ఆదిమ జాతుల అస్తిత్వ పెనుకేక
ABN , Publish Date - Jun 02 , 2025 | 01:41 AM
కెన్యాలో బ్రిటిష్ వలస పాలనకు, వలస పాలన అనంతరం పాలించిన స్వదేశీ పాలకుల దాష్టీకానికి వ్యతిరేకంగా పోరాడిన యోధుడు, చింతనాపరుడు, సామాజిక శాస్త్రవేత్త, విప్లవ రచయిత గూగీ వా థియాంగో మే 28న అమెరికా లోని జార్జియాలో కన్ను మూసాడు. ఐరోపా కేంద్రీకృత చర్చల ఆధిపత్య...

కెన్యాలో బ్రిటిష్ వలస పాలనకు, వలస పాలన అనంతరం పాలించిన స్వదేశీ పాలకుల దాష్టీకానికి వ్యతిరేకంగా పోరాడిన యోధుడు, చింతనాపరుడు, సామాజిక శాస్త్రవేత్త, విప్లవ రచయిత గూగీ వా థియాంగో మే 28న అమెరికా లోని జార్జియాలో కన్ను మూసాడు. ఐరోపా కేంద్రీకృత చర్చల ఆధిపత్య ధోరణులను తమ రచనలతో, మేధా సంపత్తితో తుత్తునియలు చేసిన వారిలో ఎడ్వర్డ్ సయీద్, గూగీ వా థియాంగో ముందు వరసలో ఉంటారు. సయీద్ 1935లో పాలస్తీనాలో, గూగీ 1938లో కెన్యాలో పుట్టారు. విషాదం ఏమిటంటే, ఇద్దరూ పుట్టిన నేల మీద రక్షణ లేక, దశాబ్దాలపాటు ప్రవాసులు గానే బతికారు. ‘ఓరియంటలిజం’ రచనతో ఎడ్వర్డ్ సయీద్; ‘డీకాలనైజింగ్ ద మైండ్’, ‘మూవింగ్ ద సెంటర్’ రచనలతో గూగీ తమవైన మేధా తాత్త్విక మార్గాల్ని రహదారులుగా వేసారు. ఈ ఇద్దరి ప్రస్తావనా లేకుండా ఆధునిక సామాజిక శాస్త్రాలు అసంపూర్ణం.
మూల వాసుల మౌఖిక గాథలను పారవశ్యంతో ప్రపంచ యవనిక మీద నిలబెట్టిన సాహసి గూగీ. తండ్రి థియాంగో ‘గికుయు’ తెగకు చెందిన ఒక విస్తాపితుడు, ఇద్దరు అన్నలు 1950ల్లో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన మౌ మౌ సాయుధ పోరాటంలో అమరులు. గూగీ బాల్యం ఈ సాయుధ పోరాటం నేపథ్యంగా గడిస్తే, యవ్వనం స్వీయపాలన వచ్చాక కొనసాగిన నియంతల పాలన నేపథ్యంగా గడిచింది. ఆంగ్ల సాహిత్యం చదువుకుని నైరోబి విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా వృత్తి జీవితం మొదలుపెట్టాడు. అధ్యాపకుడిగా ఉన్న కాలంలోనే ఆయనపై రాజ్యం కన్నెర్ర చేసింది. దీనికి కారణం వలస పాలన అనంతరం కెన్యా పాలకుల దాష్టీకాలపై ఆయన చేసిన రచనలు. మొదట ‘జేమ్స్ గూగీ’ పేరుతో ఇంగ్లీషులో రచనలు చేసిన గూగీ తదనంతరం కాలంలో వలసవాద చిహ్నమైన ‘జేమ్స్’ను తన పేరు నుండి తొలగించుకున్నాడు. ఇంగ్లీషును వదిలి మాతృభాషలైన ‘గికుయు’, ‘స్వాహిలి’ భాషలలో రాయటం మొదలుపెట్టాడు. ఈ నిర్ణయం తోనే ఆయన సాహిత్య రాజకీయ కార్యాచరణ మొదలైంది. ఆ క్రమంలో స్థానిక భాషలకు మౌఖిక సాహిత్యం ఎంత ముఖ్యమో బలంగా వాదించాడు. ఒక దశలో ఇంగ్లీష్ డిపార్టుమెంటులను రద్దు చేయాలి అనేదాకా పోయాడు.
పంతొమ్మిది వందల యాభైలలో సాయుధ రాజకీయాల తర్వాత, కెన్యా వలస పాలన నుంచి విముక్తం అయ్యాక, డెబ్బయ్యవ దశకంలో తన సహచర నాయకులు పాలకులుగా మారడం మూలంగా, గూగీ బలవంతపు ప్రవాసిగా మారాల్సి వచ్చింది. మాతృదేశాన్ని వదిలిన తర్వాత దశాబ్దాలపాటు ప్రవాసి గానే బతికాడు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో తులనాత్మక సాహిత్యం – అనువాద విభాగానికి అధిపతిగా పనిచేశాడు.
పూర్వీకులు వారసత్వంగా కాపాడుకున్న అపారమైన జానపథ కథలు, ఇతిహాసాలతోపాటు, కెన్యా సాయుధ పోరాటం భూమికగా పనిచేసిన గెరిల్లా వీరుల సాహస గాథలే గూగీ రచనల సారం. కెన్యా దేశంపై వలస పాలన తెచ్చిమోపిన ఆంగ్ల విద్య ఎలా స్థానిక భాషలను, సంస్కృతులను ధ్వంసం చేసిందో ఆయన ప్రతి రచన లోనూ చూడగలం. వలసవాద అణచివేతను ఆయనతోపాటు ఆయన సృష్టించిన పాత్రలూ ఎదుర్కోవటం ఒక విశేషం. ‘మాటిగిరి’ అనే నవలలో మాటిగిరి పాత్ర మీద పోలీసులు లుక్ అవుట్ నోటీసు కూడా ఇచ్చారు! ఆయన రచనల్లోని పాత్రలు కూడా పాలకులను వణికించాయంటే వాటి బలాన్ని, ప్రాసంగికతను అర్థం చేసుకోవచ్చు.
‘వీప్ నాట్, చైల్డ్’, ‘ద రివర్ బిట్వీన్’, ‘అ గ్రైన్ ఆఫ్ వీట్’, ‘పెటల్స్ ఆఫ్ ద బ్లడ్’, ‘డెవిల్ ఆన్ ద క్రాస్’, ‘మాటిగిరి’, ‘విజార్డ్ ఆఫ్ క్రౌ’ వంటి నవలలతో బాటు కథలు, నాటకాలు, ‘డి కాలనైజింగ్ ద మైండ్’, ‘పెన్ పాయింట్స్ అండ్ గన్ పాయింట్స్’, ‘బారెల్ ఆఫ్ పెన్’, ‘మూవింగ్ ద సెంటర్’ వంటి నాన్ ఫిక్షన్, జైలు డైరీ, యుద్ధకాలం నాటి జ్ఞాపకాలు... మొదలైనవి గూగీ ప్రసిద్ధ రచనలు. ‘‘చరిత్రలో భాష సంస్కృతులనేవి ప్రజల సామూహిక జ్ఞాపకాల నిధి’’ అంటాడు గూగీ. పూర్వీకులు వారసత్వ సంపదగా కాపాడుకుంటూ వచ్చిన ఆ నిధిని పాశ్చాత్య వలసవాదం, భాషా సామ్రాజ్యవాదం కబళిస్తున్నాయి అంటూ, ఆంగ్ల భాషా సాహిత్యాల స్థానే అంతరించిపోతున్న స్థానిక మూలవాసుల భాషలను అధ్యయనం చేయాలి అని బలంగా వాదించాడు.
వలస వాదం తెచ్చిన క్రైస్తవ మతం, పాశ్చాత్య విద్య స్థానిక తెగల మధ్య ఎలాంటి అంతర్గత విభేదాలను, సాంస్కృతిక వైరుధ్యాలను పెంచి పోషిస్తున్నాయో, ఆ రెండు సమాజాల మధ్య పారుతున్న నది సజీవమైన జీవన విధానాన్ని ఎలా కాపాడుకుంటూ వస్తున్నదో ‘ద రివర్ బిట్వీన్’ నవలలో చూడగలం. ఇది కెన్యా దేశ కథ మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోతున్న జాతులు, వారి బాషా సంస్కృతుల వలపోత. ఈ ప్రపంచంలో నల్లవాడిని తెల్లవాడు, స్త్రీని పురుషుడు, కూలీని రైతు క్రమానుగతంగా దోపిడీ చేస్తున్నారు; వీరందరిలోనూ నల్ల జాతి స్త్రీ, వ్యవసాయ కూలీ అత్యంత వ్యవస్థీకృత హింసకు బలవుతున్నారు అంటాడు ‘విజార్డ్ ఆఫ్ క్రౌ’ నవలలో.
ఇరవై తొమ్మిదేళ్ళ కిందట హైదరాబాద్లో అఖిల భారత విప్లవ సాంస్కృతిక సంస్థ జాతుల సమస్య మీద నిర్వహించిన సదస్సులో పాల్గొనటానికి గూగీ ఈ దేశం వచ్చాడు. హుస్నాబాద్లో అమరుల స్మృతిలో నిర్మించుకున్న ఆసియాలోనే అతిపెద్దదైన స్థూపాన్ని పారవశ్యంతో చూసాడు. ‘‘మీకు కనీసం అమరుల జ్ఞాపకాలను నిలబెట్టుకునే స్వేచ్ఛ అయినా ఉంది,’’ అని సంతోష పడ్డాడు. ఆనాటికే తాను కెన్యా విడిచి అమెరికాలో ప్రవాసిగా బ్రతుకుతున్న వైనాన్నీ, పుట్టిన నేల మీద ‘మౌ మౌ’ సాయుధ పోరాట కాలంలో ప్రాణాలను కోల్పోయిన సహచరులనూ యాది చేసుకున్నాడు. మళ్ళీ ఏడేళ్ళ క్రితం 2018లో హైదరాబాద్ వచ్చాడు. అప్పుడు తన బాల్య యాది చద్దిమూటను వెంట పెట్టుకుని వచ్చాడు. గూగీ కథ వింటుంటే బస్తర్ అడవుల్లోని ఆదివాసీ గూడేల్లో, తెలంగాణ మారుమూల పల్లెల్లో నీకూ నాకూ ఎదురైన ఆకలి, అవమానం, పీడన అంతా అద్దం ముందు నిలబడినట్టు ఉంటుంది.
భాషా సామ్రాజ్య వాద పెత్తనం, యూరో సెంట్రిక్ ఆలోచనల శవ పేటికకు కొట్టిన మేకులు గూగీ రచనలు. స్వాభిమాన, ప్రతిఘటన పోరాటాలు ఉన్న ప్రతిచోటా ఆయన రచనలు అనువాదం అయ్యాయి. లక్షలాది అభిమానులకు, వేలాదిమంది పరిశోధకులకు కరదీపికగా మారాయి. ఆయన పరంపరకు వేలాదిమంది వారసుల పుట్టుకొచ్చారు. ఆయన స్ఫూర్తితో ఛిద్రమైన తమ మూలాలను, కోల్పోయిన పూర్వీకుల జాడలను అక్షరీకరిస్తున్నారు. అంతేకాదు, ఆయన నలుగురు పిల్లలు కూడా రచనలను ప్రచురించారు. ఆయన కొడుకు ముకోమా వా థియాంగో పేరు మోసిన అకడమిక్. ఆఫ్రికన్ నవలా వికాసం, అస్తిత్వ రాజకీయాల మీద సాధికారత కలిగిన బుద్ధిజీవి.
‘‘నిన్ను నీవు సజీవంగా ఉంచుకోవటానికి ప్రతిఘటన ఉత్తమమైన మార్గం. అన్యాయాన్ని తిరస్కరించటమనే చిన్నపాటి రూపంలోనైనా సరే ప్రతిఘటించాలి. నీ మార్గం సరైనదని నువ్వు నమ్మితే, నీ నమ్మకాలపై నువ్వు స్థిరంగా నిలబడితే, అవే నీ ఉనికిని కాపాడతాయి,’’ అని గూగీ బలంగా నమ్మాడు. ప్రపంచవ్యాప్తంగా పోరాడే జనుల పక్షాన తన రచనలను ఒక మద్దతు వాక్యంగా నిలబెట్టాడు. బాధిత స్వరంలో ఆయన రాజేసిన కొలిమి కెన్యన్ వాడల నుంచి బస్తర్ అడవుల దాకా సజీవం గానే ఉంది.
గుఱ్ఱం సీతారాములు
77805 87586
ఇవీ చదవండి:
రింకూ సింగ్కు పెళ్లి ఫిక్స్..
స్పిన్ మాంత్రికుడు వస్తున్నాడు
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి