1975 World Cup: యాభైయ్యేళ్ల ప్రుడెన్షియల్ కప్
ABN , Publish Date - Jun 06 , 2025 | 02:19 AM
అది జూన్ 7వ తేదీ 1975. లండన్లో క్రికెట్ ప్రపంచానికి మక్కాగా కొనియాడబడే లార్డ్స్ మైదానంలో ఉదయం పది గంటలకు భారత మీడియం పేసర్ మదన్లాల్, ఇంగ్లండ్ ఓపెనింగ్ బ్యాట్స్మన్ జాన్ జేమ్సన్కు తొలి బంతిని విసిరాడు.

అది జూన్ 7వ తేదీ 1975. లండన్లో క్రికెట్ ప్రపంచానికి మక్కాగా కొనియాడబడే లార్డ్స్ మైదానంలో ఉదయం పది గంటలకు భారత మీడియం పేసర్ మదన్లాల్, ఇంగ్లండ్ ఓపెనింగ్ బ్యాట్స్మన్ జాన్ జేమ్సన్కు తొలి బంతిని విసిరాడు. అర్ధ శతాబ్దం క్రితం వేసిన ఆ తొలి బంతి, రెండవ బంతికి బ్యాట్స్మన్ తీసిన తొలి పరుగు ప్రపంచ కప్ క్రికెట్ చరిత్రలో ఒక నూతన అధ్యాయానికి తెర లేపాయి. జూన్ 1975లో ఇంగ్లండ్ వేదికగా జరిగిన ప్రథమ క్రికెట్ ప్రపంచ కప్ టోర్నమెంట్--– ప్రుడెన్షియల్ కప్ పోటీగా కూడా ప్రసిద్ధమైంది. ఆ టోర్నమెంట్లో తొలి మ్యాచ్ ఇంగ్లండ్–ఇండియాల మధ్య జరిగింది. క్రికెట్ చరిత్రను మలుపు తిప్పిన ఆ టోర్నమెంట్కు ఏభై ఏళ్ళు నిండిన సందర్భంగా దాని విశేషాలను ఒక్కసారి సింహావలోకనం చేసుకోవలసిన అవసరం ఉంది. ఈఎస్పిఎన్, క్రిక్ఇన్ఫోలో ‘ది బర్త్ ఆఫ్ ది వరల్డ్ కప్’ వ్యాసంలో మార్టిన్ విలియమ్సన్ 1975 ప్రుడెన్షియల్ క్రికెట్ ప్రపంచ కప్ పోటీల నేపధ్యాన్ని చక్కగా వివరించాడు. 1972 లోనే ఐసీసీ వార్షిక సమావేశంలో ప్రపంచ కప్ పోటీల ప్రతిపాదన సాధ్యాసాధ్యాలు పరిశీలించడానికి నియమితమైన కమిటీ, అప్పటికి క్రికెట్ సంబంధాలు లేని భారత్, పాకిస్థాన్ల అంగీకారం లభించగానే పనులు మొదలుపెట్టింది. ఆ సమావేశంలోనే టెస్ట్ అండ్ కౌంటీ క్రికెట్ బోర్డు (టీసీసీబీ) టెస్ట్ క్రికెట్లో అనధికార హోదా కలిగిన శ్రీలంకను, నాలుగు తూర్పు ఆఫ్రికా దేశాలైన ఉగాండా, కెన్యా, టాంజానియా, జాంబియాల సంయుక్త జట్టైన తూర్పు ఆఫ్రికాను పోటీలో భాగస్వాములను చేయడానికి నిర్ణయించింది. ఈ నిర్ణయంతో ఎనిమిది దేశాలు టోర్నమెంట్లో పాల్గొనడానికి మార్గం సుగమమయ్యింది. ఈ టోర్నమెంట్కు ‘ప్రుడెన్షియల్ అష్యురెన్స్’ (ఆర్థిక సేవల సంస్థ) లక్ష పౌండ్ల ఆర్థిక సహాయాన్ని చేసి ప్రాయోజిత సంస్థగా వ్యవహరించింది. టోర్నమెంట్ వల్ల ఆదాయం రెండు లక్షల పౌండ్లు రాగా, ఒక్క ఫైనల్ మ్యాచ్ నుంచే అరవై ఆరు వేల పౌండ్ల లాభం వచ్చింది. మ్యాచ్ నిడివి 60 ఓవర్లు కాగా, బాట్స్మన్ తల పైనుండి దూసుకువెళ్ళే బంతి వైడ్గా పరిగణించాలన్న నిబంధనలు జోడించబడ్డాయి. అప్పటికింకా పిచ్కు ముప్పయ్ గజాల లోపు ఫీల్డర్ల సంఖ్యపై ఆంక్షలు లేవు.
మొదటి మ్యాచ్లో ఇంగ్లండ్– భారత్ తలపడ్డాయి. ఎస్. వెంకటరాఘవన్, మైక్ డెన్నిస్ కెప్టెన్లు. లక్షలాది భారత క్రికెట్ అభిమానులు బీబీసీ రేడియో కామెంట్రీకి చెవులనప్పగించారు. ఇంగ్లండ్ భారీ స్కోర్ (334–4)లో డెన్నిస్ అమిస్ ప్రపంచ కప్ తొలి శతకాన్ని (137) నమోదు చేసాడు. సమాధానంగా భారత జట్టు 60 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసి ఘోరంగా ఓడిపోయింది. ఈ ఓటమికి తోడు భారత దిగ్గజ బాట్స్మన్ సునీల్ గవాస్కర్ 174 బంతులతో 36 పరుగులే చేసి ఓటమికే మచ్చ తెచ్చాడు. భారత ప్లేయర్లే కాక ప్రేక్షకులు, ఇతర దేశాల ప్లేయర్లు కూడా అతని విచిత్ర వైఖరికి విస్తుబోయారు. తనకు కెప్టెన్సీ దక్కలేదన్న ఉక్రోషంతోనే ఆ విధంగా బ్యాటింగ్ చేసాడనే విమర్శ క్రీడాప్రపంచంలో మారుమోగింది. న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో కూడా భారత్ పేలవంగా ఆడి ఓడింది. పసికూనలయిన ఈస్ట్ ఆఫ్రికాపై మాత్రం విజయం సాధించింది. రౌండ్ రాబిన్ పద్ధతిలో జరిగిన ఈ పోటీ నుంచి సెమీఫైనల్కు చేరకుండానే భారత్ నిష్క్రమించింది. జూన్ 7 నుంచి 21 వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ టోర్నమెంట్లో వెస్టిండీస్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, ఇంగ్లండ్, న్యూజిలాండ్ హోరాహోరీగా పోరాడాయి. బాహుబలుల్లాంటి బ్యాట్స్మెన్లైన క్లైవ్ లాయిడ్, కాళీచరణ్, కన్హాయ్, ఫ్రెడ్రిక్స్, గ్రెగ్ ఛాపెల్, ఇయాన్ ఛాపెల్, డెన్నిస్ అమిస్, టోనీ గ్రెయిగ్, మజీద్ ఖాన్, అసిఫ్ ఇక్బాల్, జహీర్ అబ్బాస్, గ్లెన్ టర్నర్లు; బడబాగ్నుల్లాంటి ఆండీ రాబర్ట్స్, డెనిస్ లిల్లీ, జెఫ్ థామ్సన్, గిల్మోర్, రిచర్డ్ హ్యాడ్లీ, సర్ఫరాజ్ నవాజ్, జాన్ స్నోలు; స్పిన్ మాంత్రికులైన గిబ్స్, బేడీ, అండర్వుడ్లు; అలాగే వికెట్ కీపర్లైన రాడ్నీ మార్ష్, డెరెక్ మర్రే, వసీం బారి, అలెన్ నాట్లు తమ ప్రతిభా పాటవాలతో క్రికెట్ ప్రపంచాన్ని అలరించారు. ఐదు రోజుల టెస్ట్ నుంచి ఒక రోజు పరిమిత ఓవర్ల మ్యాచ్ వైపు ప్రస్థానానికి తొలి మెట్టయిన ఈ టోర్నమెంట్ను ప్రత్యక్షంగా లక్ష ఏభై ఆరు వేల మంది తిలకించగా, టీవీ– రేడియోల ద్వారా కన్నవారు, విన్నవారు కనీసం కోటి మంది ఉంటారని కొన్ని వర్గాల అంచనా.
జూన్ 21న లార్డ్స్లో అంతిమ విజయం కోసం వెస్టిండీస్, ఆస్ట్రేలియా కొదమసింహాల్లా తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ త్వరితగతినే మూడు వికెట్లు కోల్పోగా, కళ్లజోడు ధరించిన కెప్టెన్ క్లైవ్ లాయిడ్ ప్రళయకాల రుద్రుడిలా విజృంభించి 85 బంతుల్లో 102 పరుగులు చేసి నాయకత్వ పటిమను రుజువు చేసుకున్నాడు. అతను లిల్లీ బౌలింగ్లో హుక్ చేసిన సిక్సర్ను నేటికీ క్రికెట్ అభిమానులు మరచిపోలేదు. 291 పరుగుల లక్ష్యంతో దిగిన ఆస్ట్రేలియా బాట్స్మన్లు విజయం వైపు దూసుకువెళుతున్న ప్రతిసారి రిచర్డ్స్ గురిచూసి విసిరిన బంతులు వికెట్లను తాకి రనౌట్ కావడం ఆ జట్టు దురదృష్టానికి తార్కాణం. చివరి వరకూ థామ్సన్–లిల్లీలు పోరాడినా, 17 పరుగుల తేడాతో ఓటమి తప్పలేదు. ఆ మ్యాచ్ జరుగుతున్నంత సేపూ ప్రేక్షకుల్లో నల్లజాతి వారి ఆనందానికి హద్దులు లేవు. లాయిడ్ అవుట్ అయి వెనుదిరుగుతుంటే యావత్ ఆస్ట్రేలియా ఆటగాళ్లు చప్పట్లతో ఆయనను అభినందించారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన మ్యాచ్ రాత్రి 8.43 గంటలకు ముగిసింది. సంవత్సరంలో అత్యంత సుదీర్ఘ పగటికాలం నాడు (జూన్ 21) క్రికెట్ చరిత్రలో అత్యంత సుదీర్ఘమైన మ్యాచ్ జరగడం విశేషమే. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా, విజేత జట్టు కెప్టెన్గా ఆరడుగుల మూడించుల గ్రానైట్ విగ్రహం లాంటి క్లైవ్ లాయిడ్, ప్రిన్స్ ఫిలిప్ నుంచి అందుకున్న ట్రోఫీని పైకెత్తి చూపుతుంటే లార్డ్స్ మైదానంలో ఉన్న 26 వేల మంది ప్రేక్షకులే కాక, టీవీ–రేడియోల ద్వారా మ్యాచ్ను ఆస్వాదించిన లక్షలాది క్రికెట్ అభిమానులు పులకించిపోయారు. ఆ టోర్నమెంట్లో ఆడిన ఎందరో హేమాహేమీలు నేటికీ జీవించి ఉన్నారు. వారిలో వెస్టిండీస్ స్పిన్నర్ లాన్స్ గిబ్స్ అందరికంటే పెద్దవాడు(90) కాగా, ఆ టోర్నమెంట్లో తొలిసారి ఆడిన 18 ఏళ్ల మియాందాద్ అత్యంత పిన్న వయస్కుడు. క్రికెట్ దశ దిశలను మార్చిన ఆ టోర్నమెంట్లో పాల్గొన్నందుకు వారంతా గర్విస్తారు. ఆ పోటీల విశేషాలను, వ్యాసాలను క్రికెట్ అభిమానులు స్పోర్ట్స్ వీక్, నైట్ వాచ్మాన్, క్రికెట్ క్వార్టర్లీ, ది ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా లాంటి పత్రికల నుంచే కాక, దినపత్రికల నుంచి సంగ్రహించి భద్రపరచుకున్నారు. ఇప్పటికీ ఆ తరంవారు యూట్యూబ్లో ఆ మ్యాచ్లను వీక్షించి మురిసిపోతుంటారు. ఇంతింతై వటుడింతై అన్నట్లు వ్యాపార, ప్రతిభ, సాంకేతికతల పరంగా క్రికెట్ ఎంత విస్తరించినా, ఎదిగినా అసలు సిసలైన క్రికెట్ అభిమానుల గుండెల్లో గూడు కట్టుకుని మథుర స్మృతిగా మిగిలింది 1975 ప్రుడెన్షియల్ కప్ పోటీ మాత్రమే.
- కొట్టు శేఖర్ ప్రొఫెసర్
మిజోరాం యూనివర్సిటీ