Share News

Tirupati Constable: పోలీసు కానిస్టేబుల్‌ డ్రగ్స్‌ దందా

ABN , Publish Date - Jun 04 , 2025 | 07:09 AM

తిరుపతి రిజర్వు కానిస్టేబుల్ ఎం.గుణశేఖర్‌ను హైదరాబాద్ పోలీసులు డ్రగ్స్ సరఫరా కేసులో అరెస్ట్ చేశారు. ఇతను వైసీపీ నేత సహా మరో ఐదుగురితో కలిసి స్మగ్లింగ్ కార్యకలాపాల్లో భాగమైనట్టు నిరూపించారు.

Tirupati Constable: పోలీసు కానిస్టేబుల్‌ డ్రగ్స్‌ దందా

  • హైదరాబాద్‌ పోలీసుల అదుపులో తిరుపతి ఏఆర్‌ కానిస్టేబుల్‌ గుణశేఖర్‌

  • వైసీపీ నేత సహా మరో ఐదుగురు అరెస్టు

తిరుపతి(నేరవిభాగం), జూన్‌ 3(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌కు డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాలో కీలక నిందితుడైన తిరుపతికి చెందిన రిజర్వు కానిస్టేబుల్‌ ఎం.గుణశేఖర్‌ను హైదరాబాద్‌ ఎస్‌వోటీ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ఇదే కేసులో ఏ2గా ఉన్న తిరుపతి రూరల్‌ పేరూరు ప్రాంతానికి చెందిన వైసీపీ నేత ఉన్నం సురేంద్ర, మరో నలుగురిని కూడా అరెస్టు చేశారు. కాగా, గుణశేఖర్‌ 2007లో ఏపీఎస్పీ కానిస్టేబుల్‌గా చేరాడు. తర్వాత 2009లో రిజర్వు విభాగానికి బదిలీ చేసుకున్నాడు. తిరుపతి రిజర్వు యూనిట్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఆయన విధులకు తరచూ ఎగ్గొట్టడం.. ఏవో కారణాలు చెప్పి సెలవులు పెడుతుంటాడని అధికారులు చెబుతున్నారు. బ్యాక్‌ పెయిన్‌ ఉందని ఫిబ్రవరి 26 నుంచి మే 17 వరకు సిక్‌ లీవ్‌, బావమరిది పెళ్లి పేరుతో మే 31 నుంచి జూన్‌ 9 వరకు గుణశేఖర్‌ సెలవు పెట్టాడు. ఈ సమయంలోనే గుణశేఖర్‌ డ్రగ్‌ సరఫరా మాఫియాతో చేతులు కలిపినట్లు అధికారులు భావిస్తున్నారు. తిరుపతి వైసీపీ ఎంపీ గురుమూర్తి వద్ద గుణశేఖర్‌ 2022 జూన్‌ 13 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 25 వరకు గన్‌మ్యాన్‌గా చేశాడు. ఈ క్రమంలోనే సురేంద్రతో పరిచయం ఏర్పడినట్లు సమాచారం. వీరిద్దరూ తిరుపతిలో పలు స్మగ్లింగ్‌ కార్యకలాపాలు నడిపారన్న ఆరోపణలున్నాయి. తోటి కానిస్టేబుళ్ల వద్ద గుణశేఖర్‌ లక్షల రూపాయలు తీసుకుని ఎగ్గొట్టినట్లు తెలుస్తోంది. ప్లాట్‌ విక్రయిస్తామని గుణశేఖర్‌, ఆయన భార్య రేణుక గతేడాది మార్చిలో రూ.22 లక్షలు తీసుకున్నారని తిరుపతి రూరల్‌ పేరూరు ఎన్టీఆర్‌ కాలనీకి చెందిన తుంగ లక్ష్మి రెడ్డెమ్మ తెలిపారు. రిజిస్ట్రేషన్‌ చేయకపోగా, డబ్బులూ ఇవ్వకపోవడంతో సోమవారం ఆమె ఎస్పీ కార్యాలయం లో ఫిర్యాదు చేశారు. దీంతో వారిద్దరిపై మంగళవారం కేసు నమోదైంది.

Updated Date - Jun 04 , 2025 | 07:11 AM