Victims of War: చిత్రపతి శివాజీ బొమ్మల సేన
ABN , Publish Date - Jun 15 , 2025 | 04:01 AM
బొమ్మలు నిర్భయ ప్రకాశికలు. తెగువకి, ఎదురీతకి, నిలదీతకి నిజదర్శనాలు. ఒంటి రేఖాచిత్రమైనా సరే... కోటి సిపాయిల బలగాన్ని మించిన శక్తివంతం. ఒక వ్యంగ్యచిత్రం లక్ష అక్షరాలలో పొదిగిన భావానికంటే కూడా మహా మిన్న....

బొమ్మలు నిర్భయ ప్రకాశికలు. తెగువకి, ఎదురీతకి, నిలదీతకి నిజదర్శనాలు. ఒంటి రేఖాచిత్రమైనా సరే... కోటి సిపాయిల బలగాన్ని మించిన శక్తివంతం. ఒక వ్యంగ్యచిత్రం లక్ష అక్షరాలలో పొదిగిన భావానికంటే కూడా మహా మిన్న. వందశాతం గురి తప్పని బాలిస్టిక్ క్షిపణితో సమానం. ఇవి అతి శయోక్తులు కావు. క్రూర నియంతలను, కర్కోటక చక్రవర్తులను వేలెత్తి చూపి వెక్కిరించిన కార్టూనిస్టులు, చిత్రకారుల జీవిత కథలు కోకొల్లలు. ఏ ప్రజా కళకైనా ఉండేది అంతటి పదునే. అందుకే పాలకులకు అవంటే అస్సలు గిట్టదు. పైకి వినిపించకపోవచ్చును గానీ బొమ్మలు మనతో సంభాషిస్తాయి. మనలోని ఖాళీలను ప్రేమతనంతో నింపుతాయి. శైశవ గీతాలకి కోరస్ ఇస్తాయి. మనసుకి గాయమైతే మందు పూస్తాయి. నిస్పృహ పుటని మూసేసి ఆశల మీటని సుతారంగా తడతాయి. ఈ ఊరడింపే కళా ప్రయోజనానికి సూచిక. ఈ వరుసలో ఇప్పుడు తలుచుకోవలసిన ముఖ్యులు తల్లావజ్ఝుల శివాజీ. ఆయన సీనియర్ పాత్రికేయుడు, చిత్రకారుడు, రచయిత, కళా విమర్శకుడు. ఆయన రాతలో, గీతలో హాస్యమూ, సున్నితత్వమూ సమతూకంలో ఒదిగిపోతాయి. విషయం ఎంత గాఢమైనదైనా ఇట్టే జీర్ణమైపోవడం ఆయన చిత్రాల స్వభావం. ఒకానొక కాలంలో ఆర్టిస్ట్ రాజుతో కలిసి ఆయన సృష్టించిన ‘లింగా ది గ్రేట్’ కార్టూన్ కదంబం సూపర్ డూపర్ హిట్. అంతకంటే ముందే ‘ఆ నీలి నగరిలో’ పేరుతో శివాజీ ఒక నవలిక రాశారు.
నగరానికి వచ్చిన ఒక బాలుడి జీవితంలో జరిగే సంఘటనలే ఇందులో కథాంశం. పిల్లల కోసమే శివాజీ ఎక్కువ ఆలోచిస్తారనడానికి ఇది మరొక దాఖలా. ప్రస్తుత ప్రస్తావనకి హేతువు కూడా ఇక్కడే ఉంది. గాజాలో గత కొన్ని నెలలుగా సాగుతున్న భీకర దాడుల్లో అసంఖ్యాకంగా పిల్లలు మరణించారు, మరణిస్తున్నారు. గాయపడ్డ చిన్నారుల సంఖ్య అంతకు అనేక రెట్లు అధికం. తప్పొప్పుల లెక్కలను అలా ఉంచితే, ఏ యుద్ధంలో అయినా అతిగా ఛిద్రమయ్యేది పిల్లలు, స్త్రీలు, వృద్ధుల జీవితాలే. గాజాలో ఇజ్రాయిల్ దళాల దాడుల్లో సాగుతున్న శిశువధ పట్ల ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇజ్రాయిల్ పౌరసమాజం కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న సందర్భాలున్నాయి. ఎక్కడికక్కడ కవులు, రచయితలు, గాయకులు, కళాకారులు, చిత్రకారులు సహా వివిధ శ్రేణులవారు రకరకాల రూపాల్లో నిరసనలు, ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తల్లావజ్ఝుల శివాజీ డజను వరకు చిత్రాలు వేశారు. ‘ఓ.. నౌ వెకేట్ గాజా లిటిల్ డియర్’, ‘ప్లాంట్ హోప్ @ గాజా’, ‘ఐ లవ్ వార్ ఎనీవేర్’, ‘లెట్ దేర్ బి హోప్.. గాజా’, ‘వెయిట్ యు విల్ హావ్ సమ్ మోర్.. గాజా’ వంటి క్యాప్షన్స్తో శివాజీ వేసిన ఈ చిత్రాలు కార్టూన్ శైలిలో ఉన్నప్పటికీ, వ్యంగ్యం కంటే విషాదస్పర్శే మనసుని తాకుతుంది.
జెరూసలెంలోని హిబ్రూ విశ్వవిద్యాలయం పూర్వ ఆచార్యులు డేవిడ్ షుల్మన్ ఇండియన్ స్టడీస్లో తులనాత్మక మత అధ్యయనం విభాగంలో ప్రొఫెసర్గా దీర్ఘకాలం పనిచేశారు. ఆయన కవి, చరిత్రకారుడు, ఇండాలజిస్ట్ కూడా. దక్షిణ భారత మత చరిత్ర, భారత రాజకీయాలు, ద్రవిడ భాషాశాస్త్రం, కర్ణాటక సంగీతం వంటి అంశాలలోనూ ఆయన నిష్ణాతులు. తమిళ, తెలుగు, హిందీ, సంస్కృత భాషల్లో పట్టున్న విద్యాధికుడు, -పీస్ యాక్టివిస్ట్ కూడా. ఇజ్రాయిల్ యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా ఆ దేశ పౌరసమాజంతో కలిసి అనేక నిరసన ప్రదర్శనలు నిర్వహించారాయన. శివాజీ సోదరులు తల్లావజ్ఝుల పతంజలిశాస్త్రికి షుల్మన్తో స్నేహ సంబంధాలు ఉండటంతో శివాజీ వేసిన చిత్రాలను షుల్మన్కి పంపించారు పతంజలిశాస్త్రి. వాటిని చూసిన షుల్మన్ ఎంతో ఆసక్తి కనబరిచి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఇజ్రాయిల్ పాలకుల వైఖరిని నిరసించే అక్కడి పౌరసమాజ ప్రముఖుడి ప్రశంసలందుకున్న చిత్రాలు ఈ శివాజీ బొమ్మలు. గాజాపై సాగుతున్న దాడిని వ్యతిరేకిస్తూ నేడు మధ్యాహ్నం హైదరాబాద్లోని లా మకాన్లో ‘హైదరాబాద్ ఫర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాజా’ పేరుతో ఒక కార్యక్రమం జరుగుతున్నది. ఇందులో కవి గాయకులు, చిత్రకారులు, కళాకారులు, ప్రజాసంఘాల నేతలు పాల్గొంటున్నారు. ఈ తరుణంలో శివాజీపై గౌరవంతో ఆయన చిత్రాలను పోస్టర్లుగా తీర్చి ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. యుద్ధ వ్యతిరేక చిత్రకారుడు, చిన్నారుల శ్రేయోభిలాషి శివాజీకి అభినందనలు.
- ఒమ్మి రమేష్బాబు