైన దృక్పథమనేది ఉండదు. ఐన్స్టీన్ అమోఘ సృష్టి సాధారణ సాపేక్ష సిద్ధాంతాన్ని జయంత్ నార్లికర్ సహా పలువురు శాస్త్రవేత్తలు ప్రశ్నించారు. దురుద్దేశమనేది లేనంతవరకు ఏ దృష్టి కోణంలోనైనా ఎంతో కొంత సత్యం తప్పక ఉంటుంది. ఆ సత్యాన్ని గౌరవించి తీరాలి. భిన్న దృక్పథంలోని సత్యాన్ని గుర్తించి, గౌరవించే గుణ విశేషం ప్రస్తుత ప్రభుత్వానికి లేనే లేదు. గత 11 సంవత్సరాలలో అటువంటి సుగుణాన్ని అలవరచుకునే ప్రయత్నం అది ఏ కోశానా చేయలేదు. నరేంద్ర మోదీ కేంద్రంలో అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు పూర్తయ్యాయి. సుదీర్ఘకాలం ప్రధానమంత్రిగా ఉన్న నాయకులలో ఆయన మూడవవారు. ఆ అత్యున్నత పదవిలో ఇంతకాలం ఉండడమే, తన పార్టీని ఎన్నికలలో గెలిపించగల ఆయన పట్టుదల, సామర్థ్యానికి నిదర్శనం. ప్రతి ప్రభుత్వంలోను మంచి–చెడు రెండూ ఉంటాయి. ఎన్డీఏ ప్రభుత్వమూ ఇందుకు మినహాయింపు కాదు. ఒక ప్రభుత్వ పనితీరును అంచనా వేసేందుకు ప్రజలు ప్రాతిపదికగా తీసుకునే ప్రమాణాలు భిన్నంగా ఉంటాయి. అవి పరిమాణాత్మకమైనవి కావు. ‘సుపరి పాలన’ అనేది ఆ అంచనాకు ప్రమాణం, ప్రాతిపదిక. సుపరిపాలన ఉంటే ఒక దేశం సకల ప్రజలకు మెరుగైన, బలమైన, న్యాయమైన సమాజంగా కనిపిస్తుంది. తన కుటుంబానికి మరింత సౌఖ్యదాయక జీవితం చేకూరగలదనే సంతృప్తి ప్రతి వ్యక్తికీ సమకూరుతుంది. సుపరిపాలన నాణ్యతను పరిమాణాత్మకంగా వివేచించలేము, గ్రహించలేము. నా అంచనాలో భారత్ అందరికీ మెరుగైన, బలమైన, అనుకూలమైన జీవన స్థితిగతులను సమకూర్చేదిగా లేదు.
లక్షలాది ప్రజల స్థితిగతులు మెరుగుపడ్డాయి, సందేహం లేదు. అయితే మరెన్నో లక్షల మంది బతుకులు నిత్య అనిశ్చితి, పేదరికం, నిరుద్యోగం, భయంతో నాశనమయ్యాయి. ఎంతో మందికి ఈ హాని ఇంకా మరింత తీవ్రంగా వాటిల్లుతోంది. భారతదేశ వృద్ధిరేటును పెంపొందించే లక్ష్యంతో ఆర్థిక సంస్కరణలు, సరళీకరణ విధానాలను అమలుపరిచాము. యూపీఏ ప్రభుత్వాల పదేళ్ల పాలన (2004–14)లో సగటు జీడీపీ వృద్ధి రేటు పాత అంచనాల ప్రకారం 7.46 శాతం కాగా కొత్త అంచనాల ప్రకారం 6.7 శాతంగా ఉన్నది. 2014–15 తరువాత, మరీ ముఖ్యంగా 2019–20 తరువాత అధికారిక గణాంకాలే జీడీపీ వృద్ధిరేటు మందగిస్తున్నదని వెల్లడించాయి. 2024–25లో వృద్ధిరేటు పెరుగుదల స్వల్పస్థాయిలోనే ఉన్నది. ప్రజల మెరుగైన జీవన పరిస్థితులకు ప్రమాణం వారి తలసరి ఆదాయమే కానీ, జీడీపీ పరిమాణం కాదు. యూపీఏ ప్రభుత్వాల పదేళ్ల పాలనలో దేశ ప్రజల తలసరి ఆదాయం రెట్టింపు కంటే ఎక్కువయింది. వాస్తవంగా అది 2.64 రెట్లు పెరిగింది. మరింత స్పష్టంగా చెప్పాలంటే భారత ప్రజల తలసరి ఆదాయం 543 నుంచి 1438 డాలర్లకు పెరిగింది. ఎన్డీఏ ప్రభుత్వాల పాలన మొదటి పది సంవత్సరాలలో భారత ప్రజల తలసరి ఆదాయం 1.89 రెట్లు మాత్రమే పెరిగింది.
అంటే 1438 నుంచి 2711 డాలర్లకు పెరిగింది. 11వ సంవత్సరంలో అది 2878 డాలర్లకు పెరిగింది. ఈ ప్రకారం తలసరి ఆదాయం విషయంలో మన దేశం ప్రపంచంలో 136వ స్థానంలో ఉన్నది. మరి అభివృద్ధి చెందిన దేశంగా పరిగణన పొందాలంటే తలసరి ఆదాయం 14,000 డాలర్లకు పెరగాలి. ఇది ఎప్పటికి సాధ్యమవుతుంది? అసమానతలు విపరీతంగా పెరిగిపోవడంతో పాటు సంపన్నులు/ అధిక సంపన్నులు (దేశ జనాభాలో ఎగువ 20 శాతం), పేదలు/నిరుపేదలు (దేశ జనాభాలో దిగువ 20 శాతం) అందరిలోను భయం, అభద్రత గూడు కట్టుకున్నాయి. మెజారిటేరియనిజం ప్రబలమవుతోంది, మతోన్మాదం పెచ్చరిల్లుతోంది, కుల ఘర్షణలు పెరిగిపోతున్నాయి, విద్వేష ప్రసంగాలు, రాతలకు అడ్డూ అదుపు ఉండడం లేదు, ఆశ్రిత పెట్టుబడిదారీతనం నిర్లజ్జగా వర్ధిల్లుతోంది, నేర విచారణా వ్యవస్థ కూలిపోయింది; సమాఖ్య పాలనా పద్ధతి బీటలు వారింది, పాలనలో నిరంకుశ ధోరణులు తీవ్రమవుతున్నాయి. ఇందుకు రెండు ఉదాహరణలు చాలు: (1) ఆదాయ పన్ను చట్టం నుంచి మనీలాండరింగ్ నిరోధక చట్టం దాకా అనేక చట్టాలను రాజకీయ ప్రయోజనాలు సాధించుకోవడానికి దుర్వినియోగం చేస్తున్నారు; (2) నిధుల కొరత నెదుర్కొంటున్న ముంబై సబర్బన్ రైల్వేస్ పరిధిలో 2014–25 సంవత్సరాల మధ్య సంభవించిన రైలు ప్రమాదాలలో 29,970 మంది మరణించగా 30,214 మంది గాయపడ్డారు. ఈ సబర్బన్ రైల్వే నెట్వర్క్ పరిస్థితుల మెరుగుదలను ఉపేక్షించి ముంబై–అహ్మదాబాద్ల మధ్య బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ నిర్మాణానికి రూ.1,08,00 కోట్లు ఖర్చు పెట్టారు. దేశం దృఢంగా ఉండడమంటే ఏమిటి? సమైక్యంగా ఉండడం, ఇరుగు పొరుగుదేశాలతో స్నేహ, సహకార సంబంధాలు కలిగి ఉండడం, సరిహద్దులు భద్రంగా ఉండడం, సమర్థమైన సాయుధ బలగాలు, ప్రపంచ దేశాలతో సహృద్భావపూర్వక దౌత్య, వాణిజ్య సంబంధాలు ఉండడం, అంతర్జాతీయ వేదికలపై గౌరవప్రదమైన ప్రాధాన్యం లభించడం.
పహల్గాంలో ఉగ్ర ఘాతుకం, ఆపరేషన్ సిందూర్ తరువాత మన బలహీనతలు బయల్పడ్డాయి. ఇరుగు పొరుగు దేశాలైన శ్రీలంక, మయన్మార్, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్ అఫ్ఘానిస్తాన్లకు మన పార్లమెంటరీ ప్రతినిధి బృందాలను పంపలేదు. ఆ దేశాలూ పహల్గాం, సిందూర్పై బహిరంగంగా మాట్లాడలేదు. అనేక దేశాలు ఉగ్రవాద దాడిని ఖండించాయి. అయితే ఏ దేశమూ ఆ దాడి వెనుక ఉన్న పాకిస్థాన్ ప్రమేయాన్ని ఖండించలేదు. సంప్రదాయ యుద్ధ తంత్రంలో పాకిస్థాన్పై భారత్కు ఉన్నదని అనుకుంటున్న ఆధిక్యతపై సందేహాలు ముసురుకున్నాయి. పలు అంతర్జాతీయ కూటములలో సభ్య దేశంగా ఉన్న భారత్ ఎగుమతులపై అమెరికా భారీ సుంకాలు విధించింది. పైగా దౌత్య వ్యవహారాలలో భారత్, పాకిస్థాన్లకు సమ ప్రాధాన్యమిస్తోంది. ఐఎమ్ఎఫ్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్, ప్రపంచ బ్యాంకు డైరెక్టర్ల బోర్డ్లో సభ్యత్వమున్నా ఆ రెండు సంస్థలూ ఆపరేషన్ సిందూర్ అనంతరం పాకిస్థాన్కు భారీ రుణాలు మంజూరు చేయడాన్ని భారత్ నిలువరించలేక పోయింది. ఫ్రెంచ్, రష్యన్, ఇజ్రాయెలీ సైనిక సామగ్రితో పాకిస్థాన్కు వ్యతిరేకంగా భారత్ నాలుగు రోజుల యుద్ధం చేసింది. భారత్ శక్తిమంతంగా ఉండవచ్చుగానీ మనం విశ్వసిస్తున్నంత శక్తిమంతంగా లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి అధికారాన్నీ తన చేతుల్లో కేంద్రీకరించుకున్నారు. ప్రభుత్వ విజయాల ఘనత తనదే అని ఆయన చెప్పుకోవచ్చు గానీ ప్రభుత్వ వైఫల్యాలు అన్నిటికీ ఆయనే బాధ్యత వహించి తీరాలి. ‘భారతీయుడిని అయినందుకు గర్విస్తున్నానా?’ అని నన్ను నేను ప్రశ్నించుకుంటే ‘అవును, గర్విస్తున్నాను’ అని తప్పక సమాధానం చెప్పుకుంటాను. ‘భారత్ను పరిపాలిస్తున్న పద్ధతి పట్ల సంతోషంగా ఉన్నానా’ అని ప్రశ్నించుకుంటే సంతోషంగా లేను అనేదే స్పష్టమైన సమాధానం. సమస్త భారతీయులకు మరింత మెరుగైన, శక్తిమంతమైన, న్యాయమైన సమాజంగా భారత్ వర్ధిల్లే రోజు కోసం ఎదురుచూస్తున్నాను.
(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు)