Share News

Elderly Parents: చట్టం ఉన్నా.. వృద్ధులపై ఆగని వేధింపుల

ABN , Publish Date - Jun 14 , 2025 | 03:05 AM

పిల్లలను కని, పెంచి వారు ప్రయోజకులుగా ఎదగడానికి సర్వశక్తులు ధారపోసిన తల్లిదండ్రులను జీవిత చరమాంకంలో ఆ పిల్లలే వారిని అవమానిస్తూ, నిత్యం వేధింపులకు గురిచేస్తున్నారు. ఇది అత్యంత బాధాకరం.

Elderly Parents: చట్టం ఉన్నా.. వృద్ధులపై ఆగని వేధింపుల

పిల్లలను కని, పెంచి వారు ప్రయోజకులుగా ఎదగడానికి సర్వశక్తులు ధారపోసిన తల్లిదండ్రులను జీవిత చరమాంకంలో ఆ పిల్లలే వారిని అవమానిస్తూ, నిత్యం వేధింపులకు గురిచేస్తున్నారు. ఇది అత్యంత బాధాకరం. ఈ వేధింపులకు కులం, మతం, ధనిక, బీద తేడా లేదు. అన్ని వర్గాల వయోధికులూ వేధింపులకు గురవుతున్నారు. వయోధికులు ప్రధానంగా తమ పిల్లల నుంచే కాక, సేవకులు, ఇరుగు పొరుగు, ఇతరుల నుంచి నిత్యం వేధింపులను ఎదుర్కొంటున్నారు. కొందరు పిల్లలు జీవితాల్లో స్థిరపడిన తర్వాత తల్లిదండ్రుల యోగక్షేమాలపట్ల ఆసక్తి కనబరచడం లేదు. దీంతో తల్లిదండ్రుల పోషణ బాధ్యతను అనవసరపు ఖర్చుగా భావిస్తున్నారు. తల్లిదండ్రులను కనీసం ఫోన్లో కూడా పలకరించడం లేదు. మరికొందరు తమ తల్లిదండ్రులను సూటిపోటి మాటలతో దూషిస్తున్నారు. వారిని కించపరచడం, వేళకు భోజన సదుపాయాలు కల్పించకుండా పస్తులుంచడం, వారి వైద్య చికిత్సల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం వంటి చేష్ఠలతో కన్నవారిని వేధిస్తున్నారు. ఆస్తులను తమ పేర రాయాలని తల్లిదండ్రులను వేధిస్తూ శారీరకంగా హింసలకు గురిచేస్తున్నారు. తాము కోరుకున్న ఆస్తులు రాసివ్వలేదని.. తల్లిదండ్రులు చనిపోతే వారి అంత్యక్రియల్లో కూడా పాల్గొనని పిల్లలు ఉన్నారు. వయోధికులు తమ సంపాదనలో కొంత భాగాన్ని తమ కనీస అవసరాలకు ఖర్చు చేసుకోడానికి కూడా పిల్లల నుంచి అవరోధాలను ఎదుర్కొంటున్నారు! రాష్ట్రవ్యాప్తంగా మేము సేకరించిన సమాచారం ప్రకారం వయోధికులపై వేధింపుల్లో 35 శాతం ఆస్తుల కోసం, 30 శాతం పోషణ కోసం, 25 శాతం వైద్య చికిత్సల కోసం, 10 శాతం ఇతర కారణాల వల్ల జరుగుతున్నట్లు తెలుస్తోంది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 ప్రతి భారతీయుడికి గౌరవప్రదంగా జీవించే హక్కును కల్పించింది. అలాగే ‘తల్లిదండ్రులు, వయోధికుల పోషణ, సంక్షేమ చట్టం–2007’ ప్రతి వయోధికుడికి పోషణ, రక్షణ, వైద్య సేవలు, చికిత్సల విషయంలో అండగా ఉన్నది. వయోధికులు గౌరవప్రదంగా జీవించాలని దేశంలోని చట్టాలు చెబుతున్నాయి. మన వేదాలు, ఉపనిషత్తులు, దర్శన గ్రంథాలు, సనాతన ధర్మం అన్నీ కూడా పిల్లలకు తల్లిదండ్రులే తొలి దైవాలని ఘోషిస్తున్నాయి. అయినా వయోధికులపై వేధింపులు ఆగడం లేదు. కారణం.. చట్టాలను అమలు చేసే ప్రభుత్వ యంత్రాంగానికి, దానికి దిశానిర్దేశం చేసే పాలకులకు వయోధికుల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి లేకపోవడం.


దేశంలోని ప్రజాప్రతినిధుల్లో వయోధికులు చాలామంది ఉన్నారు. అయినా వారికి దేశంలోని సాటి వయోధికుల సంక్షేమం పట్ల తగిన శ్రద్ధ లేదనేది వాస్తవం. దీనికి ఉదాహరణలు అనేకం. వయోధికుల సంక్షేమం కోసం ‘వయోధికుల సంక్షేమ చట్టం–2007’ను తెచ్చినా ఆ చట్టం పట్ల ప్రజలకు కనీస అవగాహన కల్పించడానికి ఎవరూ కృషి చేయడం లేదు. ఒకవేళ ఈ‍ చట్టంలోని అంశాలేవైనా వయోధికుల ప్రయోజనాలకు అవరోధంగా ఉన్నాయని వయోధికుల సంఘాలు విజ్ఞప్తి చేస్తే వాటిని సవరించేందుకు కూడా కేంద్రం ‘సవరణ బిల్లు 2019’ను ప్రకటించింది. కానీ ఎంపీల ఉదాసీనత కారణంగా ఇప్పటివరకూ ఆ సవరణ బిల్లు పార్లమెంట్‌లో చర్చకు రాలేదు. వయోధికులపై వేధింపులను నిరోధించుటకు ఐక్యరాజ్యసమితి 2011 డిసెంబర్‌ 19న నాటి జనరల్‌ బాడీ సమావేశంలో ఓ తీర్మానం చేసింది. ప్రతి సంవత్సరం జూన్‌ 15ను ‘ప్రపంచ వయోధికుల వేధింపుల అవగాహన రోజు’గా పరిగణించాలని తెలిపింది. ఆ సందర్భంగా సభ్య దేశాలు సభలు, సమావేశాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించి, వేధింపుల నివారణకు కృషి చేయాలని ఐరాస పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా వయోధికులపై నానాటికీ వేధింపులు పెరిగిపోతున్నా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం ‘ప్రపంచ వయోధికుల వేధింపుల అవగాహన రోజు’న కూడా ఈ సమస్యపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆసక్తి చూపడం లేదు. అందుకు సంబంధించిన సమావేశాలను నిర్వహించడం లేదు. ఈ తరుణంలో ‘తెలంగాణ స్టేట్‌ ఆల్‌ సీనియర్‌ సిటిజన్స్‌ అసోసియేషన్‌’ తల్లిదండ్రులు, వయోధికుల పోషణ, సంక్షేమ చట్టంలో 2007లోని ముఖ్యాంశాలను సూచించే బోర్డులను రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు, మండల కార్యాలయాలు, పోలీసు స్టేషన్లు, డివిజన్‌, జిల్లా కార్యాలయాల వద్ద ఏర్పాటు చేసే బృహత్తర కార్యక్రమాన్ని 2025 మార్చి నుంచి చేపట్టింది. తద్వారా వయోధికులకు, యువతకు, ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వ యంత్రాంగానికి ఆ చట్టం పట్ల అవగాహన కలిగి వయోధికులపై వేధింపులు తగ్గిపోగలవని విశ్వసిస్తోంది. పౌరసమాజం, ప్రభుత్వ యంత్రాంగం ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని మా సంఘం కోరుకుంటోంది. n పి. నర్సింహారావు రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ స్టేట్‌ ఆల్‌ సీనియర్‌ సిటిజెన్స్‌ అసోసియేషన్‌ (రేపు ప్రపంచ వయోధికుల వేధింపుల అవగాహన రోజు)

Updated Date - Jun 14 , 2025 | 03:09 AM