Share News

Jagan Vote Bank Politics: జగన్‌... నేరం... రాజకీయం

ABN , Publish Date - Jun 08 , 2025 | 01:12 AM

తన కోపమే తన శత్రువు అని పెద్దలు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏడాది క్రితం జరిగిన ఎన్నికల్లో అధికారం కోల్పోయిన జగన్మోహన్‌రెడ్డి ఇటు ప్రజల పైన, అటు రాజకీయ ప్రత్యర్థులపైన పట్టరాని కోపంతో రగిలిపోతున్నారు. ఆగ్రహావేశాలతో తాను ఏమి చేస్తున్నానో కూడా ఆయన మరచిపోతున్నారు.

Jagan Vote Bank Politics: జగన్‌... నేరం... రాజకీయం

తన కోపమే తన శత్రువు అని పెద్దలు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏడాది క్రితం జరిగిన ఎన్నికల్లో అధికారం కోల్పోయిన జగన్మోహన్‌రెడ్డి ఇటు ప్రజల పైన, అటు రాజకీయ ప్రత్యర్థులపైన పట్టరాని కోపంతో రగిలిపోతున్నారు. ఆగ్రహావేశాలతో తాను ఏమి చేస్తున్నానో కూడా ఆయన మరచిపోతున్నారు. ‘జగనన్న ఉండగా నేరస్తులు అందరికీ పండగే’ అన్న పథకాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళుతున్నట్టుగా ఉంది. అలా అని అతడిని తెలివి తక్కువవాడిగా భావించడానికి కూడా లేదు. రాష్ట్రంలో రాజకీయాలను మరో లెవల్‌కు తీసుకు వెళ్లే పనిలో జగన్‌ బిజీగా ఉంటున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా తెనాలిలో పేరు మోసిన ముగ్గురు నేరస్తులను పోలీసులు ఇటీవల నడిరోడ్డుపై చితకబాదారు. ఆ ముగ్గురూ దళితులు కావడంతో దొరకునా ఇటువంటి మహదావకాశం అన్నట్టుగా జగన్‌రెడ్డి ఆ ముగ్గురి కుటుంబాల పరామర్శకు వెళ్లారు. దీనిపై సామాన్య ప్రజల్లో ఆయనపై వ్యతిరేకత ఏర్పడింది. బాధితులు కరుడుగట్టిన నేరస్తులని తెలిసి కూడా పరామర్శకు పూనుకున్నారంటే... అందుకు జగన్‌రెడ్డి ఆలోచనలు, రాజకీయ ఎత్తుగడలు వేరే లెవల్లో ఉండటమే కారణం. సదరు నేరస్తులను పోలీసులు బహిరంగంగానే ప్రజల సమక్షంలో కొట్టడం చట్టరీత్యా నేరమే! ప్రజా కంటకులుగా మారిన నేరస్తులను బహిరంగంగా శిక్షించాలని గతంలో ప్రజలు కోరుకొనేవారు. అలా నేరస్తులను శిక్షించిన అధికారులకు బ్రహ్మరథం పట్టేవారు. ఈ కారణంగానే పలువురు పోలీసు అధికారులు నేరస్తుల పాలిట సింహస్వప్నంగా మారారు. అలాంటి అధికారుల ప్రేరణతో నిర్మించిన సినిమాలను కూడా ప్రజలు ఆదరించేవారు.


ఒకప్పుడు హైదరాబాద్‌లో కొత్త దాస్‌ అనే రౌడీ ఉండేవాడు. అతని ఆగడాలు మితిమీరడంతో పోలీసులు ఎన్‌కౌంటర్‌ పేరిట కాల్చి చంపారు. రెండు మూడు కేసులలో ప్రస్తుతం జైల్లో ఉన్న ఐపీఎస్‌ అధికారి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులును ఒకప్పుడు ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టుగా పిలిచేవారు. కరుడుగట్టిన నేరస్తులను కాల్చి చంపిన చరిత్ర ఆయనది. ప్రస్తుతం వైసీపీ ప్రధాన నాయకులలో ఒకరిగా చలామణి అవుతున్న లేళ్ల అప్పిరెడ్డిని గుంటూరు జిల్లా ఎస్పీగా ఉన్నప్పుడు ఆయన జిల్లా బహిష్కరణ చేశారు. ఒకప్పుడు ఇలాంటి అధికారులను హీరోలుగా ప్రజలు అభిమానించేవారు. ఇప్పుడు రోజులు మారాయి. ప్రజల్లో హక్కుల పట్ల చైతన్యం వచ్చింది. ఇది గుర్తించినందునే జగన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంపీ రఘురామ కృష్ణరాజును అర్ధరాత్రి పోలీసు కస్టడీలో అరికాళ్లు పగిలేలా కొట్టారు. ఇప్పుడు కాల క్రమంలో నేరస్తులకు, రాజకీయ నాయకులకు మధ్య తేడా అంతరించిపోతూ వస్తోంది. నేరస్తులకు అధికారం అందడంతో నిజాయితీగా పనిచేసిన పోలీసు అధికారులు కూడా తమ స్వభావాన్ని మార్చుకొని వారితో జత కట్టారు. ఈ మార్పు కారణంగానే పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు ఇప్పుడు జైలు జీవితం గడపాల్సి వస్తోంది. ఒకప్పుడు నేరస్తుల భుజంపై చేయి వేయాలంటే రాజకీయ నాయకులు భయపడేవారు. ఇప్పుడు వారి చుట్టూ నేరస్తులే ఉంటున్నారు. జగన్‌రెడ్డి తెనాలి పర్యటనను ఈ నేపథ్యంలోనే చూడాలి. తన ఓటు బ్యాంకును స్థిరీకరించుకొనే పనిలో భాగంగా నేరస్తుల కుటుంబాల పరామర్శకు జగన్‌రెడ్డి బయలుదేరారు. అయితే అంతిమంగా అది మంచి చేస్తుందా?, చెడుచేస్తుందా? అంటే ఇప్పుడే చెప్పలేం.


క్రిమినల్‌ పాలిటిక్స్‌...

పులివెందుల మార్క్‌ రాజకీయాలు రాష్ట్రంలోకి ప్రవేశించిన తర్వాత సంఘ విద్రోహ శక్తులకు, నేరస్తులకు రాజకీయాల్లోకి ఎంట్రీ లభించింది. వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో మొదలైన ఈ సంస్కృతి ఇప్పుడు స్వైర విహారం చేస్తోంది. ఒకప్పుడు వైఎస్‌ రాజారెడ్డి పులివెందులలో చిన్నా చితకా నేరస్తులను చేరదీసి తన బలం పెంచుకున్నారు. క్రమంగా కడప జిల్లాపై కూడా అంతో ఇంతో పట్టు సాధించారు. ఈ క్రమంలో ఆయన కుమారుడు రాజశేఖరరెడ్డి రాష్ట్ర రాజకీయాలలోకి ప్రవేశించారు. కాంగ్రెస్‌ పార్టీలో తనకంటూ ఒక బలమైన వర్గాన్ని తయారుచేసుకునేందుకు దౌర్జన్యాలకు పాల్పడే వారిని, హత్యా నేరాలకు పాల్పడే వారిని చేరదీశారు. రాజారెడ్డి ముఠా నాయకుడిగా జిల్లా స్థాయిలో విస్తరించగా, రాజశేఖరరెడ్డి రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్‌ నాయకుడిగా ఎదిగారు. ‘కడప పాలెగాళ్లు’ పేరిట పౌర హక్కుల సంఘం వాళ్లు ప్రచురించిన పుస్తకంలో వైఎస్‌ కుటుంబం గురించి వివరించారు. రాజశేఖరరెడ్డి 1984లో పీసీసీ అధ్యక్షుడైన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో వివిధ జిల్లాలలో రౌడీ నేపథ్యం ఉన్న వారిని చేరదీసి ‘కాంగ్రెస్‌ నాయకుడు’ అనే హోదా ఇప్పించారు. అలాంటి వారందరికీ రాజశేఖరరెడ్డి ఆరాధ్య దైవం అయ్యారు. తనను నమ్మిన వాళ్ల కోసం రాజశేఖరరెడ్డి ఎంత దూరమైనా వెళతారు, మాట తప్పరు–మడమ తిప్పరు అని ప్రచారం చేయించుకున్నారు. ఈ ప్రచారం పతాక స్థాయికి చేరడంతో పులివెందుల మార్కు రాజకీయం వల్ల దీర్ఘకాలంలో రాష్ర్టానికి జరిగిన నష్టాన్ని ప్రజలు గ్రహించలేకపోయారు. రాజశేఖరరెడ్డి పట్ల అభిమానాన్ని పెంచుకున్నారు. రాజశేఖరరెడ్డి పెంచి పోషించిన రౌడీలు, ఫ్యాక్షనిస్టులు ఇప్పుడు వైసీపీలో ప్రముఖులుగా ఎదిగారు.


ఒక హత్య కేసులో శిక్ష పడి జైలుకు వెళ్లి వచ్చిన గౌరు వెంకటరెడ్డిని తన పాదయాత్ర సందర్భంగా రాజశేఖరరెడ్డి పరామర్శించారు. అప్పట్లో ఇదొక సంచలనం. ఇప్పుడు నాయకుడంటే అలాగే ఉండాలని అనుకుంటున్నారు. చంద్రబాబు అలా ఉండటం లేదని విమర్శిస్తున్నారు. 2004లో అధికారంలోకి వచ్చిన రాజశేఖరరెడ్డి... గౌరు వెంకటరెడ్డికి శిక్ష తగ్గింపచేసి జైలు నుంచి విడుదల చేయించారు. ఈ మోడల్‌ను ఇప్పుడు జగన్మోహన్‌రెడ్డి మరింత వికృత రూపంలో అమలు చేస్తున్నారు. డాక్టర్‌ చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్‌లో జరిగిన మత ఘర్షణల వెనుక రాజశేఖరరెడ్డి ఉన్నారని అప్పట్లోనే ముఖ్యమంత్రి మద్దతుదారులు ఆరోపించారు. ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వంగవీటి రంగా హత్య జరిగింది. దీంతో కోస్తా జిల్లాల రాజకీయాల్లోకి రాజశేఖరరెడ్డి ప్రవేశించారు. రెండు కుటుంబాల మధ్య జరిగిన గొడవలను రెండు కులాల మధ్య అంతరం సృష్టించడానికి వాడుకున్నారు. హత్యకు గురైన రంగా విగ్రహాలను అప్పట్లో పలు జిల్లాల్లో ఏర్పాటు చేయించారు. దీంతో ఆ సామాజికవర్గంలో తన పరపతి, పట్టు పెంచుకున్నారు. కాపు, కమ్మ కులాల మధ్య అప్పుడు రగిలించిన విద్వేషపు చిచ్చు ఇప్పటికీ ఆరిపోలేదు. ఈ క్రమంలో రాజకీయాలలో పెద్ద మనుషులుగా చలామణి అయిన వారు తెర మరుగై, నేర నేపథ్యం ఉన్నవాళ్లు ఆ స్థానాల్లోకి చేరుకున్నారు.


విగ్రహ రాజకీయం...

రాజశేఖరరెడ్డి మరణానంతరం జగన్మోహన్‌రెడ్డి కూడా తండ్రి విగ్రహాలను ఊరూ వాడా ఏర్పాటు చేయించారు. రాజశేఖరరెడ్డిని మహానేతగా శ్లాఘింపజేశారు. రాజశేఖరరెడ్డి నాటిన విష బీజాల వల్ల కొన్ని వర్గాలవారు వైసీపీకి అండగా నిలిచారు. తండ్రి వేసిన బాటను తనయుడు జగన్‌రెడ్డి విస్తరించారు. అధికారంలో ఉన్నప్పుడు నేర నేపథ్యం ఉన్న వాళ్లను అందలం ఎక్కించారు. జగన్‌ మనస్తత్వం గుర్తించిన ఇతరులు కూడా అదే దారి ఎంచుకున్నారు. ఫాక్షన్‌ గొడవలకు పేరు మోసిన పల్నాడు ప్రాంతంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వంటి వారిని చేరదీశారు. శ్రీకాకుళం లాంటి జిల్లాలో సీదిరి అప్పలరాజు, దువ్వాడ శ్రీనివాస్‌లాంటి వారిని రాజకీయాల్లో ఎప్పుడైనా చూశామా? మండలి వెంకటకృష్ణారావు, కేఎల్‌ రావు, పిన్నమనేని కోటేశ్వరరావు వంటి వారు ప్రాతినిధ్యం వహించిన కృష్ణా జిల్లాలో వల్లభనేని వంశీ, కొడాలి నాని వంటి వారిని ప్రోత్సహించారు. అమరావతి ప్రాంతంలో నందిగం సురేశ్‌ వంటి వారు పుట్టుకొచ్చారు. బోరుగడ్డ అనిల్‌ వంటి వారు గతంలో రాజకీయాల్లో ఉండేవారా? అలాంటి వాళ్లను నాయకులు ఎప్పుడైనా ప్రోత్సహించారా? జగన్‌రెడ్డి మాత్రమే ఆ పని చేయగలిగారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు విభజిత ఆంధ్రప్రదేశ్‌లో అసాంఘిక శక్తులకు బలం చేకూరిందంటే అందుకు జగన్‌రెడ్డి కారణం. అందరిదీ ఒకటే స్కూల్‌– ఒకటే సిలబస్‌! తాము ఆరాధించే నాయకుడి కోసం నేరాలు చేయడం! అవసరమైతే జైలుకు వెళ్లడం తమకు లభించిన అదృష్టంగా ఈ అసాంఘిక శక్తులు భావించే పరిస్థితి ప్రస్తుతం ఉంది. అందుకే ఇప్పుడు జైలుకు వెళ్లిన వారిలో కనీస పశ్చాత్తాపం కనిపించడం లేదు.


మారిన రోజులు...

గాంధేయవాదిగా పేరు తెచ్చుకున్న మండలి వెంకట కృష్ణారావు... సొంత సామాజికవర్గానికి చెందిన రంగాను దూరం పెట్టారు. ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్న వారిలో పేర్ని కృష్ణమూర్తి ఒకరు. ఆయన తనయుడు పేర్ని నాని ఇలా వ్యవహరిస్తారని, ఇలా మాట్లాడతారని ఎవరైనా ఊహించారా? ఒకప్పుడు రాయలసీమలోని కొన్ని ప్రాంతాలకే పరిమితమైన పాలెగాళ్ల సంస్కృతి ఇప్పుడు రాష్ట్రమంతా విస్తరించింది. బొడ్డెపల్లి రాజగోపాల్‌ నాయుడు, సర్దార్‌ గౌతు లచ్చన్న వంటి వాళ్లు ఉండిన శ్రీకాకుళం జిల్లాలో కూడా ఇప్పుడు పాలెగాళ్ల సంస్కృతి ప్రవేశించిందంటే, అందుకు వైఎస్‌ కుటుంబం కారణం కాదా? సామాజిక సమీకరణాల పేరిట దళితులు, ఇతర బడుగు వర్గాలలోని అసాంఘిక శక్తులను గుర్తించి, ప్రోత్సహించడంలో ఇప్పటికీ జగన్‌రెడ్డిని మించినవారు లేరు. గోరంట్ల మాధవ్‌ పోలీసు ఇన్‌స్పెక్టర్‌గా ఉన్నప్పుడు ఒక ప్రభుత్వ ఉద్యోగిని లాఠీతో బహిరంగంగా కొట్టుకుంటూ తీసుకెళ్లారు. అలాంటి వ్యక్తిని గుర్తించిన జగన్‌ ఎంపీ సీటు ఇచ్చి ప్రోత్సహించడం దేనికి సంకేతం? జగన్‌ చుట్టూ ఇప్పుడు ఇలాంటి వారే. అందుకే జైలుకు వెళ్లి వచ్చినా వారిలో మార్పు రావడం లేదు, వెరపు ఉండటం లేదు. రాష్ట్రంలో నేర చరిత్ర ఉన్న వారిని గుర్తించి రాజకీయం ముసుగులోనో, నమ్మిన వాళ్లకు అండగా ఉంటాడనే ముసుగులోనో వాళ్లను చేరదీయడం, పెంచి పోషించడం, తన చేతికి మట్టి అంటకుండా వారిని వాడుకోవడం వైఎస్‌ కుటుంబానికి వెన్నతో పెట్టిన విద్య. అధికారం కోల్పోయినప్పుడు శాంతిభద్రతల సమస్యలు సృష్టిస్తారు. కులాల మధ్య కుంపట్లు రగిలిస్తారు. రాజశేఖరరెడ్డికి అధికారం అందే వరకు కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నాయకులు కూడా ఈ కుటుంబం కుతంత్రాలను తట్టుకోలేకపోయారు. ఇప్పుడు జగన్‌రెడ్డి అధికారాన్ని కోల్పోయారు. ఎటువంటి కుతంత్రాలకు తెరలేపుతారో చూడాలి. అధికారంలో ఉన్నప్పుడు డాక్టర్‌ సుధాకర్‌ను మానసికంగా వేధించి ఆత్మహత్య చేసుకొనే వరకు వేటాడారు. డ్రైవర్‌ సుబ్రమణ్యాన్ని హత్య చేసి డోర్‌ డెలివరీ చేశారు. వరప్రసాద్‌కు శిరోముండనం చేశారు. వీరంతా దళితులే. డ్రైవర్‌ సుబ్రమణ్యాన్ని హత్య చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ అనంతబాబును జగన్‌రెడ్డి దూరం పెట్టకపోవడం గమనార్హం.


తెనాలిలో నేర నేపథ్యం ఉన్న వారిని పోలీసులు బహిరంగంగా శిక్షించడంపై గుండెలు బాదుకుంటున్న జగన్‌రెడ్డి, డాక్టర్‌ సుధాకర్‌కు ఏ నేర నేపథ్యం ఉందో చెబుతారా? డ్రైవర్‌ సుబ్రమణ్యం చేసిన పాపం ఏమిటి? వారు కూడా దళితులే కదా? అని అప్పుడెందుకు అనిపించలేదు? జగన్‌ తెనాలి పర్యటన వల్ల తటస్థ ఓటర్లలో తన పట్ల వ్యతిరేకత ఏర్పడే అవకాశం ఉందని జగన్‌కు తెలియదని అనుకోగలమా? ఓటు బ్యాంకును భద్రపరుచుకొనే పనిలోనే ఇలాంటి ఎత్తుగడలకు ఆయన పాల్పడుతుంటారు. జగన్‌ పాలనలో ఎంతో మంది దళితులపై దాడులు జరిగాయి. అయినా మెజారిటీ దళితులు, క్రైస్తవులు ఆయన వెంటే ఎందుకు నిలబడ్డారు? అంటే, జగన్‌ ఆడుతున్న జగన్నాటకం వల్లనే. తెనాలిలో రౌడీ షీటర్లకు మద్దతుగా అధిక శాతం దళితులు నిలబడ్డారు. డాక్టర్‌ సుధాకర్‌, డ్రైవర్‌ సుబ్రమణ్యం వంటి మంచివాళ్ల కోసం అదే దళితులు ఎందుకు నిలబడలేదు? ఈ సైకాలజీని ఒడిసిపట్టుకున్న జగన్‌రెడ్డి వారిని కవచంలా వాడుకుంటున్నారు. జీసస్‌ తర్వాత తమ దైవం జగన్‌రెడ్డి అని క్రైస్తవులు భావించే పరిస్థితి కల్పించారు. వారిని అలా మార్చడంలో కూడా జగన్‌రెడ్డి వ్యూహం దాగి ఉంది. దళితులు కూడా జగన్‌ మనవాడు అని భావిస్తున్నారు. అందుకే జగన్‌ అధ్వానపు పరిపాలనను ఈ రెండు వర్గాల వారు పట్టించుకోలేదు. రెడ్లు, ముస్లింలు వివిధ కారణాల వల్ల జగన్‌కు మద్దతుగా ఉంటున్నారు. ఈ వర్గాల్లో ఇప్పుడిప్పుడే మార్పు వస్తోంది. కుల, మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టగలిగితే అభివృద్ధి, సంక్షేమాలకు అతీతంగా ఎన్నికల ఫలితాలు ఉంటాయని జగన్‌రెడ్డి నమ్ముతున్నారు. అందుకే కొన్ని కులాలను ఇతర కులాలకు శత్రువుగా చిత్రీకరించే పని చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు కమ్మ, కాపు కులాలను టార్గెట్‌ చేసుకున్నారు. తమ రాజకీయ అధికారానికి అడ్డు వచ్చే వాళ్లు దళితులైనా, క్రైస్తవులైనా, రెడ్లైనా, ముస్లింలైనా ఆ కుటుంబం క్షమించదు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తోంది. ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ల వ్యవధి ఉంది. అయినా ‘మేం అధికారంలోకి వచ్చాక మీకు ఉంటుందిరా!’ అని వైసీపీలోని కింది స్థాయి వాళ్లు కూడా తొడ గొడుతున్నారంటే కేసులు – జైళ్లు అంటే వారికి భయం లేకపోవడమే కారణం.


నేరస్తుల్లో భయం ఉండాలి...

కేసులు ఉన్నవారు ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులు. అలాగే... రౌడీషీటర్లు, గంజాయి వ్యాపారం చేసేవాళ్లు, ఇతర నేరాలకు పాల్పడినవాళ్లు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అనర్హులని కూటమి ప్రభుత్వం ఎందుకు ప్రకటించకూడదు? ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఒక్క రాజకీయ పార్టీ కూడా వ్యతిరేకించలేదు. రాష్ట్రంలో కూడా ఈ విధానాన్ని అమలు చేస్తే జగన్‌రెడ్డి వ్యతిరేకించగలరా? నేరస్తులకు అండగా నిలబడగలరా? ఇలాంటి చర్యల తర్వాత నేర స్వభావం ఉన్న వారి సంఖ్య తగ్గుముఖం పట్టదా? జగన్‌రెడ్డి పరిస్థితి కుడితిలో పడిన ఎలుకలా తయారవ్వదా? జగన్‌రెడ్డి మోడల్‌ రాజకీయాల నుంచి రాష్ర్టాన్ని బయటపడెయ్యడంతో పాటు యువతను సన్మార్గం వైపు నడిపించగల విప్లవాత్మక నిర్ణయాలకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టాలి. కేసులలో ఇరుక్కుంటే తమ పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాలు లభించవు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందవు అన్న భయం కల్పించగలిగితే అందరూ దారిలోకి వస్తారు. లేని పక్షంలో జగన్‌రెడ్డి వంటి వారి అండ చూసుకొని ఇంటికో రౌడీ తయారవుతాడు. అదే జరిగితే రాష్ట్రం ఏమవుతుందో ఊహించగలమా?


అధికారమే ఆయన లక్ష్యం..

రాష్ట్రం పట్ల, సమాజం పట్ల జగన్‌రెడ్డికి ఏ బాధ్యతా ఉండదు. ఆయనకు కావాల్సింది అధికారం మాత్రమే. అధికారం అండతో రాష్ట్ర సంపదను దోచుకొని పొరుగున ఉన్న బెంగళూరు, చెన్నైతో పాటు దుబాయ్‌లో ఆస్తులు సమకూర్చుకోవడమే వారికి కావాల్సింది. ఇందుకోసం ఎంతకైనా తెగిస్తారు. రాష్ట్రంలో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో తెలుగుదేశం, వైసీపీలకు చెరో 40 శాతం ఓట్లు ఉన్నాయి. 2019కి పూర్వం చంద్రబాబు ప్రభుత్వంపై ఎంతగా విష ప్రచారం చేసినా, ఎన్ని కులాలను దూరం చేసినా తెలుగుదేశం పార్టీకి 40 శాతం ఓట్లు వచ్చాయి. జగన్‌రెడ్డి పాలన ఎంత అరాచకంగా సాగినా 2024లో ఆయనకు కూడా 40 శాతం ఓట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో కూటమిలో మనస్పర్థలు సృష్టించే ప్రయత్నాలను కూడా జగన్‌రెడ్డి చేస్తున్నారు. జగన్‌ మళ్లీ అధికారంలోకి వస్తే పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో తెలుసు కనుకే ఎవరు ఎన్ని కుట్రలకు పాల్పడినా కూటమి భాగస్వామ్య పక్షాలు అపోహలకు తావు లేకుండా జాగరూకతతో వ్యవహరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ను అభినందించాలి. కింది స్థాయిలో కూటమి కార్యకర్తల మధ్య విభేదాలు ఉన్న మాట వాస్తవం. అయితే అవి రాష్ట్ర స్థాయిలో లేకపోవడం శుభ పరిణామం. మళ్లీ అధికారంలోకి వస్తే తన పరిపాలన ఎలా ఉంటుందో జగన్‌రెడ్డి చెబుతూనే ఉన్నారు. దీంతో సామాన్య ప్రజలతోపాటు కూటమి నాయకులు కూడా వణికిపోతున్నారు. వయసులో ఉన్నప్పుడు తెలిసో తెలియకో తప్పులు చేస్తారని జగన్‌రెడ్డి చెప్పడం ఆయన నైజానికి నిదర్శనం. ఆయన పిల్లలు కూడా చిన్న వయసులోనే ఉన్నారు. అలా అని వారు తప్పు చేస్తే జగన్‌రెడ్డి సహిస్తారా? దళితుల అవసరం తనకు ఉంది కనుక వారు మాత్రమే నేరాలు చేయాలి, శాశ్వతంగా తనపై ఆధారపడాలని జగన్‌రెడ్డి కోరుకుంటున్నారు. అందుకే రాష్ట్రంలో కుల, మతోన్మాదుల సంఖ్య పెరగాలని ఆయన కోరుకుంటున్నారు. ఇందుకోసం ఏం చేయడానికైనా, ఎంతకైనా తెగిస్తారు. జగన్‌రెడ్డి రాజకీయాన్ని విజ్ఞత ఉన్నవాళ్లు సమర్థించరు.


ఓట్ల కోసం...

గత ఎన్నికల్లో కూటమికి, వైసీపీకి మధ్య ఓట్ల తేడా 16 శాతం ఉండింది. కూటమి అధికారంలో ఉన్నందున ఈ తేడా క్రమంగా తగ్గే అవకాశం ఉంది. జగన్‌రెడ్డి నమ్మకం కూడా అదే. ఏడెనిమిది శాతం ఓట్లు పెంచుకోగలిగితే 2029లో అధికారం తమదేనని వైసీపీ నాయకులు ధీమాగా ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో, ఆ తర్వాత కూడా పులివెందుల రాజకీయాల వల్ల పలుమార్లు శాంతిభద్రతలకు విఘాతం కలిగింది. అందుకు కారణమెవరని తెలుసుకొనే తీరిక, ఓపిక ప్రజలకు ఉండవు. అధికారంలో ఉన్న వారినే నిందిస్తారు. ఇప్పుడు మళ్లీ రాష్ట్రంలో శాంతిభద్రతలకు భంగం కలిగించే కుట్రలకు తెర లేపే అవకాశం లేకపోలేదు. కుల విద్వేషాలను రగిలించడం వల్ల రాష్ట్రం వల్లకాడు అవుతుంది. అయినా రాష్ట్రం గురించి, పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించలేని స్థితికి ప్రజలను తీసుకువెళ్లడమే ‘పులివెందుల మోడల్‌!’ జగన్‌ హయాంలో లిక్కర్‌ అమ్మకాల్లో ఎంత గోల్‌మాల్‌ జరిగిందో, అందులో భాగస్వాములైన వారికే కాకుండా ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు ఈ కేసులో సిట్‌ అధికారులు పలువురిని జైలుకు పంపారు. అయినా, జగన్‌కు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వడానికి ఎవరికి వారు భయపడుతున్నారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి నుంచి ప్రాణహాని ఉంటుందని నిందితులు భయపడటం ఎక్కడైనా విన్నామా? కన్నామా? దటీజ్‌ జగన్‌రెడ్డి! హత్యలు చేయించడం, ఆ హత్యలు చేసిన వారిని ఆ తర్వాత తుదముట్టించడంలో ఆ కుటుంబం ఆరితేరింది. గతంలో ఏం జరిగిందో తెలుసు కనుకే జగన్‌కు వ్యతిరేకంగా ఒక్కరు కూడా నోరు విప్పలేకపోతున్నారు. వైసీపీ నాయకులలో కూడా ఈ భయం ఉంది. అందుకే ఎవరినైనా పక్కనబెట్టినా జగన్‌కు వ్యతిరేకంగా నోరు విప్పి విమర్శలు చేయలేక పోతున్నారు. ఈ వింత పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే సొంతం. గతంలో అనేక మంది తమ నాయకులతో విభేదించే వారు. ఇలా భయపడిన సంఘటనలు మాత్రం లేవు. నిందితులను మాత్రమే కాకుండా సొంత పార్టీ నాయకులను, చివరకు ప్రజలను కూడా భయపెట్టగలుగుతున్న జగన్‌రెడ్డిని ఎలా అర్థం చేసుకోవాలి? నేరస్తులకు రాజకీయాల్లో చోటు ఉండదని ఒకప్పుడు అనేవాళ్లు. ఇప్పుడు నేరస్తులే రాజకీయాలను శాసిస్తున్నారు. ఇదొక విషాదం!

Updated Date - Jun 08 , 2025 | 08:48 AM