Share News

AP Liquor Scam: కసిరెడ్డికి సుప్రీంలో దక్కని ఊరట

ABN , Publish Date - May 23 , 2025 | 11:20 AM

AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాం కేసులో రాజ్‌ కసిరెడ్డికి సుప్రీం కోర్టులో నిరాశే ఎదురైంది. కసిరెడ్డి వేసిన పిటిషన్‌ను సుప్రీం ధర్మాసనం తోసిపుచ్చింది.

AP Liquor Scam: కసిరెడ్డికి సుప్రీంలో దక్కని ఊరట
Raj Kasireddy Supreme Court

అమరావతి, మే 23: ఏపీ మద్యం కుంభకోణం కేసులో (AP Liquor Scam) ప్రధాన నిందితుడు రాజ్‌ కసిరెడ్డికి (Raj Kasireddy) సుప్రీం కోర్టులో (Supreme Court) ఊరట లభించలేదు. ఈ కేసులో తన అరెస్టును సవాల్ చేస్తూ రాజ్ కసిరెడ్డి సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈరోజు (శుక్రవారం) జస్టిస్ పార్థివాలా నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు ఇచ్చింది. కసిరెడ్డి వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. తన కొడుకు అరెస్ట్ సమయంలో నిబంధనలు పాటించడం లేదంటూ కసిరెడ్డి తండ్రి ఉపేందర్‌ రెడ్డి వేసిన పిటిషన్‌ను కూడా తోసిపుచ్చింది.


ఈ రెండు పిటిషన్లపై గత సోమవారం విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. ఈరోజు దానికి సంబంధించిన తీర్పును వెల్లడించింది. అరెస్ట్ సక్రమమా కాదా అనేదానిపై మెరిట్స్‌లో వెళ్లకుండా ఈ కేసును పూర్తిగా డిస్పోస్ చేస్తున్నామని తీర్పులో పేర్కొంది. మద్యం స్కాంలో సీఆర్పీసీ 160 ప్రకారం హైదరాబాద్‌లో ఉంటున్న తనకు నోటీసులు జారీ చేసే అధికారం ఏపీ సీఐడీకి లేదంటూ కసిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను విస్తృత ధర్మాసనానికి పంపించామని.. దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని తెలిపింది. రెగ్యులర్ బెయిల్‌ వంటి విషయాలు హైకోర్టులో చూసుకోవాలని.. ఈ విషయాలను తాము ప్రస్తావించడం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది.


అలాగే ఏసీబీ కోర్టు ఉత్తర్వుల్లో జోక్యానికి హైకోర్టు గతంలోనే నిరాకరించింది. ఆ కేసును కూడా కసిరెడ్డి తండ్రి ఉపేందర్ రెడ్డి ఈనెల 9న సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. కసిరెడ్డి, కసిరెడ్డి తండ్రి వేసిన పిటిషన్లను రెండు కలిపి జస్టిస్ పార్థివాలా, జస్టిస్ ఆర్ మహాదేవన్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారించింది. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ్‌ లూత్రా, సిద్ధార్థ అగర్వాల్‌లు వాదించగా.. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు మహేష్ జత్మలానీ, పొన్నవోలు సుధాకర్ రెడ్డి, రమేష్‌లు పాల్గొన్నారు. కసిరెడ్డి తరఫున వాదించిన మహేష్ జత్మలానీ.. కసిరెడ్డి అరెస్ట్ అక్రమమని, సీఆర్పీసీ 160 ప్రకారం మరో రాష్ట్రంలో ఉన్న వ్యక్తికి సమన్లు జారీ చేసే అధికారం ఏపీ సీఐడీ లేదని వాదించారు.


ఏప్రిల్ 21న విచారణకు స్వచ్ఛందంగా హాజరవుతానని చెప్పినప్పటికీ కూడా కసిరెడ్డిని హైదరాబాద్ ఎయిర్‌పోర్టులోనే అరెస్ట్ చేశారని, అరెస్ట్ చేసినప్పుడు లేని సెక్షన్లన్నీ కుట్రపూరితంగా రిమాండ్ రిపోర్టులో చేర్చారని ఆయన వాదించారు. అరెస్ట్ చేసినప్పుడు 409, 420 సెక్షన్ల ప్రకారం అదుపులోకి తీసుకున్నారని, రిమాండ్ రిపోర్టులో మాత్రం అవినీతి నిరోధక చట్టాన్ని చేర్చారని, రాజ్ కసిరెడ్డి ప్రభుత్వ ఉద్యోగిగా లేనప్పటికీ ఆయన గతంలో సీఎంకు ఐటీ సలహాదారుగానే పనిచేశారని.. మద్యం పాలసీతో కసిరెడ్డికి సంబంధం లేదని మహేష్ జత్మలానీ వాదించారు.


అరెస్ట్ సమయంలో ఆయన ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదని, కానీ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో మాత్రమే అభ్యంతరాలు వ్యక్తం చేశారని ప్రభుత్వం తరపు న్యాయవాది వాదించారు. ఇరువురి వాదనలు విన్న సుప్రీం కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఆ తీర్పును ఈరోజు వెల్లడించింది సుప్రీం ధర్మాసనం.


ఇవి కూడా చదవండి

ఉగ్ర కుట్రలు.. రహస్య విచారణకు సన్నద్ధం

ఎలుగుబంటి హల్‌చల్.. వణికిపోతున్న ప్రజలు

Read Latest AP News And Telugu News

Updated Date - May 23 , 2025 | 11:51 AM