SIT Custody: రెండో రోజుకు సిట్ కస్టడీ విచారణ.. నిందితులు ఏం చెప్పనున్నారో
ABN , Publish Date - May 31 , 2025 | 09:28 AM
SIT Custody: ఏపీ లిక్కర్ స్కాంలో నలుగురు నిందితులను సిట్ అధికారులు రెండో రోజు కస్టడీలోకి తీసుకున్నారు. ఈరోజు సాయంత్రం వరకు విచారణ కొనసాగనుంది.

విజయవాడ, మే 31: ఏపీ లిక్కర్ స్కాంలో (AP Liquor Scam) నిందితుల కస్టడీ కొనసాగుతోంది. ఈరోజు (శనివారం) రెండో రోజు నలుగురు నిందితులను సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఏడుగురిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. వారిలో ఏ1 కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఏ 31 ధనుంజయ్ రెడ్డి, ఏ 32 కృష్ణమోహన్ రెడ్డి, ఏ 33 బాలాజీ గోవిందప్పలను విజయవాడ జిల్లా జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్నారు సిట్ ఆఫీసర్స్. ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం వీరిని సిట్ కార్యాలయానికి తరలించి వేర్వేరుగా, కలిపి మరోసారి విచారణ చేయనున్నారు. ఈరోజు సాయంత్రం వరకు విచారణ కొనసాగనుంది.
నిన్న (శుక్రవారం) తొలిరోజు ఎనిమిది గంటల పాటు లిక్కర్ కేసు నిందితులను సిట్ ప్రశ్నించింది. నిందితులకు సిట్ అధికారులు దాదాపు వంద ప్రశ్నలు వేసి సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. కాగా.. ఏపీ లిక్కర్ స్కాంలో కీలకంగా వ్యవహరించిన నలుగురు నిందితులు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలను ఏసీబీ కోర్టు రెండు రోజుల పాటు కస్టడీకి ఇచ్చింది. నిన్న, ఈరోజు కస్టడీ విచారణ కొనసాగనుంది. నిన్న ఉదయం ఎనిమిది గంటలకు కస్టడీలోకి తీసుకున్న సిట్ అధికారులు సాయంత్రం 6 గంటల వరకు విచారించారు. దాదాపు వంద ప్రశ్నలు సంధించిన సిట్.. ప్రధానంగా పాలసీ రూపకల్పన, అమలు విధానం వరకు ఎవరెవరు ఏ విధంగా ఆదేశాలు జారీ చేశారు, ఎవరి ఆదేశాలను పాటించారనే అంశాలపై అలాగే ప్రతీ నెల వచ్చే మామూళ్లను ఏయే రూపంలో ఎవరెవరి ద్వారా ఇతర ప్రాంతాలకు మళ్లించారనే అంశాలపై ఆధారాలను సేకరించి మరీ నిందితులను ప్రశ్నించారు సిట్ అధికారులు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నలుగురికి సంబంధించిన ఆస్తులు ఏవిధంగా పెరిగాయి, ఆ ఆస్తుల కొనుగోలుకు సంబంధించి కుటుంబసభ్యుల పేరుతో ఉన్న స్థలాలు, భవనాలు, పలు కంపెనీల్లో షేర్ హోల్డర్స్గా ఉన్న అంశాలపై ఆధారాలతో సహా సిట్ అధికారులు ప్రశ్నించారు. అయితే కొన్నింటికి సమాధానాలు చెప్పిన నిందితులు, మరికొన్నింటికి తెలీదని చెప్పిన్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఈరోజు రెండో రోజు నలుగురు నిందితులను జిల్లా జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్నారు. సిట్ చీఫ్గా ఉన్న విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు నిన్న స్వయంగా నిందితులను విచారించారు. ఈరోజు కూడా ఆయన ఆధ్వర్యంలోనే మొత్తం విచారణ కొనసాగనుంది. వీరిచ్చే సమాచారం ఆధారంగా ఈ కేసులో మరికొన్ని అరెస్ట్లు జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
ఇది పీఎం, సీఎంల చొరవతోనే సాధ్యమైంది : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
ఆసియా అభివృద్ధి బ్యాంకు అధ్యక్షుడితో కేంద్ర మంత్రి భేటీ
Read Latest AP News And Telugu News