Share News

Water Conflict: సింధు జీవధార సమరాయుధమా

ABN , Publish Date - Jun 15 , 2025 | 04:16 AM

ఒక దేశం యుద్ధంలో ఉన్నప్పుడు ఆ దేశ ప్రజలు, నాయకులు శత్రుదేశానికి వ్యతిరేకంగా తీవ్ర ప్రకటనలు చేస్తారు. అవి ఆచరణ సాధ్యంకాకున్నా సరే. కానీ, బాధ్యతాయుతమైన నాయకులు ఆ ప్రకటనలను పదేపదే పునరుద్ఘాటిస్తే దేశ ప్రయోజనాల...

Water Conflict: సింధు జీవధార సమరాయుధమా

క దేశం యుద్ధంలో ఉన్నప్పుడు ఆ దేశ ప్రజలు, నాయకులు శత్రుదేశానికి వ్యతిరేకంగా తీవ్ర ప్రకటనలు చేస్తారు. అవి ఆచరణ సాధ్యంకాకున్నా సరే. కానీ, బాధ్యతాయుతమైన నాయకులు ఆ ప్రకటనలను పదేపదే పునరుద్ఘాటిస్తే దేశ ప్రయోజనాల దృష్ట్యా వాటిని నిశితంగా పరిశీలించవలసి ఉన్నది. సింధు నదీజలాల ఒప్పందం (ఇండస్‌ వాటర్‌ ట్రీటీ– ఐడబ్ల్యుటి) విషయంలో అటువంటి పరిస్థితే ఇప్పుడు భారత్‌కు తటస్థించింది. సింధు నదీజలాల ఒప్పందం గురించి రాజకీయవేత్తలు ఇప్పుడు ఏమి మాట్లాడుతున్నప్పటికీ అది కాల పరీక్షకు నిలిచింది. భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య మూడు యుద్ధాలు జరిగినా వాటి ప్రభావం దాని అమలుపై పడలేదు. ఆ ఒప్పందాన్ని చారిత్రక తప్పిదంగా కొందరు ఘోషిస్తున్నారు. ఇది వివేకవంతమైన అభిప్రాయం కాదు. అంతకంటే మెరుగైన, ఉభయత్రా మేలైన ఒప్పందం ఇప్పుడు సాధ్యంకాదు. ఇరుగు పొరుగు దేశాలతో ఉమ్మడి నదీ పరీవాహక ప్రాంతాలున్న దేశం భారత్‌ మాత్రమే కాదు. ప్రపంచవ్యాప్తంగా కనీసం 286 నదీ పరీవాహక ప్రాంతాలను ఒకటి కంటే ఎక్కువ దేశాలు కలిగి ఉన్నాయి. 150కి పైగా దేశాలు వివిధ నదీ పరీవాహక ప్రాంతాలను పంచుకుంటున్నాయి. రాజకీయ సరిహద్దులను అధిగమించే నదీ పరీవాహక ప్రాంతాలు ప్రపంచ భూ విస్తీరణంలో 42 శాతంగా ఉన్నాయి. ఈ పరీవాహక ప్రాంతాలలో 300 కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. ఈ రివర్‌ బేసిన్‌ల నిర్వహణ, యాజమాన్యం వివిధ ఒప్పందాలకు అనుగుణంగా జరుగుతోంది. మన దేశం వివిధ నదీ పరీవాహక ప్రాతాలను డజన్‌కు పైగా దేశాలతో పంచుకుంటున్నది. ఆయా ప్రాంతాలకు భారత్‌ ఎగువ దేశంగాను, దిగువ దేశంగాను ఉన్నది. నదీజలాల పంపకానికి సంబంధించి అనేక అంతర్జాతీయ ఒప్పందాలు, మార్గదర్శక సూత్రాలు, చారిత్రక రివాజులు ఉన్నాయి. ప్రపంచ అగ్రరాజ్యంగా ప్రభవించాలని ఆకాంక్షిస్తున్న భారత్‌ వాటన్నిటినీ గౌరవించవలసి ఉన్నది. అది అనివార్యం. నీరు, ప్రాదేశిక హక్కులు ఉన్న భూమి కాదు. నది సదా దిగువకే ప్రవహిస్తుంది. వివిధ చట్టాల ప్రకారం నీటి నిర్వహణ, యాజమాన్యం ఉంటుంది. ఇది ఎవరూ కొట్టివేయలేని సత్యం.


నదీ పరివాహక ప్రాంతాలకు సంబంధించిన ఒప్పందాలలో సింధు నదీజలాల ఒప్పందం (ఐడబ్ల్యుటి) కొంతమేరకు భిన్నమైనది. 1947లో దేశ విభజన కాలం నుంచి భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య అపరిష్కృతంగా ఉన్న వివాదాన్ని సింధు ఒప్పందం ఒక కొలిక్కి తీసుకువచ్చింది. ప్రపంచవ్యాప్తంగా చాలా నదీ పరీవాహక ప్రాంతాల ఒప్పందాలు నదీజలాల పంపకానికి సంబంధించినవి కాగా ఐడబ్ల్యుటి నదుల విభజనకు సంబంధించినది. ఈ ఒప్పందం సమకూర్చిన ఏర్పాటును భారత్‌ స్వయంగా కోరుకున్నదే. ఇటువంటి ఏర్పాటుకు భారత్‌ 1954లో సానుకూలత చూపగా పాకిస్థాన్‌ దాన్ని అంగీకరించేందుకు చాలా సంవత్సరాలు తీసుకున్నది. ఐడబ్ల్యుటి కింద సింధు నదీ వ్యవస్థను పశ్చిమ, తూర్పు నదులుగా విభజించారు. పశ్చిమ నదులు అయిన జీలమ్‌, చీనాబ్‌, ఇండస్‌ను పాకిస్థాన్‌కు కేటాయించారు. తన భూభాగాల గుండా ప్రవహించే ఈ నదుల నీటిని భారత్‌ చాలా పరిమితంగా మాత్రమే వినియోగించుకోవలసి ఉన్నది. ఆ నదులలో మొత్తం ప్రవాహ పరిమాణంలో ఎటువంటి తేడా సంభవించకుండా ఉండేలా మాత్రమే వినియోగించుకోవాలి. ఈ ప్రకారం ఆ మూడు పశ్చిమ నదులపై భారత్‌ ఎటువంటి ఆనకట్టలు నిర్మించకూడదు. తూర్పు నదులు అయిన రావి, బియాస్‌, సట్లేజ్‌లను భారత్‌కు కేటాయించారు. ఈ మూడు నదులు పాకిస్థాన్‌లోకి ప్రవేశించేంతవరకు వాటిపై పూర్తి నియంత్రణ భారత్‌కు ఉంటుంది. ఈ నదులలోని ప్రతి చుక్క నీటిని భారత్ వినియోగించుకోవచ్చు. పాకిస్థాన్‌కు ఏ మాత్రం నీరు ప్రవహించకుండా చేసేందుకు కూడా భారత్‌కు హక్కులు ఉన్నాయి. పాకిస్థాన్‌కు ఆ నదులు ప్రవహించకుండా భారత్‌ అడ్డుకున్నా అది ఐడబ్ల్యుటి ఉల్లంఘన కిందకు రాదు. సింధు నదీపరివాహక ప్రాంతం నాలుగుదేశాల– పాకిస్థాన్‌, భారత్‌, చైనా, అఫ్ఘానిస్తాన్‌–లో 1.14 మిలియన్‌ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నది. సింధు ఆయకట్టులో నివసిస్తున్న మొత్తం జనాభా 2025లో 320మిలియన్లు. 2050 సంవత్సరం నాటికి ఈ జనాభా 380 మిలియన్లకు పెరగవచ్చని అంచనా. ఈ జనాభాలో 110 మిలియన్‌ (35శాతం) భారత్‌లో ఉండగా 195 మిలియన్‌ (61శాతం) పాకిస్థాన్‌లో ఉన్నారు.


మిగతా 4శాతం మంది అఫ్ఘానిస్తాన్‌లో ఉన్నారు. చైనా పరిధిలో ఉన్న జనాభా సంఖ్య ఉపేక్షింపదగినది. పాకిస్థాన్‌ జనాభాలో 80 శాతం మంది, భారత్‌ జనాభాలో 8 శాతం మంది సింధు నదీపరివాహక ప్రాంతంలోనే నివసిస్తున్నారు. సింధు బేసిన్‌లో లభ్యమయ్యే మొత్తం ఉపరిత జలాల పరిమాణం 239 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్లు (బిసిఎమ్‌). ఇందులో తూర్పు నదుల నుంచి ప్రవహించేది 73.3 బిసిఎమ్‌లు. ఈ జలాలపై భారత్‌కు సంపూర్ణ హక్కులు ఉన్నాయి. వివిధ ప్రాకృతిక కారణాల వల్ల భారత్‌ ఈ జలాలను పూర్తిగా వినియోగించుకోలేకపోతోంది. కేవలం 46 బిసిఎమ్‌లను మాత్రమే వినియోగించుకోగలుగుతుంది. భారత్‌ తన అవసరాలకు తగ్గట్టుగా ఈ నీటిని వినియోగించుకోవచ్చు. అయితే కేవలం 16.3 బిసిఎమ్‌లను మాత్రమే నిల్వచేసుకోగల సామర్థ్యం మాత్రమే కలిగి ఉంది. మిగతా జలాలు పాకిస్థాన్‌లోకి ప్రవహిస్తున్నాయి. వాటిని నిలిపివేసే హక్కు భారత్‌కు ఉన్నది. అయితే వాటిని నిల్వ చేసుకునే సామర్థ్యం భారత్‌కు లేదు. పాకిస్థాన్‌కు కేటాయించిన పశ్చిమ నదుల నుంచి లభ్యమయ్యే సగటు నీటి సామర్థ్యం 165 బిసిఎమ్‌. ఐడబ్ల్యుటి ప్రకారం వాటిని సంపూర్ణంగా వినియోగించుకునే హక్కు పాకిస్థాన్‌కు ఉన్నది. తన భూభాగాల గుండా ప్రవహించే ఈ పశ్చిమ నదుల నీటిని మళ్లించేందుకుగానీ, నిల్వచేసుకునేందుకుగానీ భారత్‌కు హక్కు లేదు. ఐడబ్ల్యుటి ఇప్పటికే అంతర్జాతీయ అంశమయింది. పాకిస్థాన్‌ దాన్ని తన ప్రచారానికి, ఉగ్రవాదంపై చర్చను దారి మళ్లించేందుకు పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటుంది. సాయుధ సంఘర్షణ కాలంలో నదీజలాల పరిరక్షణ విషయమై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నిర్వహించిన ఒక సమావేశంలో భారత రాయబారి మాట్లాడుతూ సింధునది ఎగువ ప్రాంత దేశంగా భారత్‌ ఎల్లప్పుడూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ వస్తోందని పునరుద్ఘాటిస్తూ ఐడబ్ల్యుటి పీఠిక ప్రస్తావించిన ‘సుహృద్భావ, స్నేహ స్ఫూర్తిని పాకిస్థానే ఉల్లంఘించిందని విమర్శించారు. ఉగ్రవాదులు తుల్‌బుల్‌ నేవిగేషన్‌ ప్రాజెక్ట్‌పై కూడా దాడి చేశారని ఆయన పేర్కొన్నారు. పాక్‌ ప్రేరేపిస్తున్న ఉగ్రవాదుల వల్ల ఆ ప్రాజెక్ట్‌ భద్రతకు, ప్రజల ప్రాణాలకు రక్షణ కొరవడుతోందని భారత రాయబారి అన్నారు. అదే సమావేశంలో పాకిస్థాన్‌ ప్రతినిధి సైమా సలీమ్‌ మాట్లాడుతూ పాకిస్థాన్‌లో 24కోట్ల ప్రజలకు ప్రాణరక్షకంగా ఉన్న సింధుజలాల ప్రవాహానికి భారత్‌ అవరోధాలు కల్పిస్తోందని అంటూ, ‘నీరే ప్రాణం.


అది సమరాయుధం కానేకాదు’ అని వ్యాఖ్యానించారు. చెప్పవచ్చినదేమిటంటే ఐడబ్ల్యుటి భవిష్యత్తును న్యూఢిల్లీలో నిర్ణయించేందుకు ఆస్కారం లేనేలేదు. అంతర్జాతీయ వేదికలలోను లేదా అంతర్జాతీయ న్యాయస్థానంలో దానిపై విస్తృత చర్చల ద్వారా అది నిర్ణయమవుతుందనేది స్పష్టం. సింధు వివాదానికి ఇటువంటి పరిష్కారం కోసమే పాకిస్థాన్‌ సకల ప్రయత్నాలు చేస్తోంది. పహల్గాం ఉగ్రఘాతుకానికి మొదటి ప్రతిస్పందనగా సింధు నదీజలాల ఒప్పందం అమలును నిలిపివేస్తామని భారత్‌ ప్రకటించింది. 2016లో కూడా భారత్‌ ఇటువంటి హెచ్చరికే చేసింది. అయితే అప్పుడుగానీ, ఆ తరువాత గానీ ఏమీ జరగలేదు. తమ పోరాటం ఉగ్రవాదుల నిర్మూలనకేనని భారత్‌ పదేపదే చెప్పుతుండగా ఐడబ్ల్యుటి అమలును నిలిపివేయడం తమ ప్రజలను అకారణంగా శిక్షించడమేనని పాకిస్థాన్‌ ఆక్రోశిస్తోంది. ఆపరేషన్‌ సిందూర్‌ పూర్వాపరాలను ప్రపంచ దేశాల నాయకులకు వివరించేందుకు మోదీ సర్కార్‌ పంపించిన భారత పార్లమెంటరీ ప్రతినిధుల బృందాలు ఐడబ్ల్యుటి అమలు నిలిపివేత విషయంలో ఎదురైన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడంలో ఇబ్బందుల నెదుర్కొన్నాయి. అంతర్జాతీయ పర్యవసానాలను ఉపేక్షించి పాకిస్థాన్‌కు ప్రవహించే సింధు జలాలను నిలిపివేసేందుకు భారత్‌ దృఢంగా నిర్ణయించుకుందనే అనుకుందాం. ఆ నిర్ణయాన్ని అమలుపరచడం సాధ్యమవుతుందా? సింధునదిపై భారత ప్రభుత్వ నివేదిక ఒకటి ఇండస్‌ బేసినులో సగటు నీటి లభ్యత 73 బిసిఎమ్‌ (బిలియన్‌ క్యూబిక్‌ మీటర్లు) పేర్కొంది. ఉపయోగించుకోగల మొత్తం ఉపరితల జలాల లభ్యత 46 బిసిఎమ్‌ అని, ప్రస్తుత ‘లైవ్‌ స్టోరేజి కెపాసిటీ’ 16.3 బిసిఎమ్‌ అని ఆ నివేదిక పేర్కొంది. ఈ అంకెలు అన్నీ భారత్‌కు కేటాయించిన తూర్పు నదులకు సంబంధించినవి. లభ్యమయ్యే మొత్తం నీటిని పూర్తిగా నిల్వ చేసుకోవాలంటే భారత్‌ కనీసం భాక్రానంగల్‌ స్థాయి భారీ ప్రాజెక్టులు ఒకటి కాదు, రెండు కాదు, మూడు నిర్మించుకోవలసి ఉంటుంది.


కేవలం తూర్పు నదుల నుంచి నీరు పాకిస్థాన్‌కు ప్రవహించకుండా నిలిపివేసేందుకే అంత ఖర్చుచేయవలసి ఉంటుంది. మరి పశ్చిమ నదుల నుంచి లభ్యమయ్యే నీటిని సైతం పూర్తిగా నిల్వ చేసుకోవాలని భారత్‌ నిర్ణయించుకుంటే అందుకయ్యే వ్యయం అనేక రెట్లు అధికంగా ఉంటుంది. సింధు, దాని ఉపనదుల నుంచి ఒక్క చుక్క నీరు కూడా పాకిస్థాన్‌కు వెళ్లకుండా నిలిపివేసేందుకు భారత్‌ రాబోయే పదిసంవత్సరాల కాలంలో కనీసం 10,000 నుంచి 15,000 కోట్ల డాలర్లను వెచ్చించవలసి వస్తుంది. భారత ప్రభుత్వం పాకిస్థాన్‌కు జారీ చేస్తున్న హెచ్చరికలు దేశంలో ప్రజల మద్దతును మరింతగా సమీకరించుకోవడానికే కావచ్చు. కానీ, అవి పాకిస్థాన్‌ పాలకులకు బాగా తోడ్పడుతున్నాయి. వారు తమకు స్వదేశంలో భారత్‌కు వ్యతిరేకంగా మద్దతు కూడగట్టుకొనేందుకు అవి తోడ్పడుతున్నాయి. సింధు ఒప్పందం అమలును నిలిపివేయడం ద్వారా పాకిస్థాన్‌ను గట్టిగా శిక్షించినట్లయిందని కోట్లాది భారతీయులు భావిస్తున్నట్టుగానే, ఆ నీళ్ళు తమకు చేరకుండా భారత్‌ అడ్డుకుంటోందని ఇప్పటికే కోట్లాది పాకిస్థాన్‌ ప్రజలు విశ్వసిస్తూండవచ్చు. ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు సింధు వాహిని నిలిపివేస్తామని పదే పదే ప్రకటించడం సరైన వ్యూహం కాదు, కాబోదు. –భారత్‌ ప్రయోజనాలకు అదేమీ దోహదం చేయదు.

-బిక్షం గుజ్జా

అంతర్జాతీయ జలవిధాన నిపుణుడు

Updated Date - Jun 15 , 2025 | 04:18 AM