Nairobi Railway: తూర్పు ఆఫ్రికాలో ఇనుపపాము
ABN , Publish Date - Jun 15 , 2025 | 04:04 AM
తూర్పు ఆఫ్రికాలోని ప్రాంతాలను అనుసంధానించడానికి, కెన్యా నుంచి ఉగాండా వరకూ రైలు మార్గాన్ని నిర్మించాలని బ్రిటిష్ సామ్రాజ్య పాలకులు నిర్ణయించారు. చౌక శ్రమశక్తికి వెసులుబాటు కల్పించిన బానిసత్వ వ్యవస్థ అప్పటికే రద్దయ్యింది.

తూర్పు ఆఫ్రికాలోని ప్రాంతాలను అనుసంధానించడానికి, కెన్యా నుంచి ఉగాండా వరకూ రైలు మార్గాన్ని నిర్మించాలని బ్రిటిష్ సామ్రాజ్య పాలకులు నిర్ణయించారు. చౌక శ్రమశక్తికి వెసులుబాటు కల్పించిన బానిసత్వ వ్యవస్థ అప్పటికే రద్దయ్యింది. దీంతో రైలు మార్గాన్ని నిర్మించడానికి కాంట్రాక్ట్ ప్రాతిపాదికన, తక్కువ ధరలో ఒప్పంద కార్మికులను భారతదేశం నుంచి తెచ్చుకోవచ్చు అనుకున్నారు తూర్పు ఆఫ్రికా వలస పాలకులు. దానికోసం ‘ఇంపీరియల్ బ్రిటిష్ ఈస్ట్ ఆఫ్రికా కంపెనీ’ని 1888లో స్థాపించి, 1896లో మొంబాసా నుంచి విక్టోరియా సరస్సు దాకా రైల్వే ట్రాక్ నిర్మాణాన్ని ప్రారంభించారు. అవసరమైన కార్మికులు, సహాయక అధికారులను నియమించడానికి బాధ్యత వహించే ఒక ఏజెంట్ను కరాచీలో నియమించారు. ప్రధాన నియామక కేంద్రమైన లాహోర్లో ఒక బ్రాంచ్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. భారతదేశంలో రైల్వే నిర్మాణాన్ని ప్రారంభించిన దాదాపు 40 సంవత్సరాల తరువాతనే, తూర్పు ఆఫ్రికాలో రైళ్ల నిర్మాణ ఆలోచన మొదలయింది. భారతదేశంలో అటువంటి నిర్మాణ పనుల్లో పనిచేసిన కార్మికుల మీద బ్రిటిష్ వారి దృష్టి పడింది. ఉచిత ప్రయాణం, ఉచిత భోజనం, జీతం, ఉచితంగా తిరుగు ప్రయాణం లాంటి జనాకర్షక హామీలతో, పంజాబ్లోని గ్రామాల నుంచి కేవలం మగ, యువకార్మికులను సమీకరించగలిగారు. బ్రిటిష్ ఇండియా స్టీమ్ నావిగేషన్ కంపెనీకి చెందిన ప్రత్యేక చార్టర్డ్ స్టీమర్లలో వారినందరినీ కరాచీకి పంపారు. అక్కడి నుంచి మొంబాసాకు దాదాపు 3వేల మైళ్లు, తొమ్మిది రోజుల ప్రయాణం. 1896 జనవరి 24న మొంబాసాలో 350 మంది పంజాబీల మొదటి జట్టుతో ఒప్పంద కార్మిక వ్యవస్థ అక్కడ ప్రారంభమైంది. 7,500 మంది నైపుణ్యం ఉన్న కార్మికులు, 20 వేల మంది నైపుణ్యం లేని కార్మికులు భారతదేశం నుంచి వెళ్లారు. మొత్తం మీద, రైల్వే నిర్మాణంలో 32 వేల మంది భారతీయులు ఉపాధి పొందారు. 1898లో రైల్వే నిర్మాణం 100 మైళ్ల దూరం వరకూ సాగింది. తీరం నుంచి 326 కి.మీ దూరంలో ఉన్న నైరోబీకి మే 1899లో చేరుకుంది. ఆ తరువాత అక్కడ అది కీలకమైన ఓడరేవు అయింది. అయితే 200 మైళ్ల ప్రయాణం తరువాత, రైల్వే నిర్మాణంలో అత్యంత భయంకరమైన అధ్యాయాలలో ఒకటి 1898లో త్సావో నది మీద వంతెన నిర్మాణ సమయంలో జరిగింది. నరమాంస భక్షక మగ సింహాల జత, కార్మికుల శిబిరాలకు చేరి, రాత్రిపూట గుడారాలలో నిద్రిస్తున్న కార్మికులను బయటకు లాగి భక్షించేవి. పది నెలల పాటు కొనసాగిన ఆ దాడిలో వందమందికి పైగా మరణించారు.
వందలాది మంది కార్మికులు త్సావో నుంచి పారిపోవడంతో రైల్వే నిర్మాణం దాదాపు ఆగిపోయింది. ఆ సింహాలు కొంతకాలం తర్వాత, పనిలో ఉన్న పురుషులను వెంబడించడంలో నిపుణులయ్యాయి. సింహాలు అనుసరించిన పద్ధతులు అసాధారణమైనవి కావడంతో, ఆ రెండు మగ సింహాలూ కచ్చితంగా సింహాల శరీరంలోకి ప్రవేశించిన దెయ్యాలని భారతీయ కార్మికులు నమ్మడం మొదలుపెట్టారు. సింహాలను అంతం చేసే పని రైల్వే నిర్మాణాన్ని పర్యవేక్షించే ఇంజనీర్, లెఫ్టినెంట్ కల్నల్ జాన్ ప్యాటర్సన్ మీద పడింది. వారాల తరబడి నిరంతరాయంగా వెంబడించిన తర్వాత, ప్యాటర్సన్ ప్రాణాలకు తెగించి సింహాలను అంతం చేయగలిగాడు. వీటి నిర్మూలన ఆ రైల్వే చరిత్రలో ఒక భయంకరమైన అధ్యాయానికి ముగింపు పలికింది. ‘దెయ్యం’ ‘చీకటి’ అనే మారుపేరుతో వాటిని చెప్పుకునేవారు. రైలు నైరోబీ రైల్వే రిఫ్ట్ వ్యాలీ వైపు మళ్లిన తర్వాత ఆ ప్రాంతం మరీ ప్రమాదకరంగా మారింది. నిర్మాణం త్సావో నదికి చేరుకోకముందే, రైల్వే కార్మికుల మీద అక్కడి మాసాయి తెగ భయంకరంగా దాడి చేసింది. దానికి కారణం గతంలో (నవంబర్ 1895) ఇద్దరు మాసాయి గిరిజన బాలికల మీద అత్యాచారం జరగడమే. దానికి ప్రతిక్రియగా, మాసాయి తెగ దాదాపు ఆరు వందల మందికి పైగా రైల్వే కార్మికులను హతమార్చింది. మరొక ముఖ్యమైన ప్రతిబంధకం... అక్కడి సెత్సే దోమల కాటు. ఇవి కార్మికులలో నిద్ర జబ్బును సృష్టించేవి. క్లిష్టమైన భూభాగం కారణంగా చాలామంది మలేరియా, నల్ల జ్వరంతో మరణించారు. అనేక మరణాలకు అక్కడ ఏ వైద్య సదుపాయాలూ లేవు. పేలుడు పదార్థాలతో పని చేయడం వల్ల, వడదెబ్బల వల్ల, సొరంగాల తవ్వకాలలో కార్మికులు ప్రాణాలకు తెగించి పనిచేయాల్సి వచ్చేది. విక్టోరియా సరస్సుకి దగ్గరగా రైలు మార్గం విస్తరించడంతో నిర్మాణ పనుల్లో ఆటంకాలు మరింత పెరిగాయి.
కార్మికుల పరిస్థితి మరింత దిగజారింది. అయినా భారతీయ ఒప్పంద కార్మికుల అకుంఠిత కృషి కారణంగా రైల్వే అథారిటీ ఆరేడు సంవత్సరాల వ్యవధిలోనే నిర్మాణాన్ని పూర్తి చేయగలిగింది. 1899లో తీరం నుంచి నైరోబీ వరకు, 1900 నాటికి నకురు ప్రాంతం వరకూ రైల్వే పనులు పూర్తయి, 1901లో విక్టోరియా సరస్సు తీరంలో కిసుము ప్రాంతానికి రైల్వే అథారిటీ చేరుకుంది. మొంబాసా నుంచి కిసుము దాదాపు 560 మైళ్ల దూరంలో ఉంది. కిసుముకు చేరుకునే నాటికి దాదాపు 2,500 మంది మరణించారు. 1903 నాటికి విక్టోరియా సరస్సు వరకు రైలు మార్గాన్ని వేగంగా అభివృద్ధి చేశారు. పూర్తిగా స్థానిక కార్మికులపై ఆధారపడి ఉంటే రైల్వే నిర్మాణం కనీసం ఇరవై సంవత్సరాలు పట్టేదని బ్రిటిష్ అధికారులే భావించారు. ఆ ప్రశంస, కీర్తి అక్కడి ఒప్పంద భారతీయ కార్మికులకే చెందుతాయి. రైల్వేను నిర్మించడానికి మొత్తం 31,983 మంది భారతీయ కార్మికులు పని చేశారు. 6,454 మంది వ్యక్తులు ట్రాక్లు వేయడం మూలంగా అశక్తులయారు. రైల్వే నిర్మాణం పూర్తయిన తర్వాత 6,724 మందిని వారి సంరక్షిత రాజ్యంలో పని చేసేందుకు తీసుకున్నారు. వీరిలో 2,000 మందిని మాత్రమే రైల్వే శాఖల్లో నియమించుకున్నారు. ఆఫ్రికా సమాజానికి ఆ రైల్వే అనేక విధాలుగా ఉపయోగపడింది. భారతీయ ఒప్పంద కార్మికులు పోషించిన పాత్రతో తరువాత ఆఫ్రికా సమాజంలో అనేక మార్పులొచ్చాయి. రైల్వే నిర్మాణానికి ప్రారంభ ఖర్చు 50 లక్షల డాలర్లుగా నిర్ణయించబడినా, దాని నిర్మాణానికి బ్రిటిష్ వారికి 90 లక్షల డాలర్ల వరకూ ఖర్చయింది. అది పార్లమెంటులోను, మీడియాలోను తీవ్ర ఆగ్రహాన్ని సృష్టించింది. నిర్మాణం ప్రారంభించకముందే, ఈ ఆలోచనను వ్యతిరేకించినవారు చాలా మంది ఉన్నారు. వీరిలో ఒకరైన హెన్రీ లాబౌచెర్ కామన్స్ సభలో బ్రిటిష్ విదేశాంగ మంత్రి జార్జ్ కర్జన్ను ఇలా ఆక్షేపించాడు: ‘దీనికి ఎంత ఖర్చవుతుందో ఏ పదాలూ చెప్పలేవు/ దాని లక్ష్యం ఏమిటో ఏ మెదడూ ఊహించలేదు/ అది ఎక్కడి నుంచి మొదలవుతుందో ఎవరూ కనిపెట్టలేరు/ అది ఎక్కడికి వెళుతుందో ఎవరికీ తెలియదు... స్పష్టంగా అది ఒక ఉన్మాద లైను తప్ప మరొకటి కాదు’ అని. ఉగాండా రైల్వేను లూనాటిక్ (ఉన్మాద/పిచ్చి) అనే పదంతో పేర్కొనడం అదే మొదటిసారి. ‘లూనాటిక్ ఎక్స్ప్రెస్’ అనే పదాన్ని చార్లెస్ మిల్లర్ 1971లో తన పుస్తకం ‘ది లూనాటిక్ ఎక్స్ప్రెస్: యాన్ ఎంటర్టైన్మెంట్ ఇన్ ఇంపీరియలిజం’లో ఉపయోగించాడు.
అయితే కొంతమంది స్థానికులు ఆ ఎక్స్ప్రెస్ను ‘ఇనుప పాము’ అని పిలుచుకున్నారు. దానికి కారణం– ఇప్పుడు కెన్యాగా పిలువబడే ప్రదేశంలో యూరోపియన్లు అడుగుపెట్టడానికి వంద సంవత్సరాల క్రితమే, కిమ్నియోల్ అనే గిరిజన ప్రవక్త గడ్డి మైదానాల గుండా జారిపోయే ఒక క్రూరమైన ‘ఇనుప పాము’ గురించి మాట్లాడాడు. ‘అది పశువులను మింగేస్తుందని, వారి భూములను దోచుకుంటుందని, దారిలో విధ్వంసం సృష్టిస్తుందని, ఆ మృగం, ఇంతకు ముందెన్నడూ చూడని ఒక రకమైన విదేశీయుడిని తీసుకువస్తుందని, ఒక రోజు వారి భూమిని పరిపాలించే వింతైన ఎర్రటి జుట్టు గల వ్యక్తిని తీసుకొస్తుందని’ అతను చెప్పాడు. అతను చేసిన ప్రవచనం ఒక విషయాన్ని స్పష్టపరిచింది– అక్కడి ప్రజలకు కష్టాలు రాబోతున్నాయని! కిమ్నియోల్ ప్రవచనాలు నిజమని తేలినప్పటికీ ‘ఇనుప పాము’ ఆ ప్రజల జీవితాలను ఆయన కూడా ఊహించలేని విధంగా మార్చింది. ఆశ్చర్యంగా బ్రిటిష్ పత్రికలు సైతం దానిని ‘ఇనుప పాము’ అనే అన్నాయి, ఎందుకంటే దాని నిర్మాణ సమయంలో అపారమైన సంపద వృథా అయింది. ఆ ప్రాంతంలో నివసించిన తెగలు రైల్వే నిర్మాణాన్ని ప్రతిఘటించాయి. ఈ రైలు మార్గం ఉగాండా, కెన్యా అంతర్భాగాలను, కెన్యాలోని హిందూ మహాసముద్ర నౌకాశ్రయాన్ని మొంబాసాతో అనుసంధానించింది. మొదటి ప్రపంచ యుద్ధంలో తూర్పు ఆఫ్రికాలో జర్మనీని ఓడించడానికి బ్రిటిష్ వారికి సహాయపడి, ఇతర వలస రాజ్యాలతో కమ్యూనికేషన్ కొనసాగించడానికి చాలా ముఖ్యమైనదిగా మారింది. రైల్వే రాకముందు నైరోబీ జనావాసాలు లేని చిత్తడినేల. నేడు నైరోబీ కెన్యాలో ముప్పై లక్షలకు పైగా జనాభా ఉన్న అతిపెద్ద నగరం. నిద్రాణస్థితిలో ఉన్న తీరప్రాంతం మొంబాసా అనంతరం పట్టణమై, ఆధునిక ఓడరేవుగా రూపాంతరం చెందింది. కెన్యాతో పోలిస్తే ఉగాండాకు ఇప్పుడు వ్యవసాయం నుంచి సమృద్ధిగా రాబడి వస్తోంది. 1938 నాటికి, పత్తి సాగు ఒక్కటే 30 లక్షల ఎకరాల భూమిని ఆక్రమించింది. 1900–04 సంవత్సరాల మధ్య బ్రిటిష్ తూర్పు ఆఫ్రికా కమిషనర్గా ఉన్న చార్లెస్ ఎలియట్ వీటన్నింటినీ గమనించి ఇలా వ్యాఖ్యానించాడు: ‘ఒక దేశం రైల్వేను సృష్టించడం అసాధారణం కాదు, కానీ రైల్వేనే ఒక దేశాన్ని సృష్టించడం అసాధారణం.’
- ముకుంద రామారావు కవి,
వలసజీవితాల చరిత్రకారుడు (99083 47273)