AP Development: తొలిపొద్దులో విజయకాంతులు
ABN , Publish Date - Jun 12 , 2025 | 06:53 AM
కూటమి ప్రభుత్వం కొలువుతీరి సరిగ్గా 12 నెలలు అయింది. గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో గాడి తప్పిన వ్యవస్థలను చక్కదిద్దుతూనే ప్రజలకు మెరుగైన పాలనను అందిస్తోంది. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా కూటమి ప్రభుత్వం పాలన కొనసాగిస్తోంది.

కూటమి ప్రభుత్వం కొలువుతీరి సరిగ్గా 12 నెలలు అయింది. గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో గాడి తప్పిన వ్యవస్థలను చక్కదిద్దుతూనే ప్రజలకు మెరుగైన పాలనను అందిస్తోంది. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా కూటమి ప్రభుత్వం పాలన కొనసాగిస్తోంది. నవ్యాంధ్రప్రదేశ్ను ప్రగతిపథంలో నడిపించేందుకు అనేక సమస్యలను, సవాళ్లను అధిగమించి పురోగమనంలో పయనిస్తోంది. ఏడాది పాలనలోనే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 70శాతం నెరవేర్చింది. యావత్ దేశం నివ్వెరపోయే ఫలితాలు సాధిస్తూ చంద్రబాబు పాలనలో రాష్ట్రం ప్రగతిపథంలో పరుగులు పెడుతోంది. దేశానికి దిక్సూచిగా నిలిచే నదుల అనుసంధానం, పి–4, వాట్సప్ గవర్నెన్స్, ఆర్టీజీఎస్, 104, 108 అంబులెన్సుల ఆధునీకరణ, సురక్షిత తాగునీరు, యోగాంధ్ర వంటి ఎన్నో కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేస్తోంది. రాష్ట్రంలో రూ.4,000 పింఛన్ అమలు దేశవ్యాప్తంగా రికార్డుగా నిలిచింది. ఇందులో చంద్రబాబు నాయుడు ఒక్కరే రూ.2,834 పెంచారు. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం కేవలం రూ.1,000 మాత్రమే పెంచింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మొదటి నెలలోనే పింఛన్ను రూ.3,000 నుంచి రూ.4,000కు పెంచింది. మహిళలు బాగుంటే రాష్ట్రం బాగుంటుందన్న ఉద్దేశంతోనే ‘దీపం–2’ పథకాన్ని ప్రారంభించి ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తోంది. రాబోయే ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తోంది. మహిళల ఆర్థిక పరిపుష్టి కోసం డ్వాక్రా సంఘాలను బలోపేతం చేసి రుణ పరిమితిని రూ.10 లక్షలు నుంచి రూ.20 లక్షలకు పెంచింది. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచింది. పేద విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు ‘విదేశీ విద్య’ పథకాన్ని పునరుద్ధరించడం, ఇంటర్మీడియట్ వరకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలుచేయడం వంటి కీలక చర్యలు ప్రభుత్వం చేపట్టింది. ‘యాక్టివ్ ఆంధ్ర’, ‘నో బ్యాగ్ డే’, ‘తల్లికి వందనం’, ‘యోగాంధ్ర’, ‘మెగా పేటీయం’ వంటి వినూత్న కార్యక్రమాలను విజయవంతంగా అమలుచేస్తోంది. ఉచిత ఇసుక విధానం ద్వారా 125 కుల వృత్తులు, వ్యాపారాలకు ప్రోత్సాహం లభించగా, 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు స్థిరమైన ఉపాధి లభిస్తోంది.
వైసీపీ ప్రభుత్వంలో వైద్య ఆరోగ్యరంగం అంపశయ్య మీద ఉంది. 108, 104 అంబులెన్సులను నేడు కొత్త సర్వీసు ప్రొవైడర్కు అప్పగించి పేదలకు మెరుగైన వైద్యాన్ని కూటమి ప్రభుత్వం అందిస్తోంది. వైసీపీ ప్రభుత్వం రైతులకు కన్నీరు తప్ప, పంట పొలాలకు ఏనాడూ సాగునీరు అందించలేదు. కానీ కూటమి ప్రభుత్వం పక్కా ప్రణాళికలతో పెండింగ్ ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవడంతో పాటు అందుబాటులో ఉన్న జలవనరులను సమర్థవంతంగా వినియోగిస్తూ సముద్రంలోకి వృథాగా పోయే జలాలను కూడా ఒడిసి పట్టేందుకు నదుల అనుసంధానాన్ని చేపట్టి, దేశానికే ఆదర్శంగా నిలిచింది. పంట దిగుబడి పెంచడంతో పాటు రైతు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. విద్యుత్ కోతలు, పవర్ హాలిడేలు, మూతపడ్డ పరిశ్రమలు, ఎండిపోయిన పంటలు గత ప్రభుత్వ హయాంలో కనిపించేవి. ఇప్పుడు సోలార్, విండ్ ఎనర్జీని ప్రోత్సహిస్తూ నాణ్యమైన విద్యుత్ను అందిస్తూ రైతన్నలకు ప్రభుత్వం అండగా నిలిచింది. 15వ ఆర్థిక సంఘం నిధులు దారి మళ్ళించకుండా రూ.1,987 కోట్లు పంచాయతీలకు విడుదల చేసింది. గత అయిదేళ్లు రోడ్లపై గోతుల్లో తట్ట మట్టిపోసిన పాపాన పోలేదు.
ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే రూ.860 కోట్లతో 20 వేల కి.మీ. రోడ్లను గుంతలరహిత రహదారులుగా మార్చడానికి చర్యలు తీసుకుంది. రాష్ట్రాభివృద్ధికి గుండెకాయ లాంటి పారిశ్రామిక రంగం పట్ల గత పాలకులు నిర్లక్ష్యం ప్రదర్శించారు. నేడు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని పారిశ్రామికవేత్తలకు వివరించి ఏడాది కాలంలో రూ.9.40 లక్షల కోట్ల పెట్టుబడులు, 8.5 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించే పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకువస్తోంది. యువగళం హామీల్లో ఒకటైన 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం శ్రమిస్తోంది. అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి కోసం పెట్టుబడుల వికేంద్రీకరణకు కృషి చేస్తూ ఇంటికో పారిశ్రామికవేత్తను తయారుచేసేలా ప్రభుత్వం పనిచేస్తోంది. ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రముఖ పరిశ్రమ, ఒక ఎంఎస్ఎంఈకి శ్రీకారం చుట్టింది. 26 జిల్లాల అభివృద్ధికి, యువతకు ఉద్యోగాల కల్పనకు దోహదపడేలా అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రజారాజధాని అమరావతిని ప్రభుత్వం శరవేగంతో నిర్మిస్తోంది. రెవెన్యూ శాఖలో సమూల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టి, వైసీపీ హయాంలో తెచ్చిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేసి, డిజిటల్ భూ రికార్డుల పునర్వ్యవస్థీకరణ ద్వారా పారదర్శకత పెంచింది. రెవెన్యూ సదస్సులు నిర్వహించి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. సుస్థిరమైన శాంతిభద్రతల ద్వారా రాష్ట్రంలో పరిశ్రమలు, వాణిజ్యం, పర్యాటక రంగం వికసించేలా ప్రభుత్వం కృషి చేస్తోంది. గంజాయి, డ్రగ్స్ వంటి నేరాలను నియంత్రించేందుకు యాంటీ నార్కోటిక్స్ టాస్క్ఫోర్స్ ఈగల్ను ఏర్పాటు చేసింది. మహిళల జోలికి వస్తే తాటతీసేలా ప్రత్యేక చట్టాలు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసింది. దూరదృష్టితో నవ్యాంధ్రప్రదేశ్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయపథం వైపు నడిపిస్తున్నారు. ఎలాంటి భేదభావం లేకుండా అర్హతే ప్రామాణికంగా పథకాలు, కార్యక్రమాలు అమలు చేయడం చంద్రబాబు సుపరిపాలనకు సజీవ సాక్ష్యం.
-అనగాని సత్యప్రసాద్ ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ,
రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ మంత్రి