International Booker Prize: కన్నడ విజయం
ABN , Publish Date - May 26 , 2025 | 05:17 AM
కన్నడ రచయిత్రి బాను ముష్తాక్, అనువాదకురాలు దీప భాస్తి సంయుక్తంగా ‘హార్ట్ లాంప్’ కథల పుస్తకానికి ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ గెలుచుకున్నారు. ఈ పుస్తకం ముస్లిం మహిళల జీవితాలను ప్రతిబింబిస్తూ, తెలుగు భాషలో త్వరలో విడుదల కానుంది.

ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ను ‘హార్ట్ లాంప్’ కథల పుస్తకానికి కన్నడ రచయిత్రి బాను ముష్తాక్, అనువాదకురాలు దీప భాస్తి సంయుక్తంగా గెలుచుకున్నారు. యాభై వేల పౌండ్ల (సుమారు యాభై ఏడు లక్షల రూపాయల) బహుమతిని రచయిత్రీ అనువాదకురాలూ సమానంగా పంచుకుంటారు. ఈ బహుమతిని ఒక దక్షిణ భారతీయ భాష అందు కోవటం ఇదే మొదటిసారి. దీన్ని నవలకు గాక కథల పుస్తకానికి ఇవ్వటమూ ఇదే మొదటిసారి. ‘హార్ట్ లాంప్’ పుస్తకం ఛాయ పబ్లికేషన్స్ ద్వారా త్వరలో తెలుగులోకి రాను న్నది. బాను ముష్తాక్ కన్నడలో ‘బండాయ’ (విప్లవ) సాహిత్య ఉద్యమంలో భాగంగా 1980ల్లో రచన చేయటం మొదలుపెట్టారు. ఆమె ఇప్పటి దాకా ఒక నవల, ఒక వ్యాస సంపుటి, ఒక కవిత్వ సంపుటి, ఆరు కథా సంపుటాలు తీసుకొచ్చారు. ఈ ఆరు కథా సంపు టాలలో ఉన్న యాభై కథల నుంచి ఎంపిక చేసిన పన్నెండు కథలు ఇప్పుడు ‘హార్ట్ లాంప్’ పుస్తకంలో ఉన్నాయి. ఈ కథలన్నీ ముస్లిం మహిళల జీవితాల చుట్టూ తిరుగుతాయి. అడ్వకేట్గా తన వృత్తి జీవితంలో మార్జినలైజ్డ్ జీవితాలతో ఏర్పడిన లోతైన పరిచయమే తన రచనకు బలం అంటారు బాను ముష్తాక్. ‘హార్ట్ లాంప్’ అనువాదకురాలు దీప భాస్తి ఇప్పటికే కోట శివరామకారంత్ వంటి ప్రముఖ కన్నడ రచయితల పుస్తకాలను ఇంగ్లీషులోకి అనువదించారు. మే 20న లండన్లోని టేట్ మోడ్రన్ ఆర్ట్ గ్యాలరీలో జరిగిన ఇంటర్నేషనల్ బుకర్ అవార్డ్ వేడుకలో బాను ముష్తాక్, దీప భాస్తి చేసిన ప్రసంగాల్లోంచి కొంత భాగాన్ని ఇక్కడ ఇస్తున్నాం.
– వివిధ
బాను ముష్తాక్
‘‘ఏ కథా ‘లోకల్’ కాదన్న నా నమ్మకానికి ఈ పుస్తకం ఒక ప్రేమ లేఖ. నా కన్నడ భాషను సొంత ఇంటిలా నాతో కలిసి పంచుకున్న పాఠకులందరికీ ఈ పుస్తకం ఒక ప్రేమలేఖ. కన్నడ భాషలో రాయడం అంటే ఒక గొప్ప సంప్రదాయాన్నీ, ఈ నేలలో ప్రవహించే వివేకపు సారాన్నీ వారసత్వంగా అందిపుచ్చుకోవటం. ఏ కథా చిన్నది కాదన్న నా నమ్మకం నుంచీ, మానవానుభవం అనే పెద్ద అల్లికలో ఏ చిన్న దారాన్ని పట్టుకు లాగినా మొత్తం అల్లిక కదులుతుందన్న నా నమ్మకం నుంచీ, ఎప్పుడూ మనల్ని విడదీయటానికే చూసే ఈ ప్రపంచంలో మనం ఒకరి మనసుల్లోకి ఒకరు చేరగలిగే ఆఖరి రహస్య మార్గం సాహిత్యం మాత్రమే అన్న నా నమ్మకం నుంచీ ఈ పుస్తకం పుట్టింది. కొన్ని పేజీలకే ఐనా గానీ వారి సమయాన్ని నమ్మకంగా నాకు అప్పగించి, నా అక్షరాలని వారి గుండెల్లో స్వేచ్ఛగా తిరగనిచ్చిన ప్రతి పాఠకుడికీ- కృతజ్ఞతలు. ఈ రాత్రి ఒక ముగింపు కాదు. ఎవరూ వినని మరిన్ని మారుమూల కథలకూ, సరిహద్దుల్ని అతిక్రమించే అనువాదాలకూ, ఈ అనంత విశ్వం ప్రతి ఒక్క ‘నేను’ లోనూ ఇమిడి పోగలదని గుర్తు చేసే మరిన్ని గొంతులకూ ఈ రాత్రి ఒక దీపమై దారి చూపిస్తుందని నమ్ముతున్నాను.’’
దీప భాస్తి
‘‘ఈ ప్రపంచం కథ ఎలాంటిదా అని ఆలోచిస్తే ఇది ఒక పెద్ద చెరిపివేతల చరిత్ర అని గమనిస్తాం. ఈ చరిత్రలో ఎందరో మహిళల విజయాలు చెరిపి వేయబడ్డాయి. ప్రపంచపు మార్జిన్లలోని ఎందరో ఎలా బతికారో ఎలా ప్రేమిం చారో చెప్పే సామూహిక జ్ఞాపకాలన్నీ గుట్టుగా చెరిపివేయబడ్డాయి. ఇలాంటి ఎన్నో హింసలకి వ్యతిరేకంగా జరుగుతున్న సుదీర్ఘ యుద్ధంలో ఈ బహుమతి ఒక చిన్న విజయం. ఇలా చెరిపివేయబడిన వాటిలో అనువాదకుల శ్రమ కూడా ఒకటి. భిన్న భాషల పాఠకుల ముందుకు వారు ఎప్పటికీ చదివే వీల్లేని కథలను తెచ్చే అనువాదకుల శ్రమ ఎక్కడా గుర్తింపుకు నోచుకోక ప్రజల అవగాహనలోంచి చెరిపివేయబడింది. అందుకే రచయితలనూ, అనువాదకులనూ ఒకే వేదికపైకి తెచ్చి సమానంగా గౌర వించే ఈ బుకర్ ప్రైజ్ ప్రోత్సాహం మరువలేనిది. ‘తేనెల నదిలా, పాల వానలా, తీయని అమృతంలా’ అంటూ ఒక కన్నడ పాట కన్నడ భాషను అభివర్ణిస్తుంది. కన్నడ భూమ్మీది అత్యంత ప్రాచీన భాషల్లో ఒకటి. ఈ బహుమతి ద్వారా ప్రపంచవ్యాప్తంగా కన్నడ భాష మీద మరింత ఆసక్తి పెరిగి, మరిన్ని అనువాదాలు కన్నడ నుంచీ, కన్నడ లోకీ వస్తాయని నమ్ముతున్నాను. అలాగే ఈ ప్రయత్నం మరింత పెద్దదై దక్షిణ భారతంలోని అన్ని భాషలకూ విస్తరిస్తుందని ఆశిస్తున్నాను.’’
బహుభాషా కవి సమ్మేళనం
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న తెలంగాణ జాగృతి (అధ్యక్షులు: కల్వకుంట్ల కవిత) ఆధ్వర్యంలో ఉ.10 గంటలకు హైదరాబాద్ అబిడ్స్ బొగ్గులకుంట లోని తెలంగాణ సార్వసత పరిషత్లో ‘తెలంగాణ యువ కెరటాలు’ బహుభాషా కవి సమ్మేళనం 35ఏళ్ళ లోపు కవులు కవయిత్రులతో జరుగుతుంది. తెలంగాణ ఆత్మ, చరిత్ర, సంస్కృతి, వైభవం, సమిష్టితనం, మంచితనం అంశాలుగా కవిత్వం చెప్పవచ్చు. పాల్గొనాలనుకునే కవులు కవయిత్రులు మే 26లోపు ఈమెయిల్: kavitha . telangana@gmail.com కు తమ వివరాలు మెయిల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
తెలంగాణ జాగృతి
కవితల పోటీ ఫలితాలు
పాలపిట్ట – వాసా ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన వాసా ప్రభావతి స్మారక కవితల పోటీ ఫలితాల వివరాలు: మొదటి, రెండవ, మూడవ బహుమతులు పొందిన కవులు వరుసగా: కరిపె రాజ్కుమార్, ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్, ములుగు లక్ష్మీ మైథిలి. ప్రత్యేక బహుమతులు పొందిన ఎనిమిది మంది కవులు: దేవనపల్లి వీణావాణి, బి. కళాగోపాల్, చిత్తలూరి సత్యనారాయణ, లేదాళ్ళ రాజేశ్వరరావు, సింహాద్రి నాగ శిరీష, కె. దివాకరాచారి, పర్కపెల్లి యాదగిరి, ఎడమ శ్రీనివాసరెడ్డి. మరో తొమ్మిది మంది కవితలు సాధారణ ప్రచురణకు ఎంపికయ్యాయి.
గుడిపాటి